33 శాతం పెరిగిన ఎక్సైజ్ సుంకం వసూళ్లు.. కారణం అదేనా ?

by  |
33 శాతం పెరిగిన ఎక్సైజ్ సుంకం వసూళ్లు..  కారణం అదేనా ?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్ సుంకం వసూళ్లు గతేడాది పోలిస్తే 33 శాతం పెరిగాయి. ఇది కరోనా ముందుస్థాయి కంటే ఏకంగా 79 శాతం అధికమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్(సీజీఏ) తాజాగా విడుదల చేసిన ఏప్రిల్-సెప్టెంబర్ గణాంకాల ప్రకారం.. 2020 మొదటి ఆరు నెలల్లో రూ. 1.28 లక్షల కోట్ల ఎక్సైజ్ సుంకం వసూళ్లు నమోదు కాగా, ఈ ఏడాది అవి రూ. 1.71 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

కరోనాకు ముందు 2019 మొదటి ఆరు నెలల్లో ఈ వసూళ్లు రూ. 95,930 కోట్లుగా ఉంది. గత రెండేళ్లుగా ఎక్సైజ్ సుంకం భారీగా పెరగడమే దీనికి కారణం. మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ సుంకం ద్వారా రూ. 3.89 లక్షల కోట్లు వసూళ్లు జరగ్గా, అంతకుముందు 2019-20లో రూ. 2.39 లక్షల కోట్లు వసూలయ్యాయని సీజీఏ గణాంకాలు తెలిపాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ సహా విమానాల్లో వాడే ఏటీఎఫ్, సహజవాయువులపై మాత్రమే ఎక్సైజ్ సుంకాన్ని కొనసాగిస్తున్నారు. మిగిలిన అన్నిటిపై జీఎస్టీ అమల్లో ఉంది. సమీక్షించిన కాలంలో గతేడాది కంటే ఈసారి అదనంగా రూ. 42,931 కోట్లు వసూలు కావడం విశేషం. కొవిడ్ మహమ్మారి పరిస్థితుల నుంచి ఆర్థికవ్యవస్థ పుంజుకుని ఇంధన వినియోగానికి డిమాండ్ పెరగడమే దీనికి కారణం.

Next Story

Most Viewed