కొత్త సచివాలయ నిర్మాణానికి అనుమతులు మంజూరు

by  |
కొత్త సచివాలయ నిర్మాణానికి అనుమతులు మంజూరు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సచివాలయం నూతన భవనానికి పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. తొలిసారి అనుమతులు సెప్టెంబరు 1వ తేదీన మంజూరుకాగా డిజైన్‌లో కొత్త మార్పులు చేయడంతో మరోసారి ‘సవరించిన అనుమతులు’ తీసుకోవాల్సి వచ్చింది. సెప్టెంబరు 25వ తేదీన కొన్ని షరతులతో రెండో అనుమతులను కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ తరపున రాష్ట్రంలోని పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ మంజూరుచేసింది. డిజైన్‌లో చేసిన మార్పుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి పర్యావరణ అనుమతులను పొందాల్సి వచ్చింది.

కొత్త సచివాలయం భవనం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, 11 అంతస్తులతో కలిపి మొత్తం 13 అంతస్తుల్లో నిర్మాణం కానుంది. సుమారు 70,315 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కాకతీయ-డెక్కనీ శైలిలో భవనం నిర్మాణమవుతోంది. మొత్తం ప్రాంగణంలో సుమారు 45.95% కేవలం వాహనాల పార్కింగ్ అవసరాలకే సరిపోతుంది. ఏక కాలంలో 1215 కార్లు, 475 మోటారు సైకిళ్ళను పార్కింగ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత రూ. 400 కోట్లతోనే అంచనాలను రూపొందించినా ఆ తర్వాత అది రూ. 617 కోట్లకు పెరిగింది. ఇందులో ఒక శాతాన్ని (రూ. 6.17 కోట్లు) పర్యావరణానికి జరిగిన ప్రమాదాన్ని భర్తీ చేయడానికి పరిహారంగా ఖర్చు చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా విడి అకౌంట్‌ను నిర్వహించాలని స్పష్టం చేసింది.

హుస్సేన్ సాగర్ జలాశయానికి సమీపంలోనే ఉన్నందున ఫుల్ టాంక్ లెవల్ ప్రాంతంలో 3,520 చదరపు మీటర్ల మేర స్థలాన్ని సచివాలయం భవనం కోసం వాడుకుంటున్నట్లు పర్యావరణ అనుమతుల్లో ఛైర్మన్, సభ్య కార్యదర్శి పేర్కొన్నారు. మరో 7,122 చదరపు మీటర్ల మేర ఎఫ్‌టీఎల్ ప్రాంతం రోడ్ల విస్తరణకు పోతోందని పేర్కొన్నారు. సచివాలయాన్ని నిర్మిస్తున్న మొత్తం 1.13 లక్షల చ.మీ. స్థలంలో గ్రీన్ ఏరియాగా 11,605 చ.మీ. (11.29%) ఉంటోందని పేర్కొన్నారు. మురుగునీటిని బైటకు వదలకుండా సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆ అనుమతుల్లో రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్-ఇన్-ఛీఫ్‌కు స్పష్టం చేశారు.

కొత్త సచివాలయ భవనానికి చెన్నై నగరానికి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని సంస్థ డిజైన్ చేయగా షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్మాణం చేసే కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఇప్పటికే గ్రౌండ్ క్లియరెన్స్ పనులు జరిగాయని, ఇకపైన నిర్మాణపులు మొదలుకావాల్సి ఉందని రోడ్లు భవనాల శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ పనులను పర్యవేక్షించడానికి పదవీ విరమణ చేసిన అధికారికి బాధ్యతలు అప్పజెప్పింది రాష్ట్ర ప్రభుత్వం.



Next Story

Most Viewed