హుజురాబాద్ ఎన్నికలు రిహార్సల్ మాత్రమే: ఈటల రాజేందర్

by  |
హుజురాబాద్ ఎన్నికలు రిహార్సల్ మాత్రమే: ఈటల రాజేందర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికలు రానున్న జనరల్ ఎలక్షన్స్‌కు రిహార్సల్స్ అని, అందుకే సీఎం భయపడుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాత నాయకులను దగ్గరికి రానీయకపోతే ఈటల ఒంటరి అవుతాడని వాళ్లు అనుకుంటున్నారన్నారు. కానీ, నమ్మిన సిద్ధాంతం కోసం పులి బిడ్డల్లా కొట్లాడే బీజేపీ కార్యకర్తలు, నాయకులు నా వెంట ఉన్నారనేది వాళ్లు గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. బెదిరిస్తే అమ్ముడుపోయే సరుకు కాదని.. బరి గీసి కొట్లాడే పార్టీ అన్నారు. తాను చేరడం వల్ల బీజేపీ పార్టీకి మంచి పేరు వస్తుంది తప్ప చెడ్డపేరు ఎట్టి పరిస్థితుల్లోనూ రాదన్నారు. వందల కోట్లు ఖర్చు చేసైనా అసెంబ్లీలో నా ముఖం కనిపించకూడదని కేసీఆర్ పంతం పట్టారని ఈటల విమర్శలు చేశారు.

ఇప్పటికే రూ. 200 కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్.. కనిపించిన వారి భుజాన కండువా కప్పి జేబులో నోట్లు పెడుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. నా రాజీనామాతో దళితులకు రూ. 10 లక్షలు వస్తున్నందున గర్వ పడుతున్నానని చెప్పారు. హుజురాబాద్, జమ్మికుంటలకు గతంలోనే రూ. 40 లక్షలు కేటాయించినప్పటికీ మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేయలేదని, ఆ డబ్బే ఇప్పుడు ఖర్చు చేస్తున్నారని ఈటల చెప్పుకొచ్చారు. కేసీఆర్ కాదు కదా ఆయన జేజెమ్మ దిగివచ్చినా ఇక్కడ టీఆర్ఎస్ గెలవలేదని, ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా.. ఇక్కడ బెదిరింపులు, ప్రలోభాలు ఆపేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


Next Story

Most Viewed