గంటాకు షాక్..వైసీపీలో చేరిన ప్రధాన అనుచరుడు

by  |
గంటాకు షాక్..వైసీపీలో చేరిన ప్రధాన అనుచరుడు
X

దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో వైసీపీ వ్యూహరచన చేస్తోంది. గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది. వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే విశాఖను పరిపాలనా రాజధానిగా సీఎం జగన్ ప్రకటించారు. మరో రెండు నెలల్లో అమరావతి నుంచి అధికార యంత్రాంగం విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి సమయంలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి విశాఖలో విజయం వైసీపీకి తప్పనిసరైంది.

ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని చెప్పాలి. పరిపాలనా రాజధానిగా విశాఖను ఆ జిల్లా ప్రజలు అంగీకరించడం లేదన్నప్రచారం జరిగే అవకాశం ఉంది. దీంతో ఎంపీ విజయసాయిరెడ్డి గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. టీడీపీ నేతలకు వల వేస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను తమవైపునకు తిప్పుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వైసీపీకి ప్రతికూలంగా మారింది. సీఎం జగన్ స్వయంగా విశాఖ వచ్చి కార్మిక సంఘాలతో మాట్లాడారు.

అసెంబ్లీలో తీర్మానం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కార్మికులు.. ఉద్యమ కారులు ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు. ఇందులో భాగంగా మాజీమంత్రి గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ ను వైసీపీ తమ పార్టీలోకి చేర్చుకుంది. కాశీ విశ్వనాథ్ పార్టీలో చేరిక వల్ల చాలా ఉపయోగకరమని పార్టీ భావిస్తోంది. మరికొందరైతే త్వరలోనే గంటా శ్రీనివాస్ సైతం వైసీపీ గూటికి చేరుతారని ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రేటర్ విశాఖ కొర్పొరేషన్ ఎన్నికలు వైసీపీకి ఒక పెద్ద సవాల్ అని చెప్పుకోవాలి.



Next Story