కొత్త ప్రపంచ పాలన కావాలి

by Disha edit |
కొత్త ప్రపంచ పాలన కావాలి
X

అమెరికా డాలర్ విలువ కూడా ఇటీవల క్షీణించడం మొదలైంది. ఈ అభివృద్ధి చెందిన దేశాల వలన ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా, అనూహ్యంగా పెరుగుతున్నాయి. తరచూ అకాల వర్షాలు, వరదలు, సునామీలు సంభవించి మానవాళిని పెను ప్రమాదంలో పడేస్తున్నాయి. అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. జీవవైవిధ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. సముద్ర నీటి మట్టం పెరిగి అనేక ప్రాంతాలు భవిష్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. నేలలు ఎడారులుగా మారుతున్నాయి. ప్రపంచం ఆహార సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో మంచి నూనె, పెట్రోల్, డీజిల్ ధరలు, స్టీల్, బార్లీ, గోధుమల వంటి ధరలు పెరగడం కనులారా చూస్తూనే ఉన్నాం.

'చరిత్రను చూసి నేర్చుకోవాలి. కానీ, ఏమీ కనిపించడం లేదు' అంటాడు ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు జార్జ్ హెగెల్. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చూసినప్పుడు అది నిజమే అనిపిస్తున్నది. గత శతాబ్దంలో అనగా, 20వ శతాబ్దంలో ప్రపంచం చవిచూసిన రెండు ప్రపంచ యుద్ధాలు ఎంత వినాశనాన్ని మిగిల్చాయో అన్ని దేశాలకు తెలుసు. ఇటువంటి యుద్ధాలు, వైరుధ్యాలు భవిష్యత్తులో ఎక్కడా సంభవించకూడదనే సంకల్పంతో ఆనాటి అగ్రదేశాలు 'ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేసాయి. దాని ఆధారంగా అన్ని దేశాలు అభివృద్ధి సాధించాలని, శాంతియుతంగా మనుగడ సాగించాలని ప్రతిజ్ఞ చేసాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా దేశాలు భద్రతాసమితిలో వీటో అధికారం కలిగి ఉన్నాయి.

విచిత్రం ఏమిటంటే, ఏ దేశాలైతే వీటో అధికారం కలిగి ఉన్నాయో, ఏ దేశాలైతే శాంతియుతంగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసాయో, ఆ దేశాలే తరువాతి కాలంలో ఆ లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ వచ్చాయి. వస్తున్నాయి. వివిధ కారణాలను ఆసరాగా తీసుకొని అనేక దేశాలపై అవి దాడులు చేశాయి. ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా క్యూబా, వియత్నాం, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా వంటి దేశాలపైన అమెరికా యుద్ధాలు, దాడులు చేసింది. ఆంక్షలు విధిస్తూనే ఉంది. ఇతర దేశాలకు మాత్రం శ్రీరంగనీతులు చెబుతూ ఉంటుంది. చైనా కూడా తన పొరుగు దేశాలు తైవాన్, భారత్ వంటి దేశాలకు తరచూ అభద్రతాభావం కలుగచేస్తుంది.

ఈ యుద్ధ సమయంలోనూ

ఇక ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌పై యుద్ధం గత వంద రోజులుగా నిరంతరం నిప్పులు చిమ్ముతూనే ఉంది. ఇటువంటి తరుణంలో ఐక్యరాజ్యసమితిలో ఉన్న శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ ప్రపంచ దేశాల సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా, అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వారివారి రక్షణ, అభివృద్ధి పేరుతో ఇతర దేశాలపై దండయాత్ర సాగిస్తూ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏమిటి? ఆలోచించాలి. ఇది ప్రస్తుతం మనలను వెంటాడుతున్న సమస్య. అంతర్జాతీయంగా ఈ ఐదు దేశాల చర్యల వలన రాజకీయ, ఆర్థిక, సామాజిక, వాతావరణ సమస్యలు రోజురోజుకూ పెరుగుతూ భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని పెనుప్రమాదంలో పడేసే పరిస్థితి నెలకొంది.

