ఉద్యోగుల మెడపై వేలాడుతున్న కత్తి.. ఎందుకంటే ?

by  |
cs-somesh-kumar 1
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విభజన గండం పొంచి ఉంది. ప్రతి ఉద్యోగి నుంచి ఆఫ్షన్​ తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్​ చేశాయి. ఈ మేరకు ప్రభుత్వమూ అంగీకరించింది. గత వారం నుంచే ఆఫ్షన్లు మొదలుపెడుతామని సీఎస్​ సోమేశ్​ కుమార్​ ప్రకటించారు. కానీ.. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. మరోవైపు రాష్ట్రపతి ఉత్త్వరులను అనుసరించి ఈ నెలాఖరు వరకు ఉద్యోగుల విభజన పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పుడు హడావుడిగా ఉద్యోగుల ఆఫ్షన్లతో సంబంధం లేకుండా విభజన చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఆయా శాఖల ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఈ లెక్కన విభజన చేస్తే పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఉద్యోగవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

విభజన ప్రక్రియకు కసరత్తు

రాష్ట్ర ఉన్నతాధికారులు సరికొత్త ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. ముందుగా విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆఫ్షన్లు తీసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దాదాపు 52 విభాగాల్లో రెండు లక్షల మందికిపైగా ఉద్యోగుల నుంచి ఆఫ్షన్లు తీసుకోవాలంటే కనీసం వారం, పది రోజులు పడుతుంది. కానీ ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా విభజన చేపట్టాలని సీఎస్​ నేతృత్వంలోని కమిటీ భావిస్తోంది. ఉద్యోగుల నుంచి ఎలాంటి ఆఫ్షన్లు, దరఖాస్తులు తీసుకోకుండానే విభజన చేయనున్నారు. ఇలా చేస్తే చాలా మంది ఉద్యోగులకు స్థానికత, జిల్లాల సమస్యలు రానున్నాయి. ముందుగా విభజన పూర్తి చేసి ఆ తర్వాత సవరణలకు ఆఫ్షన్లు తీసుకుంటామని ఉద్యోగులను సముదాయించే పనిలో పడ్డారు.

గడువు లేదనే సాకు

ఉద్యోగుల విభజనపై ప్రభుత్వం దాదాపు రెండు నెలల నుంచి సాగదీస్తూ వచ్చారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ తరఫున కూడా సీఎస్​ను కలిసి చర్చించారు. ఈ సమావేశంలోనే ఈనెల 14 నుంచి ఆఫ్షన్లు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ దానిపై ముందుకెళ్లలేదు. అటు ఉద్యోగ సంఘాలు జిల్లాల వారీగా జనాభా ప్రాతిపదికన కేడర్​ స్ట్రెంత్​ పూర్తి చేయాలంటూ డిమాండ్​ పెట్టాయి. దీనిపై కూడా సీఎస్​ కమిటీ క్లారిటీ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరి నుంచి ఆఫ్షన్లు తీసుకున్న తర్వాతే విభజన చేయాలంటూ ఉద్యోగసంఘాల నేతలు పట్టుబట్టారు. కానీ ఉన్నతాధికారులు అనుకున్నదే చేస్తున్నారు. అసలు ఉద్యోగుల అంశాలను పరిగణనలోకి కూడా తీసుకోవడమే లేదు. ఇప్పుడు సమయం లేదనే సాకుతో హడావుడిగా విభజన చేస్తే చాలా సమస్యలు వస్తాయని ఉద్యోగవర్గాల్లో భయం నెలకొంది. దీనిపై సమాధానం చెప్పేందుకు కూడా అధికారులు నోరెత్తడం లేదు.

ఉద్యోగుల లెక్కలు ఏమయ్యాయి..?

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలపై ఇంకా స్పష్టత రావడం లేదు. అసలు దీనిపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుందా.. అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రతినెలా వందల కోట్లు వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగుల వివరాలు లేకుండానే ఎలా విడుదల చేస్తున్నదంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా కొలువుల భర్తీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో దాదాపు ఏడు నెలల నుంచి ఉద్యోగుల వివరాలపై సాగదీస్తూనే ఉన్నారు. మరోవైపు ఉద్యోగులు ఎంతమంది అనే విషయాన్ని ప్రభుత్వం దాచి పెడుతుందని ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపిస్తున్నారు.

ఉద్యోగుల లెక్కలు దాస్తున్నది..

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల లెక్కలను కావాలనే దాస్తోంది. కొత్త జిల్లాల వారీగా కేడర్​ స్ట్రెంత్​ ఖరారు చేయాల్సి ఉంటోంది. కేడర్​ స్ట్రెంత్ ఖరారు చేస్తే.. మొత్తం ఉద్యోగుల లెక్క తెలిసిపోతోంది. అప్పుడు ఖాళీలు మొత్తం బయటకు వస్తాయి. ఖాళీలను చూపించాల్సి వస్తుందనే కారణంతోనే ఈ లెక్కలు తీయడం లేదు.
చిలగాని సంపత్​కుమారస్వామి, తెలంగాణ ఎంప్లాయీస్​ అసోసియేషన్​ అధ్యక్షుడు

Next Story

Most Viewed