ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలి: అదనపు కలెక్టర్

by  |
ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలి: అదనపు కలెక్టర్
X

దిశ, నాగర్‌కర్నూల్: సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని, వినియోగదారుల హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినియోగదారుల చట్టాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులు మోసపోయినపుడు తన హక్కుల కోసం పోరాడాలని, సమాజంలో ప్రతి వినియోగదారుడు చైతన్యవంతంగా ఉండాలన్నారు. జీవితంలో చైతన్యం కోల్పోతే మోసపోతారని చెప్పారు.

కల్తీని ప్రశ్నించడం ప్రతి ఒక్కరి బాధ్యత.. దీనిని ఎవరు మరిచిపోవద్దని సూచించారు. చట్టంలో వినియోగదారులు ఏప్రాంతంలో నివాసం ఉంటే ఆప్రాంతంలోని ఫొరమ్‌లో కేసు వేయవచ్చన్నారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం భారతీయ వినియోగదారులకు గొప్ప వరమన్నారు. అనుచిత వ్యాపార ధోరణి ని అరికట్టడానికి పక్కదారి పట్టించే వ్యాపారాన్ని అరికట్టేందుకు అధికారులకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయన్నారు. ఈ అథారిటీకి నేరుగా వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వినియోగదారుల హక్కుల రక్షణ కోసం 1986లో ప్రభుత్వం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని ప్రవేశ పెట్టిందన్నారు.

వినియోగదారుల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం నూతనంగా వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 తీసుకు వచ్చిందన్నారు. ఆగస్టు 9, 2019 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. చట్టంపై ప్రజల్లో విద్యార్థులే అవగాహన కల్పించాలన్నారు. ఆన్‌లైన్‌ కొనుగోల్లపై జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉపన్యాసకులు నరసింహులు గ్యాస్ సిలిండర్ సరఫరా రుసుము అధికంగా తీసుకుంటున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు, అందుకు స్పందించిన జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు 15 కిలోమీటర్ల లోపల వరకు ఎలాంటి డెలివరీ ఛార్జీలను విధించ కూడదని తెలిపారు.

అయితే పదిహేను కిలోమీటర్లు దాటిన తర్వాత 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ విధించాలన్నారు. అందుకు భిన్నంగా వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఎర్రి స్వామి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ బాల్రాజ్, సంబందిత అధికారులు, ఉపన్యాసకులు నర్సింలు, డిటి కవిత, ఐకెపి మేనేజర్ శ్రీనివాసులు, కళాశాల లెక్చరర్లు విద్యార్థినులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed