ఒకే సమూహంగా ఉన్నా వారికి ఒకే రిజర్వేషన్ లేదా!

by Disha edit |
ఒకే సమూహంగా ఉన్నా వారికి ఒకే రిజర్వేషన్ లేదా!
X

దేశంలో ఒకే జాతిగానున్న వీరి రిజర్వేషన్ అస్తవ్యస్తంగా ఉంది. ప్రత్యేక భాష, ప్రత్యేక వస్త్రధారణ, సమాజానికి దూరంగా అడవి ప్రాంతంలో జీవించడం వీరి లక్షణాలు. 1950 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయంలో బంజారాలను గిరిజన రిజర్వేషన్ జాబీతాలో చేర్చాలని పోరాడే అంబేద్కర్‌లాంటి నాయకుడు లేకపోవడంతో లంబాడీలు వివిధ రాష్ట్రాలలో వివిధ రిజర్వేషన్లతో అట్టడుగుస్థాయిలోనే ఉండిపోయారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి దేశవ్యాప్తంగా ఉన్న బంజార (లంబాడీల)ను ఒకే గిరిజన రిజర్వేషన్ జాబితాలో చేర్చాలి.

బంజారాల (లంబాడీల) సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. జీవన విధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడి పడి ఉంటాయి. అతి ప్రాచీనమైన తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవటం కోసం ప్రపంచవ్యాప్తంగా వారు తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు. పశుపోషణ వీరి జీవనాధారం. ప్రత్యేక పండుగలు, పంచాయతీ వ్యవస్థ కలిగి ఉన్నారు. దేశంలో సుమారు 1.50 లక్షల తండాలలో దాదాపు 22 కోట్ల జనాభాతో వీరు నివసిస్తున్నారు. సుమారు 67 దేశాలలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.

భారతదేశంలో ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి దాకా వివిధ పేర్లతో పిలవబడుతున్నారు. వీరు తొలుత ఉత్తర భారత పాలకుల దండయాత్రలను చవిచూసి లోది, మొఘల్ రాజ్యాలకు సహాయంగా ఉండేవారు. తర్వాత బ్రిటిష్‌వారితో తలపడి 1879 లో 'క్రిమినల్ ట్రైబ్' గా గుర్తించబడ్డారు. వీరిని దేశంలో అతిపెద్ద సంచార సమూహమని, భూమి 'మూల రోమా' అని పిలుస్తారు.

ఒకే భాష, ఒకే సంస్కృతి

బంజారాలు వందల సంవత్సరాల క్రితం భారతదేశం నుండి ఐరోపాలోని వివిధ ప్రాంతాలకు పయనించారు. ప్రతి సమూహం స్థిరపడిన ప్రాంతాలలో లాంబాడీల భాష 'గోర్ బోలి' ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ ప్రపంచంలో ఒకే భాష, ఆచార సంప్రదాయాలు ఉన్న జాతి లంబాడీ మాత్రమే. బంజారా అనే పదం బజికా అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం వ్యాపారం. వీరి మొదటి ప్రస్తావన క్రీ.శ 1504లో ధోల్పూర్‌పై సికిందర్ లోడి దాడి చరిత్రలో కనుగొనబడింది. ఔరంగజేబు సైన్యాల దండయాత్ర తరువాత వారు దక్కన్‌కు వచ్చారు.చారిత్రక ఆధారాల ప్రకారం వీరి వంశం సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం నాటిది.

రాజస్థాన్‌లో స్థిరపడిన తర్వాత బంజారాలు 14వ శతాబ్దంలో దక్షిణాదికి ప్రయాణించడం ప్రారంభించారు. రాజస్థాన్, వాయవ్య గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్ స్వాతంత్ర్యానికి పూర్వం పాకిస్తాన్ తూర్పు సింధ్ ప్రావిన్స్‌కు చెందిన సంచార జాతులుగా పేర్కొనబడ్డారు. వీరు అగ్నివంశీ రాజపుత్రుల వంశానికి చెందినవారుగా చెప్పుకుంటారు. దేశంలో అనేక సమాజాలపై అనేక అధ్యయనాలు జరిగాయి. ఎన్నో వెనుకబడిన జాతులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అందులో బంజారా జాతి కూడా ఒకటి. వీరు వేలాది సంవత్సరాలుగా సమాజం, నగరాలు ఇతర సామాజిక వ్యవస్థలకు దూరంగా బతుకుతున్నారు. అభివృద్ధి ఫలాలను కోల్పోయారు.

అక్కడ మినహాయించి

ఈశాన్య భారతం మినహా అన్ని రాష్ట్రాలలో వీరి నివాసాలు ఉన్నాయి. వీరిని బంజారీ, పిండారీ, బంగాళా, బంజోరి, బంజురీ, బ్రింజరి, లమాని, లమాడి, లంబానీ, లభాని, లంబారా, లావణి, లేమాడి, లుమడలే, లభని, ముకా,గూలా, గుర్మర్తి అని పిలుస్తారు. గోర్మతి, కోరా, సుగాలి, సుకలి, తండా, వంజరి, వంజర, వంజీ దొంబాతో కలిసి వారిని 'జిప్సీ ఆఫ్ ఇండియా' అని కూడా పిలుస్తారు. దేశ విభజనకు ముందు అమర్‌కోట్, ఫతాయ్‌కోట్, సియాల్‌కోట్‌లో భూస్వాములుగా ఉన్నారు. రాజస్థాన్, గుజరాత్‌లోని వంజారా కమ్యూనిటీకి చెందిన రాథోడ్, పర్మార్, పవార్, చౌహాన్ కులాలు జనరల్ సీట్లలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలలో 'షెడ్యూల్ ట్రైబ్' (ST) జాబితాలో, కర్ణాటక, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లో 'షెడ్యూల్ క్యాస్ట్' (SC) లలో, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో డి- నోటిఫైడ్ (DNT) జాబితాలో, మిగతా రాష్ట్రాలలో ఓబీసీ జాబితాలో ఉన్నారు.

దేశంలో ఒకే జాతిగానున్న వీరి రిజర్వేషన్ అస్తవ్యస్తంగా ఉంది. ప్రత్యేక భాష, ప్రత్యేక వస్త్రధారణ, సమాజానికి దూరంగా అడవి ప్రాంతంలో జీవించడం వీరి లక్షణాలు. 1950 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయంలో బంజారాలను గిరిజన రిజర్వేషన్ జాబీతాలో చేర్చాలని పోరాడే అంబేద్కర్‌లాంటి నాయకుడు లేకపోవడంతో లంబాడీలు వివిధ రాష్ట్రాలలో వివిధ రిజర్వేషన్లతో అట్టడుగుస్థాయిలోనే ఉండిపోయారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి దేశవ్యాప్తంగా ఉన్న బంజార (లంబాడీల)ను ఒకే గిరిజన రిజర్వేషన్ జాబితాలో చేర్చాలి.

జటావత్ హనుము

ఉస్మానియా యూనివర్సిటీ

851983 6308



Next Story

Most Viewed