వీవీ ప్యాట్‌‌ల‌ తరలింపుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్లారిటీ

by  |
వీవీ ప్యాట్‌‌ల‌ తరలింపుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్లారిటీ
X

దిశ, కరీంనగర్ సిటీ : హుజూరాబాద్ బైపోల్స్‌లో అక్రమాలు జరిగాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సీహెచ్ రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని కొత్తపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గం ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని, 86.64 శాతం పోలింగ్ నమోదైందని గుర్తు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు, పోటీచేసిన అభ్యర్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని, కౌంటింగ్‌కు కూడా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సహకారం అందించాలని కోరారు. శనివారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో భాగంగా.. (పోలింగ్ కేంద్రం 200లో) వీవీ ప్యాట్‌లో సాంకేతిక సమస్య రావడంతో మొరాయించిందని స్పష్టం చేశారు. పనిచేయని వీవీ ప్యాట్ స్థానంలో.. సెక్టోరల్ అధికారి రిజర్వ్‌లో ఉంచిన వీవీ ప్యాటును అందజేశారన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి ప్రిసైడింగ్ అధికారి, సెక్టోరల్ అధికారి, పోలింగ్ సిబ్బంది, ఎస్కార్ట్ పోలీసులతో ఆర్టీసీ బస్సులో ఈవీఎం యంత్రాలతో కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూములకు తీసుకొచ్చారని తెలిపారు.

అలాగే, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు పనిచేయని వీవీ ప్యాట్‌ను గోడౌన్‌లో అప్పగించుటకు వెళ్తున్న సమయంలో.. ఈ దృశ్యాలను అనుమానంతో ఒకరు వీడియో తీసి వైరల్ చేస్తున్నారని , ఆ పుకార్లను నమ్మవద్దని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి కోరారు. ఈ విషయంపై ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ప్రతినిధులకు వివరించగా వారు కూడా సమ్మతం తెలిపారని చెప్పుకొచ్చారు. పోలింగ్‌లో వినియోగించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్‌లను స్ట్రాంగ్‌ రూములో సేఫ్‌గా ఉంచామని.. సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు నమ్మకూడదని ఆయన సూచించారు.



Next Story

Most Viewed