బీజేపీకు మునుగోడు భంగపాటు తప్పదేమో?

by Disha edit |
బీజేపీకు మునుగోడు భంగపాటు తప్పదేమో?
X

ఉమ్మడి నల్లగొండ ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతం. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ ఢిల్లీలో ప్రధాని ముందుకు బాధితులను తీసుకెళ్లి చూపించినా నాడు కాంగ్రెస్‌గానీ, నేడు బీజేపీగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత‌ సీఎం కేసీఆర్‌ 'మిషన్‌ భగీరథ'తో ఫ్లోరైడ్ బాధను దూరం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ మునుగోడులో దాదాపు 15 శాతం వికలాంగులు ఉన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చారు. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఫలితాలు మునుగోడులో పునరావృతం చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు నల్లేరు మీద నడకలా సాగుతుందనడంలో అతిశయోక్తి లేదు.

మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడి ఉపఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన మూడున్నర‌ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయారని, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులకు ఆశపడి కోవర్టుగా మారి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ఉప ఎన్నికకు కారణమయ్యారనే విమర్శలు జనం నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదన్న ఆరోపణలూ ఉన్నాయి. 2018లో చావుతప్పి లొట్టపోయినట్లుగా ఒకే ఒక సీటుకే పరిమితమైన బీజేపీ ఉప ఎన్నికలలో మరో రెండు సీట్లు సంపాదించుకుంది. ఈ క్రమంలో అధికార దాహంతో తెలంగాణలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్నది.

'నిశ్చితార్థమే పెళ్లిని మించిపోయినట్లు' ఉందీ వరస. పెళ్లికొడుకు ఎవరో తేల్చకుండానే పెళ్లి ఊరేగింపునకు (బారాత్‌)కు సిద్ధమైపోయింది. జరుగుతున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారినా, కాంగ్రెస్, బీజేపీ ఊహకు అందని రీతిలో ముందుకు సాగాలని అధికార పక్షం ఆలోచనగా ఉంది. దుబ్బాక తరహాలో మునుగోడులో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అనుకుంటున్నది. ఈటల రాజేందర్ పార్టీకి చేసిన ద్రోహం, దాగుడుమూతల వ్యవహారం హూజూరాబాద్ ప్రజలకు చేరవేయడంలో విఫలం అయ్యామని భావిస్తున్నది. అందుకే ఈసారి మునుగోడులో కేసీఆర్ పదునైన వ్యూహాలతో, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఇంటింటికి చేరవేసేలా ప్రచారం ముమ్మరం చేసింది. 2014 చరిత్రను తిరగరాయలనే సంకల్పంతో గెలుపు దిశగా అడుగులు వేస్తుంది.

Also read: మరోకోణం: బీజేపీ వ్యూహంతోనే మునుగోడు ఉపఎన్నిక జరగనుందా?

కాంగ్రెస్ తహతహ

ఇటు సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నది. మునుగోడు ఉప ఎన్నికలో గెలవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. ఓడిపోతే దాని ప్రభావం భవిష్యత్ ఎన్నికలపైనా ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నది. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ పరిస్థితి 'కుడితిలో పడ్డ ఎలుక మాదిరి'గా మారింది. సీనియర్స్‌ను కాదనీ ఒక్క సీటు కూడా ఇప్పించుకోలేని పరిస్థితి. మునుగోడు బూచితో రేవంత్ పీఠాన్ని పీఠం కదిలించడానికి నల్గొండ బ్రదర్స్ రగిలించిన రాజకీయంతో సిట్టింగ్ సీటును కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తున్నది. రేవంత్ పీసీసీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంచుకోటగా ఉన్న 12 నియోజకవర్గాలలో మునుగోడు ఒకటి.

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో టీఆర్ఎస్ కాంగ్రెస్‌ను ఓడించింది. 2018లో మునుగోడు కాంగ్రెస్‌కు పట్టం కట్టింది. 2019లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎంపీగా గెలుపొందడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హూజుర్‌నగర్‌కు జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి పద్మావతిని కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దించారు. కానీ, టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 1,13,095 ఓట్లతో విజయం సాదించారు. 2020లో నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో సీనియర్ నేత జానారెడ్డి గులాబీ అభ్యర్థి నోముల భరత్ చేతిలో ఓటమి చవి చూశారు. కమ్యూనిష్టుల ఖిల్లా నల్లగొండలో మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీని దరిచేరనివ్వదనే అభిప్రాయం అందరిలో ఇప్పుడు కనిపిస్తోంది.

Also read: మునుగోడులో ఎవరిది ఆఖరి ఆట?దీని ఎన్నిక తర్వాతే రాష్ట్ర రాజకీయం మారబోతుందా?

ఫ్లోరైడ్‌ను పట్టించుకోని పార్టీలు

ఉమ్మడి నల్లగొండ ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతం. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ ఢిల్లీలో ప్రధాని ముందుకు బాధితులను తీసుకెళ్లి చూపించినా నాడు కాంగ్రెస్‌గానీ, నేడు బీజేపీగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత‌ సీఎం కేసీఆర్‌ 'మిషన్‌ భగీరథ'తో ఫ్లోరైడ్ బాధను దూరం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ మునుగోడులో దాదాపు 15 శాతం వికలాంగులు ఉన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చారు. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఫలితాలు మునుగోడులో పునరావృతం చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు నల్లేరు మీద నడకలా సాగుతుందనడంలో అతిశయోక్తి లేదు.

బీజేపీ మునుగోడులో గెలవడం కోసం అంగడి సరుకులా బేరాలు పెడుతూ కోవర్టులను ప్రోత్సహిస్తున్నది. స్వార్థ ప్రయోజనాల కోసం ఉప ఎన్నికలో లబ్ధి పొందాలని చూస్తున్నది. 2018 లో 12 వేల ఓట్లకు పరిమితం అయిన బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటోంది. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చిన వీరి కుట్రలను తిప్పి కొట్టాలి. కార్మికుల హక్కులను కాలరాసి, కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నాన్ని ఎండగట్టాలి. బీజేపీ బీసీలకు చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. ఓబీసీ జనగణన చేయకుండా తాత్సారం చేస్తోంది. ఎనిమిదేండ్లు కేంద్రంపై గాండ్రించిన కొందరు బీసీ నేతలు వారికి దాసోహం కావడం దురదృష్టకరం. బూర నర్సయ్య గౌడ్, ఇంకొక బీసీ నేత పోయినంత మాత్రాన నష్టమేమీ లేదు. ఫలితాలు తమకు అనుకూలంగా ప్రాబల్యం పెంచుకోవచ్చని ఉంటే బీజేపీ దింపుడు కల్లం ఆశతో ఎదురు చూస్తున్నది. దానికి అడ్డుకట్ట వేయాలి.

ఇవి కూడా చదవండి : మునుగోడుకు నేడు బండి ఎంట్రీ.. రసవత్తరంగా ప్రచారం

సంగని మల్లేశ్వర్

జర్నలిజం విభాగాధిపతి

కేయూ, వరంగల్

98662 55355



Next Story

Most Viewed