కేసీఆర్‌కు గుడి కట్టిస్తానని చెప్పా.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బహిరంగ ప్రకటన

by  |
ex MP Konda Vishweshwar Reddy, CM KCR
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తోంది. ఇప్పటికీ రంగారెడ్డి-వికారాబాద్ జిల్లాలకు ఒక్క బొట్టు సాగు నీరు ఇయ్యలేదు. రైతులకు కృష్ణా నీళ్ళు ఇస్తానని మాటలు చెప్పిన సీఎం కేసీఆర్ మోసం చేసిండని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం బహిరంగా ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టుల పరిశీలన అని, సమీక్షలు అని, కోర్టు కేసులు అని అసంబద్ధమైన కారణాలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా మనకు దక్కకుండా తన్నుకుపోతుంటే మౌనంగా ఉంటున్నాడని, కేసీఆర్ అసమర్థుడు అని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు లేకుండానే సమీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చి మన జిల్లా ప్రజల నోట్ల మట్టి కొట్టిండని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేగాకుండా.. మరోసారి మన రంగారెడ్డి-వికారాబాద్ జిల్లాలను పూర్తిగా ఎండబెట్టడానికి కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. ఈ జిల్లా మంత్రికి, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కొంచెమైనా బాధ్యత ఉంటే సీఎం కేసీఆర్‌ను ఎందుకు అడుగుతలేరని ప్రశ్నించారు. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కొత్త నాటకానికి తెరలేపాడని ఎద్దేవా చేశాడు. కానీ మోసానికి మారు పేరైన కేసీఆర్ మాటలు నమ్మడానికి ఉమ్మడి రంగారెడ్డి-మహబూబ్‌నగర్-నల్లగొండ ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.

నా పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు..

సీఎం కేసీఆర్ మోసాలను ఎత్తిచూపిస్తానని ఈ జిల్లా రైతాంగ క్షేమం కోసం తలపెట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు తనతో పాటు చాలా మందిని అరెస్టు చేశారని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీదేవిపల్లి దగ్గర రిజర్వాయర్ కట్టాలని డిమాండ్ చేస్తూ బహిరంగ సభను నిర్వహించామన్నారు. అదే సభలో ఇచ్చిన హామీ ప్రకారం తమ జిల్లా రైతులకు సాగు నీరు ఇస్తే కేసీఆర్ గుడి కట్టిస్తానని తాను చెప్పిన మాటలు గుర్తుచేసుకున్నారు. ఆదివారం జరిగిన సమీక్షలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. కానీ సీఎం కేసీఆర్ జరిపిన సమీక్ష ప్రకటనలో రంగారెడ్డి-వికారాబాద్ జిల్లాల రైతులకు ఇచ్చిన హామీల గురించి ప్రస్తావన మాత్రం లేదని విమర్శించారు. ఇలా ఎన్ని మభ్యపెట్టే మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటన ద్వారా ప్రశ్నించారు.

Advertisement
Next Story

Most Viewed