ఒమిక్రాన్ ఎంటర్.. తెలంగాణలో ఆంక్షలు షురూ…!

by  |
Omicron virus
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా ఆంక్షలు మళ్లీ షురూ అయ్యాయి. ఒమిక్రాన్ ప్రభావంతో మాస్కు మస్ట్, భౌతిక దూరం వంటి వాటిని పకడ్బందీగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది. మాస్కు ధరించకుంటే వెయ్యి రూపాయల ఫైన్​నిబంధనను పోలీసులు సీరియస్‌గా అమలుచేయనున్నారు. ఈ నిబంధన గతేడాది నుంచే ఉన్నప్పటికీ కేసులు తీవ్రత తగ్గడంతో నాలుగు నెలలుగా ప్రభుత్వ యంత్రాంగం పెద్దగా పట్టించుకోవడంలేదు. ఒమెక్రాన్ రూపంలో మళ్లీ వైరస్ ముప్పు రానుండటంతో బహిరంగ ప్రదేశాలు, పార్కులు, పబ్బులు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రదేశాల్లో మాస్కు లేకుంటే కచ్చితంగా రూ.1000ను జరిమానా వేయనున్నారు.

మాస్కు మస్ట్ నిబంధనను స్ట్రిక్ట్​గా అమలు చేయాలని వైద్యారోగ్యశాఖ ఇప్పటికే ఎన్​ఫోర్స్​మెంట్, పోలీసు శాఖలకు స్పష్టం చేసింది. మాస్కు నిబంధనను అమలు చేయకుంటే కొత్త వేరియంట్‌ను కంట్రోల్​ చేయడం ఇబ్బందికరంగా మారుతుందన్నది. ‘మాస్కు జేబులో ఉంటే అది వ్యాక్సిన్‌తో సమానం’ అంటూ వైద్యారోగ్యశాఖ దాని ప్రాధాన్యతను వివరించింది. కేసులు తీవ్రత పెరిగితే హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, పార్కులు, పబ్లలోనూ ఆంక్షలు విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. సచివాలయంలో ఈ మధ్య ప్రతీరోజు జరుగుతున్న వైద్యారోగ్య రివ్యూలో ఈ అంశం చర్చకు వస్తూ ఉన్నది. జనం గుమికూడే ప్రదేశాల్లో ఆంక్షలు మళ్లీ షురూ అవుతాయని ‘ఫన్ డేస్​ బ్రేక్’ వార్తలో ‘దిశ’ గురువారమే నొక్కి చెప్పింది.

వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకుంటే నో ఎంట్రీ

బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారు ఇక నుంచి తప్పనిసరిగా టీకా సర్టిఫికెట్‌ను వెంట తీసుకెళ్ళాల్సిందే. హెల్త్ టీమ్‌లు రెగ్యులర్‌గా చెకప్‌లు చేయనున్నాయి. షాపింగ్ మాల్స్, హోటళ్లు, బార్లు, పబ్లు లాంటి పలు చోట్లకు వచ్చేవారిని వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటే మాత్రమే అనుమతించే నిబంధనను కూడా ప్రభుత్వం త్వరలో తీసుకురానున్నది. చాలామంది వ్యాక్సిన్ పట్ల ఉన్న భయంతో టీకా తీసుకున్నట్లుగానే బుకాయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఈ నెల చివరికల్లా టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుత ఒమిక్రాన్ ముంచుకొస్తున్న సమయంలో టీకాలు వేసుకోనివారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసింది. అందులో భాగంగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకుంటే ఆంక్షలు తప్పనిసరి చేయాలనుకుంటున్నది. వ్యాక్సిన్ వేసుకోనివారిని గుర్తించి అక్కడికక్కడే టీకాలు ఇచ్చే ఏర్పాట్లు చేసింది.

మళ్లీ కంట్రోల్ రూం…

ఒమిక్రాన్ ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ కొవిడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభమైంది. కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఇది ఇకపై 24 గంటలూ పనిచేయనున్నది. ప్రజలు 104 నెంబరుకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రతీ రోజు వివిధ జిల్లాల్లోని కరోనా తీవ్రత, వ్యాక్సినేషన్​కార్యక్రమాల విధానాన్ని కూడా పది మందితో కూడిన కంట్రోల్ రూమ్ టీమ్ పరిశీలించనున్నది. జిల్లా వైద్యాధికారులను కూడా ఈ కంట్రోల్ రూం నుంచే ఉన్నతాధికారులు సమన్వయపరుస్తారు. హాస్పిటళ్ల వివరాలను కూడా ఈ వ్యవస్థ ద్వారానే నిర్వహించనున్నది.

వైద్యారోగ్యశాఖ హెచ్చరికలు

పండుగలు, పార్టీలంటూ జనాలు గుమిగూడితే కరోనా అంటుకున్నట్లేనని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. త్వరలో రానున్న క్రిస్టమస్, న్యూ ఇయర్, కొత్త సిన్మాల విడుదల సమయంలో ప్రేక్షకులు ఎగబడడంతో వ్యాప్తి పెరుగుతుందని సూచిస్తుంది. ఇప్పటికే పెళ్లిళ్లు, పార్టీలు, ఫంక్షన్లు జనాలు రద్దీ ఎక్కువున్న చోట వైరస్ అవుట్ బ్రేక్ అయినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ర్యాండమ్​గా పాజిటివ్​లను గుర్తించారు. అవన్నీ డెల్టా వేరియంట్‌కు చెందిన కేసులలేనని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే ఇలాంటి గ్రూప్ గేదరింగ్స్ చోట వైరస్ తేలితే వ్యాప్తిని కంట్రోల్ చేయడం కష్టతరమని స్వయంగా అధికారులే ఆఫ్​ది రికార్డులో పేర్కొంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నా, ప్రజల్లో మార్పు రావడం లేదని ఆరోగ్యశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కరోనా లేదనే భ్రమలో నిర్లక్ష్యం పెరిగినట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కొత్త కరోనా రాష్ట్రంలోకి ప్రవేశించకపోయినా, వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నదని అధికారులు తెలిపారు.

జాగ్రత్తలు లేకపోతే ముప్పే…​

ఇక నుంచి కరోనా నిబంధనలు మరింత పకడ్భందీగా పాటించాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే మరో ముప్పును చవిచూడాల్సి వస్తుంది. దేశంలోకి ఒమెక్రాన్ ప్రవేశించింది. ఏ క్షణంలోనైనా మన రాష్ట్రంలోకి వచ్చే ప్రమాదం ఉన్నది. కావున అర్హులంతా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలి. దీంతో పాటు మాస్కు, భౌతిక దూరాన్ని పాటించాల్సిందే. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం వంటివి ఉన్నా వెంటనే పీహెచ్సీల్లో టెస్టులు చేయించుకోవాలి. ఆ తర్వాత స్వీయ ఐసోలేషన్లో ఉండాలి.
-డాక్టర్ జి.శ్రీనివాసరావు, డీహెచ్

Next Story

Most Viewed