చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు జగన్‌కు ఇవ్వాలి : హర్షకుమార్

by  |
ex mp harsha kumar
X

దిశ, ఏపీ బ్యూరో: అసైన్డ్ భూముల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులే ముఖ్యమంత్రి జగన్‌కు ఇవ్వాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ఇళ్ళ స్థలాల పంపిణీ పేరుతో దళితుల నుంచి బలవంతంగా అసైన్డ్ భూములు లాక్కున్నారని ఆరోపించారు. సీఐడీ అధికారులు అసైన్డ్ భూముల విషయంలో చంద్రబాబుపై పెట్టిన సెక్షన్లు ముఖ్యమంత్రి జగన్‌తో పాటు రెవిన్యూ మంత్రి, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌లపైనా పెట్టి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్ అసైన్డ్ భూముల లాక్కున్న విషయానికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సీఐడీ అధికారులు జగన్‌పై కేసులు పెట్టకపోతే సీఐడీ అధికారులపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, రాజశేఖర్‌ రెడ్డిలు దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను జగన్ బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు దళితులను బలిపశువులను చేసినట్లు హర్షకుమార్ ఆరోపించారు.



Next Story