శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పురస్కారం

by  |
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పురస్కారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు పురస్కారాలు-2020లో శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిష్టాత్మక ‘స్వర్ణ పురస్కారం’ లభించింది. ఇంధన పరిరక్షణలో సంస్థ తీసుకున్న కార్యక్రమాలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఇంధన పొదుపు వారోత్సవాల చివరి రోజు ఆదివారం అవార్డును సీఈవో ప్రదీప్ పణికర్‌కు అందజేశారు. ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకరరావు, పీఆర్‌ఆర్డీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ అవార్డును అందించారు. రోజువారీ కార్యకలాపాలలో ఇంధన పొదుపు రీత్యా ఉత్తమ పద్ధతులు, సాంకేతిక పురోగతిని అవలంబించే సంస్థలను ఈ వార్షిక ఫోరం గుర్తిస్తుంది. న్యాయ నిర్ణేతలు ఈ పోటీలో పాల్గొన్న సంస్థలకు సంబంధించిన వివిధ కార్యకలాపాలను, వినూత్న ఆలోచన ప్రక్రియలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ ఈ పురస్కారం ఇంధన పొదుపు, పర్యావరణ సుస్థిరత విషయంలో మా నిబద్ధతకు నిదర్శనమన్నారు. జీఎంఆర్ ఇంధన, జల సంరక్షణ కార్యక్రమాలు అనేక పరిశ్రమ వేదికల మీద గుర్తించబడినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఈ గుర్తింపు చాలా ప్రత్యేకమైనదిగా వివరించారు. గడిచిన మూడేండ్లుగా జీఎంఆర్ అనుసరించే వివిధ ఇంధన సామర్థ్య పద్ధతులను పలు పారిశ్రామిక వేదికలు ప్రశంసించినట్లు చెప్పారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక కార్బన్ న్యూట్రల్ విమానాశ్రయంగా వర్ణించారు.

Next Story

Most Viewed