మోడీ, షా ద్వయానికి శృంగభంగం

by  |
CPI National Secretary Narayana
X

దిశ, తెలంగాణ బ్యూరో : అనవసర ప్రతిష్టకుపోయి మోడీ, అమిత్​షాలు తమనుతాము మరుగుజ్జుగా మార్చుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఆయన విశ్లేషిస్తూ మోడీ– షా కవలల కీర్తి పటాపంచలయిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే కేరళ సీఎం పినరయ్ విజయన్ పై అనైతిక బాణాలొదిలి నవ్వులపాలయ్యారని చురకలు అంటించారు. కేరళలో బీజేపీకి శృంగభంగం జరిగిందని స్పష్టం చేశారు. అన్ని అనైతిక ప్రయత్నాలను పటాపంచలు చేస్తూ కేరళప్రజలు ఎల్డీఎఫ్ ను గెలిపించి బీజేపీ చెంప చెళ్ళుమనిపించారని వ్యాఖ్యానించారు.

తమిళనాడులో అక్కడి సంక్షోభాన్ని సృష్టించి బ్లాక్ మెయిల్ చేసి ఎన్నికల ఒప్పందం చేసుకున్న బీజేపీ.. ఎఐడీఎంకే కొంపముంచిందని తెలిపారు. డీఎంకే నేత స్టాలిన్ ముందు చూపుతో విశాల వేదికను బలపరిచారని అన్నారు. బెంగాల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ రాజకీయ నైతిక సూత్రాలన్ని తుంగలో తొక్కి మమతబెనర్జిపై అధర్మ యుద్దం చేశారని దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీల మధ్య సాగిన హోరాహోరీ పోరాటంలో “కాంగ్రెస్ వామపక్షాలు ” సమష్ఠిగా పోరాటం చేసినా నిరూపయోగం అయిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అసమర్దత కారణంగానే పుదుచ్చేరిలో ఎన్డీఏ కుటమికి కాస్త కలసి వచ్చిందని తెలిపారు. ఏపీలోని తిరుపతి పార్లమెంట్, తెలంగాణాలో సాగర్ శాసనసభ ఉపఎన్నికలలో ప్రగల్బాలు పలికిన బీజేపీకి చేదు ఫలితాలు మిగిలాయని అధికార పార్టీలైన వైసీపీ, టీఆర్ఎస్ లు విజయం సాధింయాయని పేర్కొన్నారు.

ఈ ఫలితాల తర్వాతే బీజేపీ అసలు స్వరూపాన్ని చూపబోతున్నదని, బుసలు కొడుతున్న ఆ పార్టీని వామపక్షాలు ప్రజాస్వామ్య లౌకికశక్తుల కలయికతో రాజకీయ ప్రతిఘటన చేయాల్సిన అవసరముందని హెచ్చరించారు.


Next Story

Most Viewed