పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్దం

by  |
పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్దం
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కీసర పరేడ్ ​గ్రౌండ్​ను యంత్రాంగం చదును చేసింది. ముఖ్య అతిధి, అధికారులు, అతిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్​–మల్కాజిగిరి జిల్లా ఇంచార్జీ కలెక్టర్​హరీశ్​అన్నారు. ఆగస్టు 15న జిల్లా కలెక్టరేట్ ​ఆవరణలో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం సాయంత్రం జిల్లా ఇంచార్జీ కలెక్టర్​ హరీశ్ ​జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఏవోలతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం కీసరలోని పరేడ్ గ్రౌండ్​ను పరిశీలించిన కలెక్టర్ హరీశ్​ మాట్లాడుతూ… స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జిల్లాకు ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విచ్చేయనున్నారని తెలిపారు.

అలాగే కరోనా నిబంధనలను పాటిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిలకించేందుకు వచ్చే వారితో పాటు ముఖ్య అతిధి, అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే టెంట్లు, కుర్చీలు, మంచినీటి సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే బారీకేడ్లను ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. డీఆర్‌డీవో, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖలు తమకు సంబంధించిన ఎగ్జిబిషన్ ​స్టాల్స్​ను ఏర్పాటు చేయాలని వివరించారు. రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా వచ్చి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, దీనికి గాను వేదికను ఆయా రంగుల పూలతో ఆకర్షణీయంగా అలంకరించాలని అధికారులకు నిర్ధేశించారు.

అలాగే పాఠశాలలోని విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, విశిష్ట సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించడం జరుగుతుందని కలెక్టర్ ​హరీశ్​ తెలిపారు. అనంతరం పరేడ్ ​గ్రౌండ్​ను కలెక్టర్ ​హరీశ్​ కలియదిరిగి వేదిక, స్టాల్స్​ఏర్పాటు చేసే చోటు, స్వాతంత్య్ర సమరయోధులు, మీడియా, అవార్డు గ్రహీతలు కూర్చునే ప్రాంతాలను పరిశీలించి పకడ్భందీగా ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధికారులకు వెల్లడించారు. ఆయన వెంట కీసర ఆర్డీవో రవి, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed