కేసీఆర్ వైఖరి ఎందుకు మారింది?

by Disha edit |
కేసీఆర్ వైఖరి ఎందుకు మారింది?
X

అకస్మాత్తుగా కేసీఆర్‌లో వచ్చిన ఈ మార్పు గురించి ప్రజలు ఆలోచిస్తారు గదా! ఇన్నిరోజులు స్నేహ సంబంధాలు కొనసాగించి ఇప్పుడు తిట్ల దండకం అందుకోగానే జనం నమ్మేయరు. పార్లమెంటు సాక్షిగా అనేక చట్టాలకు మద్దతిచ్చిన విషయం అంగీకరించి చేసిన తప్పునూ ఒప్పుకోవాలి. మతోన్మాదం కూలంకషంగా తెలిసీ వారితో అంటకాగినందుకు పశ్చాత్తాపపడాలి. ప్రజల విశ్వాసం పొందాలంటే, మళ్లీ పూర్వ వైభవం రావాలంటే, చెబుతున్న ప్రతి మాటా,చేసిన ప్రతి వాగ్దానమూ ఆచరణ రూపం దాల్చాలి. అప్పుడే కేసీఆర్ మాటల్ని ప్రజలు నమ్ముతారేమో!

తెలంగాణలో రోజురోజుకూ రాజకీయ వేడి పెరిగిపోతున్నది. కారు, కమలం పార్టీల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గున మండిపోతున్నది. ఈ మధ్యకాలంలో బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి వేదిక మీద పనిగట్టుకొని దులిపి పడేస్తున్నారు. పాత విషయాలను, అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్‌కు మద్దతిచ్చిన వీడియోలను సభలో ప్లే చేయించి మరీ మోడీపై విమర్శలు కురిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో బీజేపీనిగానీ, ప్రత్యేకించి మోడీని గానీ విమర్శించిన దాఖలాలు లేవు. ఎప్పుడో ఎన్నికలప్పుడు విమర్శలు చేసినా అది మామూలే.

మొన్నటి వరకు జాతీయ పార్టీతో అంటకాగిన కేసీఆర్ ఒక్క సారిగా ఈ స్థాయిలో విమర్శలు చేయడానికి వెనుక ఏదో మతలబు ఉండకపోదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిన్నమొన్నటి వరకు ఎంతో సన్నిహితంగా మెలిగిన కేసీఆర్ పార్లమెంటులో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన అనేక ప్రజా వ్యతిరేక బిల్లులకు బేషరతుగా మద్దతిచ్చారు. కొన్ని సార్లు సభను బాయ్‌కాట్ చేసి మరీ ప్రభుత్వానికి పరోక్షంగా సహాయపడ్డారు. అంతలా వెనకేసుకొచ్చిన కేసీఆర్ ఒక్కసారిగా మోడీపై ఆగ్రహం కలగడానికి కారణం ఏమై ఉంటుంది?

ప్రజల విశ్వాసం పొందాలంటే

బీజేపీతో సఖ్యతగా ఉంటే కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని, ఎలాగూ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటిలో బలపడేది లేదని, మోడీతో కలిసి ఉంటే స్వకార్యం స్వామి కార్యం రెండూ నెరవేర్చుకోవచ్చని భావించి ఉంటారు. కానీ, రాష్ట్రంలో ఆయన అంచనాలకు అందకుండా క్రమక్రమంగా చాప కింద నీరులా బీజేపీ విస్తరిస్తున్నది. దానిని నిలువరించాలంటే తప్పనిసరిగా టార్గెట్ చేయాల్సిందేనని నిర్ణయానికి వచ్చి ఆ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూర్చుకోవడానికే కేసీఆర్ తన వైఖరిని మార్చుకున్నారు.

దేశ రాజకీయాలను టార్గెట్ చేసి గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో అన్ని పార్టీల అలయన్స్ అంటూ ముందరికి తెచ్చి విఫలం అయిన కేసీఆర్ ఈ సారి 'దేశం కోసం కొత్త పార్టీ' అంటూ కొత్త రాగం అందుకున్నారు. అకస్మాత్తుగా కేసీఆర్‌లో వచ్చిన ఈ మార్పు గురించి ప్రజలు ఆలోచిస్తారు గదా! ఇన్నిరోజులు స్నేహ సంబంధాలు కొనసాగించి ఇప్పుడు తిట్ల దండకం అందుకోగానే జనం నమ్మేయరు. పార్లమెంటు సాక్షిగా అనేక చట్టాలకు మద్దతిచ్చిన విషయం అంగీకరించి చేసిన తప్పునూ ఒప్పుకోవాలి. మతోన్మాదం కూలంకషంగా తెలిసీ వారితో అంటకాగినందుకు పశ్చాత్తాపపడాలి. ప్రజల విశ్వాసం పొందాలంటే, మళ్లీ పూర్వ వైభవం రావాలంటే, చెబుతున్న ప్రతి మాటా,చేసిన ప్రతి వాగ్దానమూ ఆచరణ రూపం దాల్చాలి. అప్పుడే కేసీఆర్ మాటల్ని ప్రజలు నమ్ముతారేమో!

ఎండీ ఉస్మాన్‌ఖాన్

సీనియర్ జర్నలిస్ట్

99125 80645



Next Story

Most Viewed