నేరారోపణ పాలైన నేతలకు ఈ ఊరేగింపు ఎందుకు?

by Viswanth |
నేరారోపణ పాలైన నేతలకు ఈ ఊరేగింపు ఎందుకు?
X

ఒకప్పుడు ఏదైనా అవినీతి ఆరోపణలు వస్తే నైతికంగా బాధ్యతల నుంచి తప్పుకున్నవారిని చూశాం. శాఖాపరమైన ఆరోపణలు తలెత్తితే చాలు.. తమ పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టేసిన మాన్యులు లాల్ బహదూర్ శాస్త్రి, నీలం సంజీవ రెడ్డి, రామకృష్ణ హెగ్డే, ఉత్తర ప్రదేశ్ సీఎం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వంటి వారి గురించి విన్నాం. ఇప్పుడు దానికి రివర్సులో జరుగుతున్నది. దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం జైలుకెళ్ళి విడుదలైన తర్వాత ఘనంగా స్వాగతం పలికేవారం. కానీ ఇప్పుడు నేరాలు చేసినవారు జైలు శిక్ష అనుభవించి బైటకు వచ్చినప్పుడు వారికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకడాన్ని వీక్షిస్తున్నాం. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు జైలుకు వెళ్తున్నప్పుడు, తిరిగి బైటకు వచ్చేటప్పుడు గ్రాండ్‌గా ఊరేగించడం నేటి ట్రెండ్‌గా మారిపోయింది. ఈ కోవలో మనీష్ సిసోడియా మొదటివారేమీ కాదు. ప్రజలకు ప్రతినిధులమనే ముసుగు తగిలించుకున్న రాజకీయ నేతల ఈ విపరీత పరిణామాలు సమాజానికి ఆరోగ్యకరం కాదు.

కప్పుడు దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన క్రీడాకారులను సన్మానించుకునేవాళ్ళం.. పూలు జల్లుతూ ఊరేగించుకునేవాళ్ళం. దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం జైలుకెళ్ళి విడుదలైన తర్వాత ఘనంగా స్వాగతం పలికేవారం. కానీ ఇప్పుడు నేరాలు చేసినవారు జైలుశిక్ష అనుభవించి బైటకు వచ్చిన తర్వాత సత్కరించడాన్ని చూస్తున్నాం. వారికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకడాన్ని వీక్షిస్తున్నాం. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు జైలుకు వెళ్తున్నప్పుడు, తిరిగి బైటకు వచ్చేటప్పుడు గ్రాండ్‌గా ఊరేగించడం నేటి ట్రెండ్‌గా మారిపోయింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇటీవల ఇదో ఫ్యాషన్‌గా తయారైంది.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ ఎంక్వయిరీ కి వెళ్ళేటప్పుడు జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. చుట్టూ వందలాది మంది భజనపరులుగా ఉండే కార్యకర్తలు చేసే హడావిడితో ఆ నేతకు కాస్త సంతోషం కలిగి ఉండొచ్చు. ఈ నేతకు ఇంత ప్రజాబలం ఉన్నదా అని సమాజానికి ఒక మెసేజ్ పంపించాలనేది దాని ఉద్దేశం కావచ్చు. సీబీఐ అధికారులను ప్రభావితం చేయాలన్న వ్యూహమూ అయి ఉండొచ్చు. ఆరోపణలతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళాలనే ముందస్తు ప్రణాళిక కావచ్చు. ఒకవైపు దర్యాప్తునకు సహకరిస్తామంటూనే ఇలాంటి ర్యాలీల ద్వారా ఆయన ఏం చెప్పదల్చుకున్నారు

ఏం చేశారని ఈ సత్కారాలు?

నేరం చేసినవారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఇలాంటి సత్కారాలు ఎందుకోసం? సమాజానికి ఏం మెసేజ్ వెళ్తున్నట్లు నేరం చేయడం చాలా సాధారణం అని చెప్పుకోవడమా? సమంజసమేనంటూ సమర్ధించుకోవడమా? ఎలాంటి నేరాలు, ఘోరాలు చేసినా చెల్లుబాటవుతుందని చెప్పడమా? భవిష్యత్తులో పొలిటీషియన్లందరూ ఇలాగా వ్యవహరించాలనే సందేశాన్ని ఇవ్వడమా? దీన్ని ఒక రోల్‌మోడల్‌గా ఎస్టాబ్లిష్ చేయాలనే భావనా? ఈ కోవలో మనీష్ సిసోడియా మొదటివారేమీ కాదు. అనేక పార్టీలకు చెందిన నేతలకు గతంలో ఇలాంటి రెడ్ కార్పెట్ స్వాగతాలను చూశాం. ఈ ట్రెండ్ ఇక్కడితోనే ఆగిపోతుందనీ భావించలేం.

కొద్దిమంది లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించారన్నది ఆ శాఖ మంత్రిగా సిసోడియా మీద వచ్చిన ఆరోపణలు. క్విడ్ ప్రో కో విధానం అమలైందన్నది సీబీఐ అభియోగం. నిజానికి అవి ఆరోపణలు మాత్రమే.. వాస్తవం కాదు.. అని సిసోడియా భావిస్తున్నట్లయితే తొలుత మంత్రి పదవి నుంచి తప్పుకుని ఉండాల్సింది. నైతికంగా ఆదర్శంగా ఉండేలా వ్యవహరించాల్సి ఉండాల్సింది. దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పినట్లుగా ఆచరించి ఉండాల్సింది. కానీ దీనికి విరుద్ధంగా తనను సీబీఐ అరెస్టు చేసి జైల్లో పెట్టబోతున్నదని ముందుగానే ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. దీంతో తనను జైల్లో పెట్టినా అది బీజేపీ ముందస్తు వ్యూహంలో భాగమేనంటూ నెపాన్ని ఆ పార్టీ మీదకు నెట్టేయడమే. సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. దానికి తోడుగా వేలాది మంది కార్యకర్తలతో ఇంటి నుంచి సీబీఐ ఆఫీసు వరకూ భారీ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. తనకు ఏ పాపమూ తెలియదు.. అవినీతి జరగలేదు.. జరిగినా దానితో తనకు సంబంధం లేదు.. రాజకీయంగా కక్ష గట్టి బీజేపీ ఈ పని చేయిస్తున్నది.. ఇలాంటి ఎదురుదాడి ప్రకటనలతో ఆయన ఏం చెప్పదల్చుకున్నారో తేలిపోతున్నది. సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కక్షసాధింపులో భాగమే తప్ప తాను మాత్రం సుద్దపూస అని సమర్ధించుకోవడం ఆయన ఉద్దేశం కాబోలు! ముందుగానే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి దాని చాటున చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలుగానే భావించాలి.

ఎందుకీ రెడ్ కార్పెట్ స్వాగతాలు?

అనేక రాష్ట్రాల్లో పలువురు నేతలు ఆర్థిక నేరాలు, అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై జైలుకు వెళ్ళారు. తమిళనాడులో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత, ఆ తర్వాత శశికళ ఉదంతాలను చూశాం. జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీ కార్యకర్తలు వారికి కిలోమీటర్ల కొద్దీ పూలతో ఘనంగా స్వాగతం పలికారు. విస్తృత స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. నేరం చేసినా చెల్లుబాటు అవుతుందనే మెసేజ్‌ను సమాజంలోకి వదిలారు. ఇప్పుడు మనీష్ సిసోడియా విషయంలో చూస్తున్నాం. రేపు మరో రాష్ట్రంలోనూ ఇలాంటివే రిపీట్ అయ్యే అవకాశాలను కాదనలేం. తప్పు చేసినవారు సిగ్గు పడడం లేదు. దానికి బదులుగా వాటిని చూస్తున్న ప్రజలు సిగ్గుపడుతున్నారు.

ఈ మధ్యన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో జైలుశిక్ష అనుభవించి విడుదలైనవారికి గుజరాత్‌లో స్వాగతం పలికిన సంఘటన కూడా ఇలాంటిదే. ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు మూడేళ్ల బిడ్డతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను చంపేసిన ఆరోపణలపై జైలుకెళ్ళారు. కోర్టు సైతం వారిని దోషులుగానే నిర్ధారించింది. కొన్నేండ్లు జైలు శిక్ష అనుభవించి విడుదలైన తర్వాత వారికి సన్మానాలు జరిగాయి.. కొద్దిమంది ఊరేగింపులు చేశారు. ఈ తివాచీ కల్చర్‌తో వెనక సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? చిన్నచిన్న నేరాలు చేసి జైలుకు పోయిన వారికి ఇలాగా స్వాగత సత్కారాలు ఎందుకు జరగడం లేదు? సమాజంలో పలుకుబడి, రాజకీయ అండదండలు ఉన్న వ్యక్తులకు మాత్రమే ఎందుకు జరుగుతున్నది?

సమాజ సంస్కృతిలో ఇది కొత్త ట్రెండ్‌గా ఎందుకు మారుతున్నది? నేరస్తులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం ద్వారా ఏం సందేశాన్ని ఇస్తున్నట్లు ఎంతటి నేరాలు చేసినా ఏమీ కాదని చెప్పడమేనా? సమాజంలో ప్రతిష్ట ఏ మాత్రం తగ్గదని సర్టిఫికెట్ ఇచ్చుకోవడమా? నేర సంస్కృతిని పారదోలడానికి బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు, ఆ దిశగా కృషి చేయడానికి బదులుగా ఇలాంటి దారిని ఎందుకు ఎంచుకుంటున్నాయి? రాజకీయ అండదండలు, అంగబలం, అర్థబలం, పలుకుబడి ఉంటే ఏం చేసినా నడుస్తుందనే ధీమాను వ్యక్తం చేయడమా? చివరకు బాధితులకు ఏం భరోసా ఉంటుంది? ఇవన్నీ తెర మీదకు వస్తున్న ప్రశ్నలు.

