‘ఉత్పత్తి సామర్థ్యం కోసం రూ. 100 కోట్లు’

by  |
‘ఉత్పత్తి సామర్థ్యం కోసం రూ. 100 కోట్లు’
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ పనులకు ఇంజనీరింగ్‌, పరికరాలనందించే ప్రముఖ కంపెనీ ఎస్కార్ట్స్ ప్రస్తుత ట్రాక్టర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 1.8 లక్షల యూనిట్లకు పెంచాలని భావిస్తోంది. దీని కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ. 100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా ప్రస్తుతం ఉన్న బలమైన డిమాండ్‌ను తీర్చగలమని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటివరకు 1.2 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న సంస్థ, ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ పరిశ్రమ రెండింతల వృద్ధిని సాధిస్తోందని, దీనికోసం ఉత్పత్తిని పెంచడం అనివార్యమైందని ఎస్కార్ట్స్ గ్రూప్ సీఎఫ్‌వో భరత్ మదన్ చెప్పారు. తాము ఇప్పటికే కరోనాకు ముందు నాటి స్థాయికి చేరుకుంటున్నామని పేర్కోన్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిపై స్పందించిన ఆయన…ప్రస్తుతం స్థిరమైన డిమాండ్ కొనసాగుతోంది. ఈ ఏడాది పరిశ్రమ వృద్ధి అధికంగా ఉండనుంది. ఇదివరకు తాము సింగిల్ డిజిట్ వృద్ధిని ఆశించాము. కానీ, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పరిశ్రమ 12 శాతం వృద్ధి సాధించింది. రానున్న నెలల్లో మరింత వృద్ధిని సాధించగలమనే నమ్మకముందని భరత్ వివరించారు.

Next Story

Most Viewed