మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తీవ్ర విషాదం

by  |
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తీవ్ర విషాదం
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంత్రి మాతృమూర్తి శాంతమ్మ(78) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆమెకు ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో మృతిచెందారు. సంవత్సరం కాలం తిరగకుండానే తల్లిదండ్రులు ఇరువురు మరణించడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. శాంతమ్మ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ పట్టణానికి సమీపంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరుగనున్నాయి.

చివరిసారిగా ఆశీర్వాదాలు :

మంత్రి శ్రీనివాస్ గౌడ్ రోజూ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాతనే వివిధ కార్యక్రమాలకు వెళ్లేవారు. ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశాలకు సైతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ ఆశీర్వాదాలు తీసుకొని వెళ్లారు. అనంతరం హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం, ఆ వెంటనే బెంగళూరులో ఈగ రాష్ట్రాల సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రుల సమావేశానికి వెళ్లారు. శుక్రవారం వరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్కడే ఉన్నారు. తల్లికి గుండెనొప్పి వచ్చిన విషయం తెలిసి వెంటనే హుటాహుటిన బెంగళూరు నుండి బయలుదేరి వచ్చారు.

పలువురి నివాళి :

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మాతృవియోగం కలగడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed