మాజీ ఎమ్మెల్యే జేసీ అరెస్టు.. ఇదేనా కారణం?

by  |
మాజీ ఎమ్మెల్యే జేసీ అరెస్టు.. ఇదేనా కారణం?
X

దిశ, ఏపీ బ్యూరో: నకిలీ పత్రాలతో లారీలను అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని శనివారం ఉదయం హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరినీ అనంతపురానికి తరలించారు. నకిలీ పత్రాలను సృష్టించి బీఎస్ఈ-3 వాహనాలను బీఎస్ఈ-4 వాహనాలుగా కన్వర్ట్ చేసి 160 లారీలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు. వాహనాలకు బీమా కూడా చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ లారీలను జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే విక్రయించేశారు.

ఈ విషయమై అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులపై 12 కేసులు నమోదయ్యాయి. తాడిపత్రిలో మరో 17, కర్నూలు జిల్లాలో మరో మూడు కేసులు కూడా ఉన్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్లు కావడంతో ఆయా జిల్లాలో దాదాపు 63 లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

ఇటీవల అనంతపురంలో నాలుగు లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. వాటి రిజిస్ట్రేన్ పత్రాలను తనిఖీ చేయగా బీఎస్-3 పత్రాలను నకిలీ ఎన్‌ఓసీలతో బీఎస్-4 వాహనాలుగా కన్వర్ట్ చేసి తిప్పుతున్నట్టు గుర్తించారు. ఈ కేసులో లారీల యజమానులను అదుపులోకి తీసుకొని విచారించగా జేసీ ప్రభాకర్‌రెడ్డి నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా లారీలు సీజ్ కావడంతో లారీల కొనుగోలుదారులు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ఎదుట ఆందోళన చేశారు. ఆ సమయంలోనే పోలీసులు అతణ్ని అరెస్టు చేస్తారని భావించారు.

సుదీర్ఘకాలంగా జేసీ బ్రదర్స్ ట్రావెల్స్ రంగంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు దివాకర్ ట్రావెల్స్ బస్సులు నడిపేది. ఈ క్రమంలో బీఎస్-3 వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును అవకాశంగా తీసుకున్న దివాకర్ ట్రావెల్స్ ట్యాక్సులు తగ్గే అవకాశం ఉండటం, తక్కువ ధరకే నాగాలాండ్‌లో బీఎస్-3 మోడల్ 160 లారీలను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నాగాలాండ్‌లో కొనుగోలు చేసిన 160 లారీలను జేసీ ఉమారెడ్డి, జఠాధర కంపెనీకి చెందిన సీ గోపాల్‌రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆతర్వాత రోజుల వ్యవధిలోనే ఆ లారీలకు ఎన్ఓసీలను తీసి వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ ట్రాన్స్‌ఫర్ జరిగినప్పుడు బీఎస్-3 వాహనాలు కాస్తా బీఎస్-4గా కన్వర్ట్ అయ్యాయి. అదే సమయంలో అవి తిరిగే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ వివాదం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయాలను నాలుగు నెలల క్రితం ఆర్టీఏ కమిషనర్ బయటపెట్టారు.

తన తమ్ముడు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్‌రెడ్డి అరెస్టులపై మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పందించారు. ఈ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుందని, రూల్స్, రెగ్యులేషన్స్ లేవని, చట్టం వర్తించదని ఆయన ఆరోపించారు. చివరికి ఏసుప్రభు చెప్పినా సీఎం జగన్ వినడని, ఆయన్ని నిలువరించగల శక్తి ఒక్క ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే ఉందన్నారు.

Next Story

Most Viewed