ఇటువంటి సమయంలో అంతర్జాతీయ సంస్థలలో అనేక మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడో ఏడు దశాబ్దాల క్రితం ఏర్పడిన ఈ అంతర్జాతీయ సంస్థల పునః నిర్మాణం చేపట్టాలి‌‌. ముఖ్యంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలకు ముఖ్యంగా భారత్, జర్మనీ, బ్రెజిల్ వంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతాసమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి. వీటో పవర్ కల్పించాలి.‌ అలాగే, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, డబ్ల్యూటీఓ, ఐఎల్ఓ, అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ వంటి వాటిలో కీలక పదవులు, సరైన భాగస్వామ్యం కల్పించాలి. ముఖ్యంగా ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాల శాఖా కార్యాలయాలు ఇతర దేశాలకు విస్తరించాలి. కొన్ని దేశాలలోనే నేటికీ కేంద్రీకృతమై ఉన్నాయి. దాంతో ఆయా దేశాల చెప్పినట్లు వినే పరిస్థితి నెలకొంది.‌

డాలర్ క్షీణిస్తున్న దశలో

అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలకు అమెరికా డాలర్‌తో మరికొన్ని దేశాల ద్రవ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి.‌ కారణం అమెరికా డాలర్ విలువ కూడా ఇటీవల క్షీణించడం మొదలైంది. ఈ అభివృద్ధి చెందిన దేశాల వలన ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా, అనూహ్యంగా పెరుగుతున్నాయి. తరచూ అకాల వర్షాలు, వరదలు, సునామీలు సంభవించి మానవాళిని పెను ప్రమాదంలో పడేస్తున్నాయి. అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. జీవవైవిధ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. సముద్ర నీటి మట్టం పెరిగి అనేక ప్రాంతాలు భవిష్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. నేలలు ఎడారులుగా మారుతున్నాయి. ప్రపంచం ఆహార సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో మంచి నూనె, పెట్రోల్, డీజిల్ ధరలు, స్టీల్, బార్లీ, గోధుమల వంటి ధరలు పెరగడం కనులారా చూస్తూనే ఉన్నాం.

అయినా వారికి తిండి లేదు

ముఖ్యంగా భారతదేశంలో సెన్సెక్స్ సూచీ రోజూ పెరుగుతుతోంది. జీడీపీ వృద్ధి చెందుతోంది. మరీ ముఖ్యంగా గత నాలుగు నెలలుగా జీఎస్‌టీ వసూలు పెరిగింది. లక్ష కోట్ల రూపాయలు పైబడి ఆదాయం ప్రభుత్వాలకు అందుతోంది. అయినా, దేశ ప్రజలలో నేటికీ మూడో వంతు మందికి కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి నివాసం అందుబాటులో లేవు. ఇందుకు కారణాలు ఏమిటో ఇకనైనా విశ్లేషణ చేయాలి. ప్రధాన కారణం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, నిజ వేతనాలు పడిపోవడమే అని గమనించాలి. నిరుద్యోగం తారస్థాయికి చేరింది. ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువగా ఉండుటచే విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తరగడం కూడా జరుగుతున్నదని గ్రహించాలి.'లోకల్ టు గ్లోబల్' అనే సిద్ధాంతం వాస్తవ రూపం ధరించాలి.‌ పరిశ్రమలు స్థాపించాలి. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.‌ అప్పుడు మాత్రమే ప్రస్తుతం ప్రపంచాన్ని తమ గుప్పెట పెట్టుకోవాలని చూస్తున్న పై ఐదు దేశాలకు మనలాంటి దేశం చెక్ పెట్టవచ్చు.‌

మన ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలకు పునాదులు వేయడమే తక్షణ కర్తవ్యం. ప్రపంచవ్యాప్తంగా పై ఐదు వీటో దేశాల పరిధి తగ్గించి, అన్ని దేశాలు స్వయం సమృద్ధి సాధించుటకు మనలాంటి ప్రజాస్వామ్య దేశాలు ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి, ఇతర అంతర్జాతీయ సంస్థలలో కీలక భాగస్వాములుగా మారటం ద్వారానే మరికొన్ని శతాబ్దాలపాటు ఈ ప్రపంచాన్ని ఆరోగ్యకర వాతావరణంలో ఉంచగలం. ఆ ప్రయత్నంలో మనలాంటి దేశాలకు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు సరైన సహకారం అందించాలని కోరుకుందాం.

ఐ. ప్రసాదరావు

63056 82733



Next Story

Most Viewed