అసంతృప్త భారతం ఇది

by Disha edit |
అసంతృప్త భారతం ఇది
X

135 కోట్ల జనాభా గల భారత్‌లో 80 కోట్ల మంది పేదలు ప్రభుత్వం ఇస్తున్న ఐదు కేజీల రేషన్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. దేశానికి బుక్కెడు బువ్వ పెడుతున్న రైతులు సంతోషంగా లేరు. రైతు సగటు రోజు సంపాదన 28 రూపాయలకు పడిపోయింది. రాష్ట్రపతి ఎన్నికల మీద రాజకీయ పక్షాలన్నీ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఇక సామాన్యుల బాధలు పట్టించుకునేదెవరు? అగ్నిపథ్ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. దేశ రక్షణలో దివాళాకోరు విధానాలు తగవు. ఈ పథకం మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నివృత్తి చేయాలని దేశం ప్రశ్నిస్తున్నది. యువత, వారి కుటుంబాలు కులమతాలకు అతీతంగా అసమానతలు లేని, సంతోషం కలిగిన వ్యవస్థను కోరుకుంటున్నాయి.

75 ఏండ్ల పాటు మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?' అనే ఒకే ఒక్క ప్రశ్నతో ప్రపంచంలోని అతిపెద్దది అయిన హార్వర్డ్ యూనివర్సిటీ ఓ సర్వే నిర్వహించింది. సర్వే రిపోర్ట్‌ను ఒకే ఒక లైన్‌లో వెల్లడించింది. అదే కన్‌క్లూజన్ కూడా. అదేమిటంటే 'మనిషి సంతోషంగా ఉండడానికి బెస్ట్ రిలేషన్‌షిప్ అంటే ఎలాంటి కల్మషం లేని రిలేషన్‌షిప్ ఒక్కటే మార్గం, అది ఒక్కటే మనిషిని సంతోషంగా ఉంచుతుంది' అని. భారత్‌లో ప్రజలతో పాలకులకు బెస్ట్ రిలేషన్‌షిప్ లేదు. అందుకే ఓట్లు వేసి గద్దెనెక్కించిన ప్రజలకు, వారి మనోభావాలకు విరుద్ధంగా పాలన చేస్తున్నారు. ప్రజలకు అంగీకారం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎవరు కూడా హ్యాపీగా లేరు.

'మేరా భారత్ అబ్ అసంతుష్ట్ హై' పాలకుల మీద ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. భారతదేశం మొత్తంగా ప్రస్తుతం అసంతోషకర వాతావరణం ఉంది. మెజారిటీ ప్రజలు ఎనిమిదేండ్లుగా సంతోషంగా లేరు. అసమానతలు, నిరుద్యోగం, యువత ఆందోళనలు, జీవించే హక్కు కోసం నిరంతరం పోరాడే పరిస్థితి ఉంది. నిజం బదులు అబద్దమే రాజ్యం ఏలుతున్న పరిస్థితి ఉంది. ప్రపంచ హ్యాపీనెస్ ఇండెక్స్‌లోని 146 దేశాలలో భారత్ 136వ స్థానంలో ఉన్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు, ఫిన్‌లాండ్ మొదటి ర్యాంక్‌లో ఉండగా, నేపాల్ 84, బంగ్లాదేశ్ 94, పాకిస్తాన్ 121 వ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల కన్నా మనం సంతోషంలో దూరంగా ఉన్నాం. ప్రజలకు ప్రభుత్వం నుంచి ఉండాల్సిన, అవసరం అయిన ప్రేమే కరువు అయినప్పుడు ఎలా సంతోషం ఉంటుంది?

యథేచ్ఛ నిర్ణయాలతో

రాజద్రోహం, దేశద్రోహం చట్టాలు, ఉపా కేసులు ప్రశ్నించేవారిమీద పెడుతూనే పోయారు. సుప్రీంకోర్టు జోక్యంతో రాజద్రోహం చట్టం మీద సమీక్షకు ప్రభుత్వం అంగీకరించింది. సీఏఏ, ఎన్ఆర్‌సీ మీద షాహిన్‌బాగ్ ఆందోళన అనంతరం నిబంధనల విషయంలో కొంతమేరకు ప్రభుత్వం వెనక్కు తగ్గింది. లేబర్ కోడ్ అమలు విషయంలోనూ కార్మిక సంఘాల నిరసనను ప్రభుత్వం ఎదుర్కున్నది. నోట్ల రద్దు అనంతరం బ్లాక్ మనీ వెలికి తీసే విషయంలోనూ ప్రభుత్వం విఫలమైంది. మాజీ ప్రధాని చరణ్‌సింగ్ పేరిట రైతులకు మేలు చేసేలా 'కళ్యాణ్ యోజన' తెస్తామని చెప్పిన పీఎం నరేంద్ర మోదీ ఇపుడు దాని ఊసే ఎత్తడం లేదు.

'వన్ ర్యాంక్, వన్ పెన్షన్' హామీ పక్కన పెట్టి, సైనికుల రిక్రూట్‌మెంట్ విధానం మార్చేసి దానికి అగ్నిపథ్ అని పేరు పెట్టారు. 'అగ్ని‌వీర్‌లను నాలుగు సంవత్సరాల కోసం తీసుకుంటాం' అనడంతో దేశంలోని నిరుద్యోగులలో అలజడి చెలరేగింది. ఆత్మహత్యలు, పోలీస్ ఫైరింగ్ కొనసాగాయి. 300 దాకా రైళ్లు రద్దయ్యాయి. 60 వరకు బోగీలను,10 దాకా ఇంజన్లను, పలు రైల్వే స్టేషన్లు, వాహనాలు, బీజేపీ నేతల ఆస్తులు, ఆఫీస్‌లను ధ్వంసం చేసారు. కొన్ని అగ్నికి కూడా ఆహుతి అయ్యాయి. పోలీసుల లాఠీచార్జ్, కాల్పులలో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులను గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. పలువురిని అరెస్ట్ చేశారు. బిహార్‌లో భారీగా విధ్వంసం జరిగింది. వందల కోట్ల ప్రభుత్వ ఆస్తులు బూడిదయ్యాయి. అగ్నిపథ్ రద్దు చేసి పాత పద్ధతిలోనే పెన్షన్, వేతనాలు ఇతర సౌకర్యాలతో కూడిన రిక్రూట్‌మెంట్ జరపాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ, సచిన్ పైలెట్ తదితరులు సత్యాగ్రహం చేపట్టారు. భారత్ బంద్ జరిగింది. విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వచ్చింది.

ఇది మోసమే కదా?

ప్రభుత్వ రంగాలను ప్రైవేట్‌కు అప్పగించి ఆరు లక్షల కోట్లు అర్జించే ప్రణాళికను అమలు చేస్తున్న సర్కారు, నాలుగు సంవత్సరాల అనంతరం రిటైర్ కాగానే ఇరవై ఐదు శాతం అగ్నివీరులకు ఉద్యోగాలు ఇస్తామనడం మోసం కాకుంటే ఇంకేమవుతుందనే ప్రశ్న ఎదురవుతోంది. ఇవి నిరుద్యోగుల ఆందోళనను చల్లబరిచే మాటలే కదా? 'అగ్నివీరులకు 15 ఏండ్ల సర్వీస్, పెన్షన్ ఇతర సౌకర్యాలు ఇవ్వండి. రైతుల ఉద్యమం సందర్భంగా చేసిన జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని వీడండి' అని వారు కోరుతున్నారు.

రైతుల ప్రాణనష్టం, ఆర్థిక నష్టం భారీగా జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం జరుగుతున్నది. ప్రభుత్వం దిగి రావాలి. ఆందోళనకారులు కూడా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించవద్దు. ఉద్యమం శాంతియుతంగా ఉండాలి. ఇప్పుడు మహారాష్ట్రలోనూ రాజకీయం మలుపు తిరిగింది. కొందరు శివసేన ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్న బీజేపీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. దీనిని మాత్రం రాజకీయ చతురతగా చాటుకుంటోంది.

సాధారణ పాలన ఏది?

ప్రస్తుతం దేశంలో సాధారణ పాలన సాగుతున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఒక సిస్టంలో, ఆర్డర్‌లో ఏదీ కనిపించడం లేదు. ఆర్థిక పరిస్థితి మొదలు అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగానే ఉన్నాయి. గతంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి కమిటీలు వేసేవారు. విపక్షాలను, స్వపక్షాలను సంప్రదించేవారు. వారి నుంచి రిపోర్ట్ తీసుకునేవారు. మంత్రివర్గంలో చర్చించేవారు. ప్లానింగ్ కమిషన్ ఉండేది. ఆ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారు. నీతిఆయోగ్ ఉన్నా దానిని సంప్రదిస్తున్నట్లు కనిపించడం లేదు. అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటున్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు, వ్యవసాయ చట్టాలు, లేబర్ కోడ్, పీ‌ఎస్‌యూల అమ్మకాలు, అగ్నిపథ్ లాంటి నిర్ణయాలు రాత్రి కల పడితే తెల్లారి ప్రకటనల మాదిరి చేసారు.

135 కోట్ల జనాభా గల భారత్‌లో 80 కోట్ల మంది పేదలు ప్రభుత్వం ఇస్తున్న ఐదు కేజీల రేషన్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. దేశానికి బుక్కెడు బువ్వ పెడుతున్న రైతులు సంతోషంగా లేరు. రైతు సగటు రోజు సంపాదన 28 రూపాయలకు పడిపోయింది. రాష్ట్రపతి ఎన్నికల మీద రాజకీయ పక్షాలన్నీ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఇక సామాన్యుల బాధలు పట్టించుకునేదెవరు? అగ్నిపథ్ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. దేశ రక్షణలో దివాళాకోరు విధానాలు తగవు. ఈ పథకం మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నివృత్తి చేయాలని దేశం ప్రశ్నిస్తున్నది. యువత, వారి కుటుంబాలు కులమతాలకు అతీతంగా అసమానతలు లేని, సంతోషం కలిగిన వ్యవస్థను కోరుకుంటున్నాయి.

ఎండీ మునీర్

జర్నలిస్ట్,కాలమిస్ట్

9951865223


Next Story