పొలిటికల్ జంక్షన్‌లో ఈటల… బీజేపీ,కాంగ్రెస్ నాయకుల మంతనాలు…

by  |
పొలిటికల్ జంక్షన్‌లో ఈటల… బీజేపీ,కాంగ్రెస్ నాయకుల మంతనాలు…
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌పై ఆరోపణలు, ఆయన పోర్ట్ పోలియోను తీసేయడంతో ఇప్పుడు చర్చంతా ఈటల చుట్టే తిరుగుతోంది. అయితే రాజేందర్‌తో బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా టచ్‌లోకి వెళ్లి మంతనాలు జరిపినట్టు సమాచారం. దీంతో ఆయన భవిష్యత్తును ఎలా నిర్ణయించుకుంటారోనన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీ ఢిల్లీ పెద్దలు కూడా ఈటలతో మాట్లాడారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

మరో వైపున టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి కూడ ఆయనతో మంతనాలు జరిపినట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈటల మాత్రం తన మనసులోని మాట బయటపెట్టడం లేదు. వెయిట్అండ్ సీ అన్నట్టుగా రాజేందర్ వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లి కలుస్తున్నారు. అయితే ఫైనల్ డెసిసెషన్ ఏం తీసుకుంటారోనన్న విషమే ఆసక్తికరంగా మారింది.

బండితో భేటీ..?

ఇటీవల ఈటలతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే బండి సంజయ్‌తో సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అటు బీజేపీ నాయకులు కానీ, ఈటల వర్గీయులు కాని క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఈటల ఖచ్చితంగా పార్టీ మారుతారా లేక కొత్త పార్టీ పెడతారా అన్న తర్జన భర్జనలు సాగుతున్నాయి.

బీసీ కార్డ్ పై సర్వే…

రాష్ట్రంలో బీసీ కార్డు ప్లే చేయాలన్న యోచనతో సర్వేలు కూడా నిర్వహించారన్న ప్రచారం జరుగుతోంది. స్పెషల్ టీంలు రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో సునిశితమైన సర్వే చేశాయని, ఈ విషయం అధినేత కేసీఆర్ వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సర్వే అంతా ఈటల కనుసన్నల్లోనే జరిగిందని నిఘా వర్గాలు సీఎంకు నివేదించినట్టు కూడా తెలుస్తోంది.

తండ్రి అటు.. తనయుడు ఇటా..?

ఒక్కసారిగా మారిన రాజకీయ పరిణామాలతో హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా నాయకత్వ మార్పు తథ్యమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి కౌషిక్ రెడ్డి గులాబి గూటికి చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అగ్రెసివ్ గా ఉండే కౌషిక్ రెడ్డికి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం ఆయనకు రానున్న కాలంలో హుజురాబాద్ ఇంఛార్జిగా బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. కేటీఆర్ కూడా కౌషిక్ రెడ్డి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే మరో నాయకుడు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. మొదట టీడీపీలో ఉన్న పెద్దిరెడ్డికి, సీఎం కేసీఆర్ కు సాన్నిహిత్యం కూడా ఉండడంతో ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు లేకపోలేదన్న చర్చ సాగుతోంది. త్వరలోనే ఎవరో ఒక నాయకుడు హుజురాబాద్ టీఆర్ఎస్‌లో చేరి తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది.


Next Story

Most Viewed