- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సొంత ప్రాంతాన్ని కాపాడుకోలేదు కానీ.. మనపై యుద్ధం చేస్తుందా?

గతంలో భారత్తో తలపడిన ప్రతిసారి పాక్ పరాజయం పాలయింది. అయినా ఈ యుద్ధాల నుండి పాక్ గుణపాఠం నేర్చుకోక పోగా ప్రస్తుతం చైనా అండ చూసుకుని భారత్ సమగ్రతను దెబ్బ కొట్టాలని పాక్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే గత నెలలో పహెల్గాంలో ఉగ్రవాదులు.. టూరి స్టులను వారి మతాన్ని అడిగి మరీ చంప డాన్ని భారత్ తీవ్రంగా పరిగణించి ఇందుకు ప్రతీకార చర్యలు తీసుకుంటామని ప్రతిన బూనింది. మే 6న అర్థరాత్రి 1.05 నిమిషాల నుండి 1.30 వరకు దాదాపు 25 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించింది.
ఆపరేషన్ సిందూర్ పేరుతో జరుగుతున్న పాక్ ప్రేరిత ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం క్రమేపీ ఇరుదేశాల మధ్య తీవ్రమైన యుద్ధానికి దారితీసే ప్రమాదముంది. పాక్ ఆర్మీ, సివిలియన్స్ జోలికి పోకుండా కేవలం ఉగ్రవాద పోస్టులను నిర్వీర్యం చేయడానికే పరిమితమైన భారత్ను పాక్ రెచ్చగొట్టింది. ఎల్.ఓ.సి వెంబడి పాక్ కాల్పులు జరుపుతున్నది. మన దేశంలోని 15 నగరాలను టార్గెట్ చేసింది. అయితే పాక్ మిస్సైళ్ళు, డ్రోన్లు భారత్ ముందు నిలవలేకపోయాయి. భారత్ ఎయిర్ ఢిఫెన్స్ వ్యవస్థ పాక్ దాడులను తిప్పికొట్టింది. చైనా, అమెరికాల వద్ద పాకిస్తాన్ కొనుగోలు చేసిన యుద్ధ విమానాలను భారత్ గగన తలంలోనే పేల్చేసింది. ఈ చర్యతో పాకిస్తాన్ త్రివిధ దళాలు కకావికలమైనాయి. మన సైనికుల సాహసానికి పాక్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగినా, భారత్ వ్యూహాలకు దాయాది దేశం బెంబేలెత్తి పోతున్నది.
ఆ ఒప్పందాలను తుంగలో తొక్కి..
పాకిస్తాన్కు తుర్కియే(టర్కీ) తప్ప ప్రపంచ దేశాలేవీ మద్దతుగా నిలిచే సాహసం చేయబోవు. ఇస్లామిక్ దేశాలు సైతం పాక్కు వ్యతిరేకంగా ఉన్నాయి. పాక్ దుర్మార్గాలు రుచించక పోవడమే కాకుండా, భారత్తో గల వాణిజ్య సంబంధాలు కూడా ఇందుకు కారణం కావచ్చు. చైనా ప్రత్యక్షంగా పాక్కు మద్దతు ఇవ్వకపోయినా, పరోక్ష సహకారం అందచేస్తుందనడంలో సందేహం లేదు. భారత్లో ఉగ్రవాదుల కార్యకలాపాలకు పాక్ మద్దతు ఇస్తున్నది. ఇందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం ఉగ్రవాదులకు స్వర్గ ధామంలా మారిందని భారత్ ఎప్పటి నుంచో ఐక్యరాజ్య సమితిలోనూ, ఇతర అంతర్జాతీయ సంస్థలకు మొర పెట్టుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోయింది. గతంలో ఇరు దేశాలు చేసుకున్న శాంతి ఒప్పందాలు, సత్ససంబంధాల కోసం వాజ్పేయ్ లాహోర్లో బస్సు యాత్ర చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అన్ని ఒప్పందాలను పాక్ తుంగలో తొక్కింది. సరిహద్దుల వద్ద కాల్పులకు తెగ బడుతూ, కవ్వింపులకు పాల్పడుతూ జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులను చొప్పించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంత కాలం కశ్మీర్లో అలజడులు చెలరేగినా, వాస్తవాన్ని అర్థం చేసుకున్న కశ్మీర్ యువత క్రమేపీ తమ జీవితాలను బాగు చేసుకోవడానికి, ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, ఉగ్రవాదం పట్ల విముఖత ప్రదర్శిస్తున్నది. ఇటు ప్రభుత్వం సైతం కశ్మీర్లో టూరిజానికి ప్రాముఖ్యనిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిస్థితిని అర్థం చేసుకుని, పాకిస్తానీయుల చర్యల పట్ల విసుగెత్తి, భారత్లో ఉంటేనే తమకు మేలని కశ్మీర్ ప్రజలే కాకుండా పీఓకేలోని యువత కూడా భావిస్తున్నది. పాక్ లోని బెలూచిస్తాన్, సింధ్ ప్రాంతాల ప్రజలు ఎందుకు పాకిస్తాన్పై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారో కశ్మీర్ ప్రజానీకం అవగతం చేసుకుంది.
ఈ సారి ఒత్తిడులకు లొంగకుండా..
తాలిబాన్లతో అంటకాగిన పాకిస్తాన్కు ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్కు తీవ్రమైన శతృత్వం నెలకొంది. పాక్లో అంతర్యుద్ధం చెలరేగింది. పాకిస్తాన్ అరాచకాలతో, సైనిక చర్యలతో, ఉగ్రవాదుల విధ్వంస కాండతో అనునిత్యం బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న పాక్లోని పలు ప్రాంతాల ప్రజలు భారత్లో విలీనం కావాలని బలంగా కోరుకుంటున్నారు. పాక్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలకు నమ్మకం లేదు. తన దేశంలోని ప్రాంతాలను కాపాడుకోలేని పాక్ భారత్ను ఎదిరించాలనుకోవడం హాస్యా స్పదం. ప్రస్తుత భారత్- పాక్ సరిహద్దులు బాంబులతో దద్దరిల్లుతున్నాయి. జమ్మూ టార్గెట్గా పాక్ దాడులు చేస్తున్నది. పఠాన్ కోట్, శ్రీనగర్, జైసల్మేర్పై పాక్ డ్రోన్లను ప్రయోగించినా భారత్ వాటిని కుప్పకూల్చింది. ఆపరేషన్ సిందూర్లో భారత్ ఉగ్రవాద శిబిరాలనే ధ్వంసం చేసింది. కానీ పాక్ మాత్రం భారత్ తమ పౌరులపై, ప్రార్థనా స్థలాలపై దాడులు చేసిందని దుష్ప్రచారం చేస్తూ, కొద్ది నెలల్లో పాక్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించడం దుర్మార్గం.
- సుంకవల్లి సత్తిరాజు
97049 03463