అంతా అప్రమత్తం.. కిరాణా దుకాణాల్లో పెరిగిన రద్దీ

by  |
Grocery
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా త్వరలో లాక్​డౌన్ విధించే అవకాశాలున్నాయంటూ అనుమానాలు పొడచూపుతున్నాయి. రాష్ట్రంలోని కరోనా కేసుల్ని చూసిన తర్వాత ప్రజల్లో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మే నెల 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడంతోనే కేంద్రం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రం కూడా నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ప్రజలు నిత్యావసరాల సరుకులను ముందుజాగ్రత్త చర్యగా కొనేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి భయపడిన కొందరు ’ఆన్‌లైన్ ’ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. డీజీపీతో సమావేశం జరిగిన తర్వాత రాష్ట్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని గందరగోళానికి గురిచేశాయి.

వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన తర్వాత లాంఛనంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. అప్పటికల్లా అన్నీ సమకూర్చుకుని సిద్ధంగా ఉండాలనుకుంటున్నారు. ప్రధాని మోడీ వారం రోజులుగా వివిధ శాఖల అధికారులతో భేటీ కావడం లాక్​డౌన్ విధింపులో భాగమేననే సందేహం లేకపోలేదు. దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసుల పెరగడంతో కట్టడికి లాక్‌డౌన్ విధించక తప్పదని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ హోంశాఖకు నివేదించినట్లు తెలిసింది.

కేంద్రం అడుగులు అటువైపేనా..?

జాతీయ ఆహార భద్రత కార్డులున్నవారికి, పేదలకు మే, జూన్ నెలలో తలా ఐదు కిలోల చొప్పున సుమారు 80 కోట్ల మందికి బియ్యం, గోధుమలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సమకూర్చేలా కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం కూడా లాక్​డౌన్​ చర్యల్లో ప్రధానమైన అంశమనే చర్చ మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుండడం, పలు పొరుగు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమలుచేస్తుండడంతో తెలంగాణ కూడా అదే బాటలోకి వెళ్ళే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సరుకులైతే కొందాం..!

లాక్​డౌన్ ప్రచారంతో గతేడాది అనుభవాల నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లలో మునుగుతున్నారు. ప్రధానంగా నిత్యావసర సరుకులు సమకూర్చునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు నెలలకు సరిపడా సరుకులను ఒకేసారి కొనుగోలు చేస్తుననారు. దుకాణాలు, సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌లో కొనుగోలుదారుల సంఖ్య పెరగడమే కాకుండా… సరుకులు కూడా రెట్టింపుగా తీసుకుపోతున్నారు. వారాంతాలు, పండుగల సమయంలో కనిపించే రద్దీ ఇప్పుడు రోజూ ఉంటోంది. ఈ నాలుగైదు రోజుల నుంచి దుకాణాల్లో కొనుగోలుదారులు పెరిగినట్లు వ్యాపారవర్గాలు చెప్పుతున్నాయి. సాధారణ రోజుల్లో నెలకు సరిపడా సరుకులు తీసుకునే వారు ఇప్పుడు రెండు, మూడు నెలల వినియోగానికి అవసరమైన మేర సరుకులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో దుకాణాల్లో కూడా స్టాక్ త్వరగా పూర్తి అవుతోందంటున్నారు.

ఆన్‌లైన్‌ కొనుగోళ్లు కూడా..!

అటు ఆన్‌లైన్‌ కొనుగోళ్లు బాగా పెరిగాయి. ఎక్కువగా నిత్యావసర వస్తువులనే ఆర్డర్‌ చేస్తున్నారు. మాములుగానైతే గంట వ్యవధిలో వచ్చే ఆర్డర్లు ఇప్పుడు రెండు, మూడు రోజుల వరకు వస్తున్నాయి. ఆన్లైన్లో గతంలో బిర్యానీ, చైనీస్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌ ఎక్కువ ఆర్డర్‌ చేసేవారు. వాటిని ఇప్పుడు తినేందుకు జనం జంకుతుండటంతో ఆ అమ్మకాలు పడిపోయాయి. అదే క్రమంలో కిరాణా సరుకుల ఆర్డర్లు పెరగడంతో వెంటనే డెలివరీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఈ- కామర్స్‌ ఉద్యోగులు చెప్పుతున్నారు. ఈసారి ఆన్‌లైన్‌ షాపింగ్లో నిత్యావసర వస్తువు కొనుగోళ్లు భారీగా పెరిగాయి. బియ్యంతో పాటుగా గోధుమపిండి, నూనె, కందిపప్పు, మినపప్పు, రవ్వ, న్యూడుల్స్‌ వంటివి ఎక్కువగా ఆర్డర్ ఇచ్చి కొంటున్నారు.

Next Story

Most Viewed