నో పీఆర్సీ.. ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించేనా?

by  |
నో పీఆర్సీ..  ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: “ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులు, మెప్మా, సెర్ప్​, ఉపాధి హామీలో పని చేస్తున్న వారందరికీ 30 శాతం ఫిట్​మెంట్​ అమలు చేస్తున్నాం. మొత్తం 9 లక్షలకుపైగా ఉద్యోగులున్నారు. 30 శాతం ఫిట్​మెంట్​ను ఏప్రిల్​ నుంచి ఇస్తాం. ఏప్రిల్​, మేలో పెరిగిన వేతనాన్ని ఏరియర్స్​లో ఏడాదిలో ఎప్పుడైనా జమ చేస్తాం. జూన్​ నుంచి పెరిగిన వేతనాలు ఇస్తాం..” సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో చెప్పిన వ్యాఖ్యలివి. కానీ ఉద్యోగుల వేతన సవరణలో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులతో అంగన్​వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులతో పాటుగా పలు విభాగాల ఉద్యోగులకు వేతన సవరణ పెండింగ్​లోనే ఉంది.

పనికిరాని జీవోలేనా..?

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్​, ఔట్ సోర్సింగ్​ ఉద్యోగులతో పాటుగా అంగన్​వాడీలు, ఆశావర్కర్లు, మెప్మా సిబ్బంది, ఉపాధి హామీ, సెర్ప్​ సిబ్బందికి జూన్​ నుంచి వేతన సవరణ అమలు చేస్తున్నట్లు శాఖల వారీగా జీవోలు జారీ చేశారు. మున్సిపల్​ అడ్మినిస్ట్రేటివ్​తో పాటు జీహెచ్​ఎంసీలో పని చేసే వారికి కూడా వేతనాలు పెంచుతున్నట్లు జీవోలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు వారికి రూపాయి కూడా పెంచలేదు. అంతేకాకుండా పెరిగిన వేతనాల ప్రకారం జూన్​ నెల నుంచి ఏరియర్స్​ విడుదల చేస్తామని ముందు నుంచి చెప్పిన అధికారులు ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ శాఖల రెగ్యులర్​ ఉద్యోగులకు మాత్రమే ఏరియర్స్​ జమ చేశారు. కానీ కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​తో పాటు ఆయా శాఖల్లోని ఉద్యోగులకు ఇంకా ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రంలో వేతన సవరణపై క్లారిటీ కరువైంది.

పీఆర్సీ కూడా విడుతల్లోనే..?

ఉద్యోగుల వేతనాల విషయంలోనే ప్రభుత్వ తీరు అధ్వాన్నంగా మారిందనే ఆరోపణలున్నాయి. ప్రతినెలా వేతనాలను జిల్లాల వారీగా ఒక్కో తేదీన జమ చేస్తున్నారు. దీంతో ప్రతినెలా 18వ తేదీ వరకు వేతనాలు జమ అవుతున్నాయి. ఇప్పుడు విద్యాశాఖ పరిధిలోని కొంతమంది కేజీబీవీల్లో పనిచేసే వారికి మాత్రం ఈ నెల నుంచి వేతనాల పెంపు అమలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలోని అన్ని శాఖల్లోని కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులతో పాటుగా అంగన్​వాడీలు, హోంగార్డులకు ఇంకా వేతన పెంపు చేయడం లేదు. తాత్కాలిక పద్దతిలో పనిచేసే వైద్యారోగ్య శాఖలో కూడా అదే పరిస్థితి. అయితే వీరి వేతన పెంపులో కూడా విడుతలు వారీగా అమలు చేస్తారని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఒక్కో విభాగానికి ఒక్కో నెల పెంచుతారంటున్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా ఈ ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందే అవకాశాల్లేవ్​.


Next Story

Most Viewed