ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు

by  |
ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ పథకం కింద కూలీల వేతనం రూ.211 ఉండగా అది రూ. 237కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన కూలీ రేట్లు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆ జీవోలో స్పష్టంచేశారు. ఈ కష్టకాలంలో గ్రామాల్లోని కూలీలను గ్రామీణ ఉపాధి హామీ పథకమే ఆదుకుంటోంది. రాష్ట్రంలో సుమారు 55.77 లక్షల జాబ్ కార్డులు ఉండగా ఇందులో 30.80 లక్షల జాబ్ కార్డులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సుమారు 54.82 లక్షల మంది కార్మికులు ఈ పథకం కింద ఇప్పుడు పనిచేస్తున్నారని, ఇందులో సుమారు 16.45% మంది ఎస్సీలు కాగా, 13.3% మంది ఎస్టీ కార్మికులు. రాష్ట్రంలోని ముప్పై జిల్లాల పరిధిలో ఉన్న 8,763 గ్రామ పంచాయతీల్లో ఈ కార్మికులు గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూనే పనులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వారి వేతనాన్ని పెంచాలని నిర్ణయం తీసుకోవడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

tags: Telangana, MGNREGS, Daily wage



Next Story