చిత్రపురి భూభాగోతంపై విచారణ జరిపించాలి

by  |
cinema
X

దిశ, అంబర్‌పేట్: చిత్రపురి భూభాగోతంపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. చిత్రపురి మూడు వేల కోట్ల కుంభకోణమని, అవినీతి కమిటీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద పేద సినిమా కార్మికుల న్యాయ పోరాట దీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చాడా వెంకటరెడ్డి పాల్గొని దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిత్రపురి కాలనీలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని విమర్శించారు. న్యాయబద్ధంగా కార్మికులకు రావాల్సిన ఇళ్లను వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికులు లేకపోతే చిత్ర పరిశ్రమే లేదని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతుందని, అవినీతిని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని వర్గాల కళాకారుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి న్యాయ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

పోరాటానికి అన్నీ రాజకీయ పార్టీల పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఇంటింటికి సర్వే చేసి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ డిమాండ్ చేశారు. దళిత బంధులాగే కళాబంధు పెట్టి కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చిత్రపురి సాధన సమితి అధ్యక్షుడు కస్తూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీరభద్రం కోశాధికారి అనురాధ, జొన్నవిత్తుల, శివ కుమార్, లలిత పాల్గొన్నారు.

Next Story

Most Viewed