ఆశించి, ఊరించి.. చివరకు భంగపడ్డ సీనియర్లు

by  |
ఆశించి, ఊరించి.. చివరకు భంగపడ్డ సీనియర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పీసీసీ పీఠం మాదంటే మాదంటూ పోటీపడ్డ నేతలకు పార్టీ పదవులు దక్కలేదు. టీపీసీసీ చీఫ్​, వర్కింగ్​ ప్రెసిడెంట్లతో పాటు పలు పదవులను ప్రకటించిన ఏఐసీసీ… రాష్ట్రంలోని సీనియర్​ నేతలను పక్కన పెట్టింది. వర్గ విభేదాలను ప్రోత్సహించిన నేతలకు అవకాశం ఇవ్వలేదు. టీపీసీసీ చీఫ్​ పదవి కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్​ సీనియర్లు చాలా ప్రయత్నాలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు మధుయాష్కి, వీ. హనుమంతరావు, పొన్నం ప్రభాకర్​, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్​బాబు, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి వంటి నేతలు పీఠం కోసం పోటీ పడ్డారు. ఒక దశలో ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగారు. ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేశారు. పలుమార్లు ఏఐసీసీ దూత మాణిక్కం ఠాగూర్​ ఎదుటే విమర్శలు చేసుకున్నారు.

ఇద్దరికే ఛాన్స్..

టీపీసీసీ కుర్చీ కోసం పోటీ పడిన నేతలకు పార్టీ పదవులు దూరమయ్యాయి. రేసులో ముందున్నట్లుగా ప్రచారం జరిగిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్​బాబుకు ఎలాంటి పదవులు దక్కలేదు. టీపీసీసీ తనకే కావాలంటూ చెప్పుకొచ్చిన జగ్గారెడ్డి కొన్ని రోజుల నుంచి మాట మార్చారు. తనకు వర్కింగ్​ప్రెసిడెంట్​ ఇచ్చినా చాలన్నట్లుగా మాట్లాడారు. అనుకున్నట్టే ఆయనకు వర్కింగ్​ప్రెసిడెంట్​పదవి దక్కింది. మాజీ ఎంపీ మధుయాష్కి కూడా పోటీ పడినా.. ఆయన్ను ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న వారికి కూడా ఈసారి ఎలాంటి పదవులివ్వలేదు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్, వైస్​ప్రెసిడెంట్లలో రేవంత్​రెడ్డి మార్క్​కనిపిస్తోంది. మొదట్నుంచీ మద్దతుగా ఉంటున్న అంజన్​కుమార్​యాదవ్‌కు వర్కింగ్​ప్రెసిడెంట్లు అవకాశం దక్కింది. అదే విధంగా వైస్ ప్రెసిడెంట్లుగా మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్​రెడ్డి వంటి నేతలకు సైతం ఛాన్స్​కల్పించారు.

సీనియర్లతో భేటీ అయిన రేవంత్..

టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి శనివారం రాత్రి పలువురు సీనియర్​ నేతలతో భేటీ అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్​నేత జానారెడ్డి, షబ్బీర్​అలీతో సమావేశమైన రేవంత్… పలు అంశాలపై చర్చించారు.


Next Story

Most Viewed