ప్రభుత్వ బడుల ప్రమాణాలు తొలిమెట్టు గట్టిక్కించేనా?

by Disha edit |
ప్రభుత్వ బడుల ప్రమాణాలు తొలిమెట్టు గట్టిక్కించేనా?
X

ఆకర్షణీయ తరగతి గదులు, ఆహ్లాదకర వాతావరణం, నాణ్యమైన పౌష్టికాహారం పిల్లలకు అందినప్పుడే వారిలో అభ్యసన సామర్థ్యాలు పెంపొందుతాయని అంటున్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేదా సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని, పాఠశాలలో కనీస మౌలిక వసతులు, బాలికలకు ప్రత్యేకంగా శౌచాలయాలు, తాగునీటి వసతి కల్పించాలని కోరుతున్నారు. అప్పుడే పిల్లలలో ఉన్న సృజనాత్మక శక్తులను, నైపుణ్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల వైపు మరలేలా ప్రోత్సహించవచ్చు. ఆ దిశగా విద్యార్థులు అడుగులు వేసే విధంగా 'తొలిమెట్టు' పునాది కావాలని ఆశిద్దాం.

రోనాకు ముందు జరిగిన 'నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే' విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేవని తేల్చడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కనీసం చదవడం, రాయడం తో పాటు సాధారణ లెక్కలు సైతం చేయలేని స్థితిలో పిల్లలు ఉన్నారని ఆ సర్వే పేర్కొంది. ఎన్నో విస్తుపోయే విషయాలను వెల్లడించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలకు దిగాయి. విద్యార్థులు కనీస సామర్థ్యాలను, అభ్యసన ఫలితాలను సాధించే విధంగా ప్రణాళిక రూపొందించాయి. వారు పొందిన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసే విధంగా సరికొత్త ప్రయోగానికి పూనుకున్నాయి.

ప్రాథమిక స్థాయి పిల్లలలకు గట్టి పునాది వేయాలనే ఆశయంతో జాతీయ విద్యా విధానం-2020లో 'నిపుణ్ భారత్' కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా 'ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ' పేరుతో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో కనీస సామర్థ్యాల పెంపుతో పాటు అభ్యసన ఫలితాలు రాబట్టడానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో విద్యార్థులలో మౌలిక భాష సామర్థ్యాల సాధనకు 'తొలిమెట్టు' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

సామర్థ్యాల సాధన కోసం

గతంలో కొద్ది రోజులు 'ట్రిపుల్ ఆర్' కార్యక్రమాన్ని అమలు చేశారు. దాని ద్వారా పఠన సంసిద్ధతకే విద్యార్థులను పరిమితం చేయడంతో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామనేది విమర్శకుల భావన. దీన్ని అధిగమించే విధంగా 'తొలిమెట్టు'ను రూపొందించారు. గతంలో పూర్వ తరగతి సామర్థ్యాలపై పట్టు సాధించలేకపోయినా పై తరగతికి పంపేవారు. ఇప్పుడు దానికి భిన్నంగా సామర్థ్యాల సాధన, మదింపు చేపట్టనున్నారు.

విద్యా సంవత్సరంలోని 220 పనిదినాలలో 140 రోజులపాటు 'తొలిమెట్టు' ప్రణాళికను అమలు చేయనున్నారు. వారానికి ఐదు రోజులు భోధనాభ్యసన చేపట్టి చివరి రోజు మూల్యకనం చేస్తారు. పిల్లల స్థాయిని గుర్తించి వారు తగిన ఫలితాలు సాధించేలా చూస్తారు. తరగతి పెరిగేకొద్దీ సామర్థ్యాల కొనసాగింపు అనేది అంతర్లీనంగా ఉంటుంది. దానికి అనుగుణంగా కృత్యాధార బోధన కోసం వార్షిక, వార, కాలాంశ ప్రణాళిక అమలుకు విద్యాశాఖ రూపొందించిన కరదీపిక సహాయకారిగా ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో భాష, గణితం, పర్యావరణ విద్య వేర్వేరు అంశాలు కావు, వీటి సామర్థ్యాల సాధన ప్రధానంగా 'తొలిమెట్టు' అమలు కానుంది. ప్రస్తుతం కనీస పరిజ్ఞానస్థాయి కన్నా దిగువన 52 శాతం మంది విద్యార్థులు ఉన్నారని చాలా సర్వేలు చెబుతున్న నేపథ్యంలో 'తొలిమెట్టు' విద్యానావకు చుక్కానిలా దోహదపడనున్నది.

వారి మీద ప్రభావం చూపవచ్చు

'తొలిమెట్టు'ను ఉపాధ్యాయులు స్వాగతిస్తూనే, సమస్యలను ఏకరువు పెడుతున్నారు. 317 జీఓ 'మన ఊరు-మన బడి'కి నిధుల కేటాయింపు పూర్తి స్థాయిలో లేకపోవడం, సకాలంలో పుస్తకాలు, యూనిఫామ్ విద్యార్థులకు అందకపోవడం, ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టకపోవడం వంటి విషయాలు 'తొలిమెట్టు' మీద తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. అలా జరుగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఆకర్షణీయ తరగతి గదులు, ఆహ్లాదకర వాతావరణం, నాణ్యమైన పౌష్టికాహారం పిల్లలకు అందినప్పుడే వారిలో అభ్యసన సామర్థ్యాలు పెంపొందుతాయని అంటున్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేదా సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని, పాఠశాలలో కనీస మౌలిక వసతులు, బాలికలకు ప్రత్యేకంగా శౌచాలయాలు, తాగునీటి వసతి కల్పించాలని కోరుతున్నారు. అప్పుడే పిల్లలలో ఉన్న సృజనాత్మక శక్తులను, నైపుణ్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల వైపు మరలేలా ప్రోత్సహించవచ్చు. ఆ దిశగా విద్యార్థులు అడుగులు వేసే విధంగా 'తొలిమెట్టు' పునాది కావాలని ఆశిద్దాం.

భాస్కర్ యలకంటి

విద్యా సామాజిక విశ్లేషకుడు

89194 64488

Next Story

Most Viewed