భారత టెలికాం రంగంలోకి ఎలన్ మస్క్!

by  |
భారత టెలికాం రంగంలోకి ఎలన్ మస్క్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ భారత టెలికాం రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాడు. తన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్ అనుబంధంగా ఉన్న ‘స్టార్ లింక్’ ఇంటర్నెట్ సేవలను భారత్‌లోనూ ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. దీనికోసం ఇప్పటికే భారత్‌లో ప్రీ బుకింగ్‌లను సైతం ప్రారంభించినట్టు తెలుస్తోంది. 2022 నుంచి ‘స్టార్ లింక్’ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఎలన్ మస్క్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. హై-క్వాలిటీ ఇంటర్నెట్ సదుపాయాలను మారుమూల ప్రాంతాలకు కూడా అందించాలనే లక్ష్యంతో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది.

ఈ ఇంటర్నెట్ ద్వారా 50ఎంబీపీఎస్ నుంచి 150 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 150 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలను అందుతున్నాయని, రానున్న రోజుల్లో 1జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగించవచ్చని సంస్థ అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రారంభించిన ప్రీబుకింగ్ ధరను రూ. 7,200గా నిర్ణయించగా, కంపెనీ వెబ్‌సైట్‌లో ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి ఈ సేవలను అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ప్రీబుకింగ్ అనంతరం నెలవరీ ఎంత వసూలు చేయనున్నారనే దానిపై కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గతేడాది సెప్టెంబర్‌లో దేశీయ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు స్పేస్ఎక్స్ ఈ ఇంటర్నెట్ సేవల కోసం లేఖను రాసింది. అన్ని రకాల అనుమతులు లభిస్తే గనక 2022 నుంచి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు భారత్‌లో ప్రారంభం కానున్నాయి.


Next Story

Most Viewed