అధికారుల హామీ.. మొల్గరలో ఎరుకలి మల్లేష్‌కు అంత్యక్రియలు

by  |
అధికారుల హామీ.. మొల్గరలో ఎరుకలి మల్లేష్‌కు అంత్యక్రియలు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వినాయక నిమజ్జనం సందర్భంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గర గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన ఎరుకలి మల్లేష్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వపరంగా తగిన న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు ఇచ్చిన హామీతో ఆందోళన సద్దుమణిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా యువకుల మధ్య జరిగిన ఘర్షణతో ఎరుకల వెంకటేష్ అనే యువకుడు మృతిచెందిన నేపథ్యంలో.. బుధవారం మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మృతదేహానికి సర్పంచ్ ఇంటి ముందే అంత్యక్రియలు నిర్వహిస్తామని.. అందుకు ఏర్పాట్లు కూడా చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పది మందిపై కేసు నమోదు చేయడం జరిగిన విషయం పాఠకులకు విధితమే.

బుధవారం రాత్రి వరకు సమస్య కొలిక్కి రాకపోవడంతో గురువారం ఉదయమే జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఐదెకరాల వ్యవసాయ పొలం ఇచ్చి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు‌ను ఫోన్లో కోరారు. గ్రామ పరిసరాలలో ప్రభుత్వ భూములను గుర్తించి తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామంలో డబుల్ బెడ్ రూంలు నిర్మించే సమయంలో తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీ మధుసూదన్ రెడ్డి బాధిత కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీల మేరకు బాధిత కుటుంబం గురువారం మధ్యాహ్నం తర్వాత మల్లేష్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.


Next Story

Most Viewed