ఓటరన్నా.. ఓటు లబ్ధి తెలుసుకో!

by Disha edit |
ఓటరన్నా.. ఓటు లబ్ధి తెలుసుకో!
X

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అన్నీ పార్టీలు ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇందులో కాస్తా ముందుగానే ఉన్నది. అయితే, వీరు ప్రజలను ఓటు అడిగే ముందు గత రెండు పర్యాయాలుగా ప్రజలకు ఎంత మేరకు మేలు చేశారనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా,కేవలం పార్టీ కార్యకర్తలకు అందించారనే విమర్శలకు ఏం సమాధానం చెబుతారు? ఇప్పటికే గ్రామగ్రామాన మీకు ఎదురవుతున్న ఆందోళనలకు ఏం సమాధానం చెబుతారు?

స్వరాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాల గురించి ఏం సమాధానం చెబుతారు? 2014, 2018 లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు అయ్యాయి.. డబుల్ బెడ్‌రూమ్, దళిత ముఖ్యమంత్రి, నిరుద్యోగ సమస్య, ఇలా అనేక హామీలు అన్ని హామీలకే పరిమితమయిన వాటి గురించి ఏమని సమాధానం చెబుతారు?

పాలకులు బంగారమయ్యారు!

రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. పరీక్షలు నిర్వహిస్తే అక్రమాలు, లేకపోతే వాయిదాలు ఇలా పాలన విధానం గాడి తప్పడంతో అయోమయంలో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, చిన్న పరిశ్రమలలో పని చేసినటువంటి కార్మికులు వివిధ హోదాల్లోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు నిరంతరం రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి సమ్మెలు చేసి అలసిపోయారే తప్ప వారి సమస్యలకు పరిష్కారం చూపని పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ కార్మికుల నుంచి మండల జిల్లా రాష్ట్ర స్థాయి వివిధ శాఖలలో పనిచేసేటువంటి కార్మికులు చాలీచాలని వేతనాలతో సతమతమవుతూ తమ కుటుంబాల పోషణలో భారమై అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగారు తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలకులు బంగారం లాగా అయ్యారు తప్ప పేదలు మాత్రం పేదల స్థానంలోనే ఉన్నారు. బంగారు తెలంగాణ కాదు కదా మౌలిక సదుపాయాల కల్పన కూడా తెలంగాణలోని గ్రామంలో నోచుకోలేదు.

అయితే, తెలంగాణలో ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాపాడగలుగుతామని నినాదంతో ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. ఆర్థికంగా అంగబలంగా ఉన్నవారిదే అధికారం అన్న చందంగా పరిపాలన సాగుతున్న క్రమంలో ప్రజలకు పౌర ప్రజా స్థానిక హక్కులు ఎక్కడ అందుతున్నాయి, ఎవరు వాటిని అందించగలరు? కనీసం రాజ్యాంగ హక్కులను నోచుకోలేని పరిస్థితి పేదలకు ఉంది. పాలకులు మారుతున్నంత మాత్రాన ప్రజల బతుకులు మారడం లేని పరిస్థితిని ప్రతి ఓటరు గమనించాలి. స్వయంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన, సీట్లు మారాయి, సీఎం మారాడు కానీ పేద ప్రజల బతుకులు మారలేదు! అభివృద్ధి పేరుతో కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు.

అధికార మార్పిడి తప్ప ఒరిగిందేమిటి?

ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అధికారం అంటూ వెంపర్లాడటం కాకుండా పౌర, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతామని ఒక స్పష్టమైన ఆలోచన విధానాన్ని ప్రజల ముందు ఉంచడం లేదు. ఒకరి నుంచి ఇంకొకరికి అధికారం అప్ప చెప్పడమే తప్ప ప్రజల అధికారం దిశగా ప్రజల పాలన దిశగా ఏ ఒక్కరు కూడా స్పష్టమైన హామీ ఇవ్వనంత కాలం ప్రజలు ఓటు వేసి తమ దరిద్రాన్ని మూటగట్టుకుని ఇంకా దరిద్రంలోకి నెట్టివేయబడతారు తప్ప ప్రజలకు ప్రజలకు మేలు జరుగుతుందని అనుకోవడం భ్రమనే అవుతుంది. రానున్న ఎన్నికల్లో తమ ఓటు ఎందుకు ఉపయోగపడుతుందో, ఓటు ద్వారా ఏమి లబ్ధి చేకూరుతుందో ఒక్కసారి ఆలోచన చేసి ప్రతి ఓటరు తమ నిర్ణయాన్ని తీసుకోవాలి.

తెలంగాణ రాష్ట్రంలో పౌర ప్రజాస్వామిక హక్కుల సాధనకై ప్రతి పౌరుడు కంకణబద్ధులై ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మానవుడు సహజంగా జీవించలేని పరిస్థితి ఏర్పడే విధంగా సమాజాన్ని తయారు చేసిన పాలకుల తీరును తీవ్రంగా ఖండించాలి. పేదలకు కనీసం రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కులు తూతూ మంత్రంగానే అమలు చేస్తున్నారు. తెలుసుకొని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ హక్కులను రక్షించుకునే విధంగా సామాజిక ఉద్యమ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం చేయాలనుకునే స్పూర్తితో ఉద్యమిద్దాం..

వేముల గోపినాథ్

తెలంగాణ ఉద్యమకారులు

సామాజిక కార్యకర్త

96668 00045


Next Story

Most Viewed