ఆక్సిజన్ అందక వైద్యుడితో సహా 8 మంది మృతి

by  |
oxygen cylinder
X

న్యూఢిల్లీ: దేశరాజధానిలో వారం వ్యవధిలోనే మరోసారి ఆక్సిజన్ అందక పేషెంట్లు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని బత్రా హాస్పిటల్‌లో శనివారం ఉదయం ఆక్సిజన్ అందక ఓ వైద్యుడు సహా ఎనిమిది మంది పేషెంట్లు కన్నుమూశారు. హాస్పిటల్‌లో ఉదయం 11.45 గంటలకే ఆక్సిజన్ నిల్వలు కరిగిపోయాయి. అప్పటికే ప్రాణవాయువు కోసం ప్రభుత్వానికి అత్యసవర సందేశాన్ని పంపింది. ప్రాణవాయువు సప్లై మరో గంటలో వస్తుందనగా గ్యాస్ట్రో ఎంటరాలజీ యూనిట్ హెడ్ డాక్టర్ ఆర్‌కే హిమథాని, మరో ఏడుగురు పేషెంట్లు మరణించారు. ఆక్సిజన్ నిల్వలు అయిపోయాక ఒక గంట ఇరవై నిమిషాల తర్వాత సప్లై అందిందని హాస్పిటల్ అధికారులు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేశారు. హాస్పిటల్‌లకు మధ్యాహ్నం 1.30 గంటలకు ఆక్సిజన్ ట్యాంకర్ వచ్చిందని, అప్పటికే ఎనిమిది మంది మరణించారని వివరించారు. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. సకాలంలో ఆక్సిజన్ పంపడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, ఢిల్లీకి కేటాయించిన 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తప్పక అందజేయాలని ఆదేశించింది..

Next Story

Most Viewed