ప్రజాస్వామ్యంలో ఇదో పెడధోరణి..

నేరస్తులకు సత్కారాలు, సన్మానాలు చేయడం, ర్యాలీలు నిర్వహించి జేజేలు పలకడం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు. ఇలాంటివాటిని రోల్ మోడల్‌గా చిత్రీకరించడం దురదృష్టకరం. ప్రజాసేవ, ప్రజలకు ప్రతినిధులమనే ముసుగు తగిలించుకున్న రాజకీయ నేతల ఈ విపరీత పరిణామాలు సమాజానికి ఆరోగ్యకరం కాదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టినా దానికి తగిన గౌరవం, విలువ ఇవ్వడంలేదు. చేసిన నేరాలు రుజువైన రాజకీయ కక్షసాధింపులో భాగమేనని కప్పి పుచ్చుకుంటున్నారు. నెలల తరబడి జైల్లో కూర్చున్నా మంత్రి పదవి మాత్రం కంటిన్యూ అవుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సత్యేంద్ర జైన్, తాజాగా మనీష్ సిసోడియా ఇందుకు ఉదాహరణ. వీళ్లిద్దరూ ఇప్పుడు రాజీనామా చేశారన్నది తాజా వార్త.

ఒకప్పుడు ఏదైనా అవినీతి ఆరోపణలు వస్తే నైతికంగా బాధ్యతల నుంచి తప్పుకున్న వారిని చూశాం. మంత్రి పదవులు నిర్వహిస్తున్నప్పుడు శాఖాపరమైన ఆరోపణలు తలెత్తితే చాలు.. తమ పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టేసిన మాన్యులు లాల్ బహదూర్ శాస్త్రి, నీలం సంజీవ రెడ్డి, రామకృష్ణ హెగ్డే, ఉత్తర ప్రదేశ్ సీఎం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వంటివారి గురించి విన్నాం. ఇప్పుడు దానికి రివర్సులో జరుగుతున్నది. నిజానికి దర్యాప్తుతో న్యాయం జరుగుతుందన్న భరోసాను కల్పించడం సీబీఐ లాంటి సంస్థల బాధ్యత. నిజం నిగ్గు తేలేలా ఎంక్వయిరీకి సహకరించడం ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి బాధ్యత. దర్యాప్తు సంస్థలు అధికార పార్టీల చెప్పుచేతల్లో పనిచేస్తున్నాయంటూ వాటి నిజాయితీ ఇటీవల కాలంలో ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర, రాష్ట్రాల్లోని అన్నింటిపైనా ఈ ముద్ర ఉన్నది. అటు దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయనే గుర్తింపు పొందాలి. అదే సమయంలో ఆరోపణలు రావడంతోనే పదవుల నుంచి తప్పుకుని న్యాయస్థానాల్లో విచారణను ఎదుర్కోవాలి. నిర్దోషులుగా బైటకు వచ్చిన తర్వాత వారి నిజాయితీని ప్రజలు గుర్తిస్తారు. కడిగిన ముత్యంలా వారికి ప్రజలు బ్రహ్మరథం పడతారు. కానీ తమకు తాముగానే దండలు వేయించుకుంటే చేసిన తప్పు ఒప్పుగా మారదు.

దర్యాప్తు సంస్థలపై దూకుడు మచ్చలు

రాజకీయ కార్యకర్తలు పైరవీల బాట ఎంచుకున్నారు. కష్టపడకుండా కమిషన్లపై ఆధారపడుతున్నారు. ఈజీ మనీకి అలవాటుపడ్డారు. అందులో భాగమే యథా లీడర్.. తథా కేడర్ వ్యవస్థ తయారైంది. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే తీరులో నేతలు ఏం చేసినా అదే కరెక్టు అనే ధోరణే ప్రబలింది. భజన బృందాల పొగడ్తలకు నేతలు ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. నేరం చేయడం ఒక ‘లెజిటిమేట్ రైట్‌’గా భావిస్తున్నారు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు కేడర్‌ను చెడగొడుతున్నారు. సమాజానికి బ్యాడ్ మెసేజ్ పంపుతున్నారు. ప్రజాస్వామ్యానికి హానికరంగా మారిన ఈ ధోరణి భవిష్యత్తులో ఇంకెన్ని దుష్పరిణామాలకు కారణమవుతుందో!

సరిగ్గా ఎన్నికల సమయంలో దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రదర్శించడంతో వాటి విశ్వసనీయతపై మచ్చ పడుతున్నది. అధికార పార్టీలు దీన్ని అనుకూలంగా మలుచుకుని తప్పులను కప్పిపుచ్చుకోడానికి దారులు వెతుక్కుంటున్నాయి. చేసిన నేరాలను కేంద్రంలోని అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు అనే పేరుతో కప్పేస్తున్నాయి. పొలిటికల్ మైలేజీ కోసం వాడుకుంటున్నాయి.

ఎన్. విశ్వనాథ్

99714 82403

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672


Next Story

Most Viewed