యాక్సెంచర్‌పై ఉద్యోగుల సంఘం ఫిర్యాదు!

by  |
యాక్సెంచర్‌పై ఉద్యోగుల సంఘం ఫిర్యాదు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ సేవల దిగ్గజ సంస్థ యాక్సెంచర్ (Accenture) ఇటీవల ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్ (National Information Technology Employees Senate)కి పలువురు ఉద్యోగులు ఫిర్యాదులు చేశారు. బలవంతపు చర్యల ద్వారా ఉద్యోగులు రాజీనామా చేయాల్సి వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, పూణెలో ఉన్న కంపెనీలోని 300 మందికి పైగా ఉద్యోగులను యాక్సెంచర్ సంస్థ బెంచ్‌కి పరిమితం చేసిందని, వీరంతా ఇప్పుడు వేతనాలు, ఉద్యోగ భయాలను వ్యక్తం చేస్తున్నారు. యాక్సెంచర్ కంపెనీ మహారాష్ట్ర ప్రభుత్వం మార్చిలో జారీ చేసిన ఆదేశాలను, నియమాలను, నిబంధనలను ఉల్లంగించిందని ఎన్ఐటీఈఎస్ (National Information Technology Employees Senate) లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

యాక్సెంచర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తొలగింపునకు సంబంధించి పూణె, ఇంకా ఇతర నగరాల్లోని ఉద్యోగుల నుంచి తమ ఫిర్యాదులు వస్తున్నాయని, వారు బలవంతపు రాజీనామాకు సిద్ధపడాలని, కరోనా సంక్షోభంలో వ్యాపార లాభదాయకతకు సహకరించాలని కోరుతున్నారని పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ మనుగడ ప్రమాదకరంగా మారడంపై, వారి కుటుంబాల గురించి ఎన్ఐటీఈఎస్ (National Information Technology Employees Senate) ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, యాక్సెంచర్ సంస్థ మాత్రం, ఈ తొలగింపు ప్రక్రియ వార్షిక పనితీరు ఆధారంగా ఉంటుందని, సంస్థ నిర్వహణలో భాగంగా ప్రతి ఉద్యోగి పనితీరును అంచనా వేస్తామని, సంస్థకు తగిన నైపుణ్యం ఉన్నవారిని కొనసాగిస్తామని తెలిపింది. ప్రస్తుత ఏడాదిలో సంస్థలోని అన్ని విభాగాల్లో, అన్ని స్థాయిలలో నైపుణ్యం కొరవడిన 5 శాతం మందిని తొలగించనున్నట్టు కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Next Story