సోమవారం ప్రజా సమస్యలు, బుధవారం భూసమస్యలు- కలెక్టర్

by  |
basu
X

దిశ, వికారాబాద్ : ప్రతి సోమవారం వివిధ శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలను మాత్రమే పరిష్కరిస్తామని, ప్రతి బుధవారం ప్రత్యేకంగా ధరణి – భూ సమస్యలు మాత్రమే పరిష్కరిస్తామని కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. సోమవారం ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన “డయాల్ యువర్ గ్రీవెన్స్ ” కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 44 ఫిర్యాదులు అందాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు డయాల్ యువర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కరం కోసం ఫోన్ నంబర్ 08416256989 కు కాల్ చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ, సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న సందర్భంగా జిల్లా విద్యాధికారి, డీపీవో, జిల్లా సంక్షేమ అధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీ శాఖల అధికారులు, ఎంపీడీఓలు, ఎంపిఓలు, విద్యుత్, మిషన్ భగీరథ, మండల ప్రత్యేక అధికారులు అందరు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండ అధికారులు చర్యలు చేపట్టలన్నారు. తెగిపోయిన రోడ్లు, బ్రిడ్జిల వద్ద వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులను నియమించి ప్రజలు అటువైపు వెళ్లకుండా ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. అన్ని గ్రామాలలో సర్పంచ్‌లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్యలతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed