50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేడు కార్యదర్శుల అత్యవసర భేటీ

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు క్షేత్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. జోనల్ విధానంతో చిక్కులు లేకపోయినా భర్తీ ప్రక్రియలో ఎదురయ్యే చిక్కులను అధిగమించడానికి అవలంభించాల్సిన చర్యలపై ఆదివారం అత్యవసర భేటీ జరుగుతున్నది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ భేటీకి హాజరుకావాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శనివారం సర్క్యులర్ జారీ చేశారు. ఇప్పటికే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో, వాటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో ఎలా భర్తీ చేయాలి తదితర అంశాలపై ఈ అత్యవసర సమావేశంలో చర్చ జరగనున్నది.

అన్ని శాఖల అధికారులు, రిక్రూట్‌మెంట్ వ్యవహారాలతో సంబంధం ఉన్న కిందిస్థాయి అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఆయా శాఖల నుంచి పోస్టుల వివరాలన్నీ అందినందున ప్రభుత్వం అనుకుంటున్న 50 వేల ఉద్యోగాలతో పోలిస్తే ఎలాంటి తేడాలు ఉండే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ఎలాంటి మార్పులు చేర్పులు అవసరమవుతాయని, ప్రాధాన్యతల్లో ఎలాంటి మార్పులు చేయాల్సి ఉంటుంది తదితర అంశాలపై ఒక్కో శాఖకు సంబంధించి పది నిమిషాల పాటు చర్చించి నిర్ణయం తీసుకునేలా షెడ్యూలు ఖరారైంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగే ఈ సమావేశానికి ఉన్నతాధికారులంతా హాజరవుతున్నారు. ఆయా శాఖలకు సంబంధించి తాజా వివరాలను కూడా తీసుకురావాల్సిందిగా నొక్కిచెప్పారు.

ప్రతీ శాఖలో కేటగిరీ, పోస్టు పేరు, దాని హోదా, మంజూరైన పోస్టులు, ఖాళీగా ఉన్న పోస్టులు లాంటి వివరాలన్నీ ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. మొత్తం 22 శాఖలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం భోజనం సమయం వరకు కంటిన్యూగా సమావేశాన్ని నిర్వహించేలా టైమ్ టేబుల్ తయారైంది.



Next Story

Most Viewed