కార్యకర్తలకు ఖుష్ ఖ‌బ‌ర్‌.. రూ.5 లక్షల క్యాష్

by  |
కార్యకర్తలకు ఖుష్ ఖ‌బ‌ర్‌.. రూ.5 లక్షల క్యాష్
X

దిశ, వరంగల్ తూర్పు: టీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి శుభవార్త చెప్పారు. పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడి పని చేస్తున్నారు.. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన కార్యకర్తలకు సబ్సిడీతో కూడిన రూ.5లక్షల రుణాలు ఇచ్చేలా బడ్జెట్‌లో ప్రతిపాదించనున్నామని తెలిపారు. శివనగర్‌లోని సాయి కన్వెన్షన్ హాల్‌లో మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే న‌న్నపునేని న‌రేంద‌ర్ అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ స‌మావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్యక‌ర్తలు, నాయ‌కులు క‌ష్టప‌డి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు మంచి ఊపు తీసుకొచ్చారని కొనియాడారు. ఎన్నికల నేపథ్యంలో కార్యక‌ర్తల‌కు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఇంత‌కాలం బీజేపీ మ‌న‌ల్ని మ‌భ్యపెట్టింద‌ని ఆరోపించారు. ఇక బీజేపీ నేతల మాట‌ల‌ను ప్రజ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. తెలంగాణ బిడ్డల చిర‌కాల స్వప్నం కోచ్ ఫ్యాక్టరీ మ‌న‌కు ద‌క్కకుండా పోయింది. గిరిజ‌న యూనివ‌ర్సిటీకి పైసా నిధులివ్వలేదని మండిప‌డ్డారు. ఏమాత్రం బీజేపీ ప్రాధాన్యం లేని ఆంధ్రప్రదేశ్‌కు ఏడు మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ‌కు ఒక్కటి కూడా మంజూరు చేయ‌లేద‌ని ఆరోపించారు.

ఇక్కడ ఉన్న అస‌మ‌ర్థ బీజేపీ నాయ‌కుల వ‌ల్లే మ‌న‌కు మెడిక‌ల్ క‌ళాశాల‌లు ద‌క్కలేద‌ని విమర్శించారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డికి మాట్లాడే శ‌క్తి ఉంది..స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించే యుక్తి ఉంద‌ని కొనియాడారు. అలాంటి వ్యక్తికే మొద‌టి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నిక‌ల ఇన్‌చార్జి, పార్టీ ప్రధాన కార్యద‌ర్శి బాల‌మ‌ల్లు, రాజ్యస‌భ స‌భ్యుడు బండా ప్రకాశ్‌, మేయ‌ర్ గుండా ప్రకాశ్‌రావుతోపాటు కార్పొరేట‌ర్లు, కార్యక‌ర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed