ఆ సేవల భారత్ కు అందిస్తాం : ఎలాన్ మస్క్

by  |
elon-musk
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన ఎలక్ట్రిక్ కార్లను దేశీయ మార్కెట్లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుండగా, తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఎలన్ మస్క్‌కు చెందిన ‘స్టార్ లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రస్తావించారు. దీనికి అవసరమైన కేంద్రం అనుమతుల కోసం వేచి ఉన్నట్టు ఎలన్ మస్క్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల కోసం సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను వాడుతున్నారు. ఇప్పటివరకు సముద్రపు లోతుల్లో 13 లక్షల కిలోమీటర్ల పొడవైన 428 ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఎలన్ మస్క్ ఇప్పటికే ఆప్టిక్ కేబుళ్లకు బదులుగా శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ‘స్టార్ లింక్’ అనే ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా రానున్న రోజుల్లో మొత్తం 4 వేలకు పైగా శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 1,700 శాటిలైట్లను పంపించారు. వీటి సాయంతో అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూరప్ సహా 14 దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నారు. త్వరలో భారత్‌లో కూడా శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ట్విటర్ వేదికగా ఒక యూజర్, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించగా, ఎలన్ మస్క్ బదులిచ్చారు. భారత టెలికాం శాఖ నియంత్రణ నుంచి అవసరమైన అనుమతులు రాగానే మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. కాగా, దేశీయంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించేందుకు కేంద్రం టెలికాం విభాగం అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.


Next Story

Most Viewed