కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా విజయం నాదే: ఈటల

by  |
కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా విజయం నాదే: ఈటల
X

దిశ, జమ్మికుంట: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తన వెంటే ఉన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లి, కొత్తపల్లి, దుర్గకాలనీ, మోత్కులగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘నీ వెంట మేమున్నాం… కడుపునిండా తిని, కంటినిండా నిద్రపొమ్మని ఆడబిడ్డలు కోరుతున్నారు’ అంటూ ఈటల ఆనందం వ్యక్తం చేశారు. డబ్బుకు ఓట్లు వేస్తారనే చిల్లర ఆలోచనతో కేసీఆర్ ఉన్నారని, తనతో ఉండే వాళ్లకు డబ్బు ఆశ చూపి తమ వెంట రావాలని నీచపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులకు వెలకట్టి.. కండువాలు కప్పిన నీచపు సంస్కృతి ఇప్పుడే చూస్తున్నానని వ్యాఖ్యానించారు.

‘దసరా పండుగ ఖర్చు కోసం రూ. 500 నుంచి రూ.2 వేలు.. ఆ తర్వాత రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తారటా..! ఆ డబ్బులు కేసీఆర్ భూమి అమ్మితేనో, చెమటోడ్చి సంపాదించిన డబ్బు కాదు. అక్రమంగా కూడబెట్టిన డబ్బును మనకే పంపిస్తున్నారు‘. ఉద్యమ సమయంలో పులి బిడ్డలా కొట్లాడానని, రాబోయే రోజుల్లో కూడా అలాగే కొట్లాడుతాననే భయం కేసీఆర్‌కు భయం పట్టిందని ఈటల ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కరపత్రాలు, పోస్టర్‌లు తయారు చేయించినా, ప్రెస్‌మీట్‌లో ఉపన్యాసాలు ఇప్పించినా.. ప్రజలు నమ్మరని ధీమా వ్యక్తం చేశారు. తన మీద ప్రజలకు ఉన్న ప్రేమ చెక్కుచెదరడం లేదని, నా క్యారెక్టర్ డ్యామేజ్ చేయాలనే కుట్రతో కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. ఏం చేసినా హుజూరాబాద్ ప్రజలు నమ్మరన్నారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతారంటూ ఈటల ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్, స్థానిక నాయకులు సురేందర్ రాజు, శీలం శ్రీనివాస్, జీడి మల్లేష్, మైనార్టీ నాయకులు ఎంఏ హుస్సేన్, మహమ్మద్ జానీ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed