BRS: తెలంగాణ ఆత్మను వదిలేసిన బీఆర్‌ఎస్! విశ్వసనీయత ఉండేనా?

by Viswanth |
BRS: తెలంగాణ ఆత్మను వదిలేసిన బీఆర్‌ఎస్! విశ్వసనీయత ఉండేనా?
X

తెలంగాణ అస్తిత్వ పతాకను కేసీఆర్ బలమైన రాజకీయ ఆయుధంగా మల్చుకున్నారు. రాజకీయ అండ లేకపోతే రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష సాకారం కాదనే అంశాన్ని పసిగట్టారు. జై తెలంగాణ నినాదమే ఆయనను ముందుకు నడిపించింది. టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ అనే గుర్తింపును సొంతం చేసుకున్నది. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారిని ఈ నినాదం కదిలించింది. ఒక ఎనర్జీగా మారింది. ఏ గడ్డమీద ఉన్నా తెలంగాణ వ్యక్తినే అని సగౌరవంగా చెప్పుకునేలా చేసింది. రాజకీయ పార్టీ ఏదైనా జాయింట్ యాక్షన్ కమిటీ రూపంలో ఒక్క తాటి మీదకు తెచ్చింది. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు.. ఇలాంటి తేడాలేవి లేకుండా ఉద్యమంలోకి ఆకర్షించింది.

కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, తెలుగుదేశం ఆంధ్రోళ్ళ పార్టీ అనేది ప్రజలలోకి బలంగా వెళ్లింది. టీఆర్ఎస్ మన పార్టీ అని తెలంగాణ ప్రజలంతా సొంతం చేసుకునేలా మారింది. తెలంగాణలోని ప్రజలు సాధారణంగా మాట్లాడుకునే యాస కేసీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన మాటలలో వ్యంగ్యం ఉన్నా, బూతులు ఉన్నా ప్రజలు ఎంజాయ్ చేసేవారు. 'ఇదే మా యాస.. మా భాష..' అని ప్రజలు సైతం గొప్పగా చెప్పుకునేవారు. తెలంగాణ పదమే ఆయన పార్టీకి పెద్ద ఆస్తి. అదే చివరకు బంగారు తెలంగాణ నినాదానికీ ఉపయోగపడింది. ఇప్పుడు పార్టీ పేరు నుంచి ఆ పదం మాయమైంది. ప్రజలు ఎలా స్వీకరిస్తారనేదే ఆసక్తికరం.

తెలంగాణ రాష్ట్ర సమితి లాంఛనంగా భారత్ రాష్ట్ర సమితిగా మారింది. రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయస్థాయికి వెళ్తున్నది. రాష్ట్రాన్ని సాధించిన స్ఫూర్తితో ఇప్పుడు దేశాన్ని మార్చేస్తామని ఆ పార్టీ నేతలు ఒకింత గర్వంగా ఉన్నారు. 'ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో మా సారు దేశాన్నే ఉద్ధరిస్తారంటూ' ఆ పార్టీ నేతలు కొందరు బలంగా నమ్ముతున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన 'తెలంగాణ' పదం ఇప్పుడు పార్టీ పేరులో కనుమరుగు కావడంతో భవిష్యత్తు ఏమవుతుందోననే మరికొందరు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణతో బంధం తెగిపోయిందనే విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా ఇకపైన కేసీఆర్‌ను, ఆయన ఆధ్వర్యంలో నడిచే బీఆర్ఎస్(brs) పార్టీని ప్రజలు ఎలా ఆదరిస్తారనేది రాష్ట్రవ్యాప్తంగానే చర్చనీయాంశమైంది.

మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ నాలుగు అక్షరాల పదం ఒక బలమైన ఆకాంక్ష, ఆశ, ఆత్మగౌరవం, నినాదం, భవిష్యత్తు, ఉద్వేగం, సెంటిమెంట్, జీవితం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుబంధం. ఈ పదమే వారిని స్వరాష్ట్ర సాధన ఉద్యమంలోకి దూకించింది. పోరాట పటిమను, తెగువను నేర్పించింది. ఆత్మగౌరవం, బంగారు భవిష్యత్తుకు పోలీసుల లాఠీ దెబ్బలు, కేసులు లెక్కే కాదన్న స్ఫూర్తిని నింపింది. కుల, మత, జిల్లా, ప్రాంతం, పార్టీ తేడాలు లేకుండా యావత్తు ప్రజానీకాన్ని మలిదశ ఉద్యమంలో భాగస్వాములను చేసింది. వందలాది మంది రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలర్పించారు. త్యాగాల పునాదిపై ఏర్పడిన తెలంగాణ ఈ రోజు ఒక రియాలిటీ.

కేసీఆర్ కేరాఫ్ తెలంగాణ

తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో ఉన్న కేసీఆర్‌ను తెలంగాణ పదం ఉన్నత స్థానాలకు చేర్చింది. 'కేసీఆర్ అంటే తెలంగాణ. తెలంగాణ అంటే కేసీఆర్' అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ పదమే ఆయన స్థాపించిన టీఆర్ఎస్(trs) పార్టీకి పునాది. పలువురిలో ఒకరిగా కాకుండా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. సొంత పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఆ పదాన్ని ఆయన తన శక్తి మేరకు వాడుకున్నారు. రాష్ట్రానికే పరిమితమైన ఆయన బేస్ తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో పలు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల నేతలతో పరిచయాన్ని పెంచింది. ఆ పదమే ఆయన పార్టీకి పెట్టుబడి అయింది. చివరకు ఆయనకు అధికారాన్ని అప్పగించింది. ఆయన కుటుంబ సభ్యులకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది.

అప్పటికే ప్రజా సంఘాల స్థాయిలో నలుగుతున్న తెలంగాణ డిమాండ్ పొలిటికల్ షేప్ తీసుకున్నది. దాన్ని పవర్‌ఫుల్ వెపన్‌గా మల్చుకోవడంలో దూరదృష్టితో వ్యవహరించి సక్సెస్ అయ్యారు. ఉద్యమ నాయకుడనే గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ తెలంగాణ పదమే ఆయన కుటుంబ సభ్యులందరికీ రకరకాల పదవులను పంచిపెట్టింది. విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చింది. ఆ కుటుంబ వ్యక్తిగత ఆస్తులు పెరగడానికి దోహదపడింది. ఒక సక్సెస్‌పుల్ పొలిటీషియన్‌గా తీర్చిదిద్దింది. ఫ్యూచర్ పొలిటికల్ జెనరేషన్‌కు అవకాశం కల్పించింది. ఒక దశలో తెలంగాణ రాష్ట్ర చిత్రపటం గులాబీ రంగులోనే ఉంటుందన్న సాధారణ అభిప్రాయాన్ని కలిగించింది.

ప్రశ్నార్థకంగా తెలంగాణ బంధం

తెలంగాణ అస్తిత్వ పతాకను కేసీఆర్ బలమైన రాజకీయ ఆయుధంగా మల్చుకున్నారు. రాజకీయ అండ లేకపోతే రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష సాకారం కాదనే అంశాన్ని పసిగట్టారు. జై తెలంగాణ నినాదమే ఆయనను ముందుకు నడిపించింది. టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ అనే గుర్తింపును సొంతం చేసుకున్నది. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసులవారినీ ఈ నినాదం కదిలించింది. ఒక ఎనర్జీగా మారింది. ఏ గడ్డమీద ఉన్నా తెలంగాణ వ్యక్తినే అని సగౌరవంగా చెప్పుకునేలా చేసింది. రాజకీయ పార్టీ ఏదైనా జాయింట్ యాక్షన్ కమిటీ రూపంలో ఒక్క తాటిమీదకు తెచ్చింది. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు.. ఇలాంటి తేడాలేవీ లేకుండా ఉద్యమంలోకి ఆకర్షించింది.

కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, తెలుగుదేశం ఆంధ్రోళ్ళ పార్టీ అనేది ప్రజలలోకి బలంగా వెళ్లింది. టీఆర్ఎస్ మన పార్టీ అని తెలంగాణ ప్రజలంతా సొంతం చేసుకునేలా మారింది. తెలంగాణలోని ప్రజలు సాధారణంగా మాట్లాడుకునే యాస కేసీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన మాటలలో వ్యంగ్యం ఉన్నా, బూతులు ఉన్నా ప్రజలు ఎంజాయ్ చేసేవారు. 'ఇదే మా యాస.. మా భాష..' అని ప్రజలు సైతం గొప్పగా చెప్పుకునేవారు. తెలంగాణ పదమే ఆయన పార్టీకి పెద్ద ఆస్తి. అదే చివరకు బంగారు తెలంగాణ నినాదానికీ ఉపయోగపడింది. ఇప్పుడు పార్టీ పేరు నుంచి ఆ పదం మాయమైంది. ప్రజలు ఎలా స్వీకరిస్తారనేదే ఆసక్తికరం.

తెరపైకి విశ్వసనీయత ఇమేజ్

దీనిపై ఆ పార్టీ నేతలలోనే విస్తృతంగా చర్చ జరుగుతున్నది. సామాన్య ప్రజానీకంలోనూ ఇది రిఫ్లెక్ట్ అవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అందరికంటే ఎక్కువ బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమేననేది ప్రజల స్వీయానుభవం. అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీ అమలు, దళితుడే తొలి ముఖ్యమంత్రి ప్రామిస్, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాల పెండింగ్, ఇవన్నీ కేసీఆర్‌కు మచ్చగానే మిగిలిపోయాయి. నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్‌లో ఆ పార్టీ నేతల అభిప్రాయం ఎలా ఉన్నా, ప్రజలలో మాత్రం 'ఆల్ ఈజ్ వెల్' అనేదేమీ లేదు. ప్రజల పేరుతో ఆ పార్టీ నేతలు ఆస్తిపరులయ్యారనేది అన్ని గ్రామాలలో వినిపించే జనరల్ టాక్. వైఎస్సార్ తరచూ వినిపించే 'విశ్వసనీయత' ఇప్పుడు జనం మధ్య చర్చగా మారింది. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారనే ముద్రపడింది.

'తెలంగాణను ఉద్ధరించలేనోడు దేశాన్ని బాగుచేస్తాడంట..' అనే సెటైర్లూ వినిపిస్తున్నాయి. 'రాష్ట్రం ఏర్పడే వరకే ఉద్యమ పార్టీ. ఇప్పుడు మాది ఫక్తు రాజకీయ పార్టీ' అని నిండు అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన మాటలను జనం గుర్తుచేసుకుంటున్నారు. జాబ్ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి(unemployment benefit), కేజీ టూ పీజీ(kg-pg), ఉచిత ఎరువులు.. ఇలా అనేకం మాటలకే పరిమితమయ్యాయనే అసంతృప్తి ప్రజల్లో నెలకొన్నది. విప్లవాత్మకం అని కేసీఆర్ చెప్పుకునే రైతుబంధు (rythu bandhu), దళితబంధుపైనా(dalit bandhu) విమర్శలు ఉన్నాయి.

భవిష్యత్ మనుగడపైనే చర్చలు

తెలంగాణ సెంటిమెంట్‌ 2014లో, 2018లో అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్‌కు బలంగా తోడ్పడింది. ఇప్పుడూ ఆ అస్త్రాన్ని వాడుకోడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నది. 'షర్మిల(ys sharmila) సీమాంధ్ర వ్యక్తి.. ఆమెకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హతెక్కడిది? నాడు తెలంగాణను వ్యతిరేకించిన కుటుంబం ఆమెది' అంటూ గులాబీ నేతలు కౌంటర్ ఇవ్వడం అందులో భాగమే. ఇదే సమయంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత(kalvakuntla kavtitha) రెండు రోజుల క్రితం 'సెంటిమెంట్ మమ్మల్ని గెలిపించలేదు' అని వ్యాఖ్యానించడం కూడా రాష్ట్ర ప్రజలకు ఆగ్రహం కలిగించింది. పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్నే తొలగించిన కేసీఆర్‌కు, గులాబీ పార్టీ నేతలకు ఇక ఎంతమాత్రం తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకునే హక్కు, అర్హత లేదనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. రెండుసార్లు అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో బీఆర్ఎస్ పేరుతో ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఓపెన్‌గా జరుగుతున్న చర్చ. ఆ పార్టీ నేతలలోనూ ఈ గుబులు ఉన్నది.

రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో ఉనికిలోకి వచ్చిన ఆ పార్టీని దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఆదరించారు. గతంలో ఇదే డిమాండ్‌తో ఏర్పడిన 'అసోం గణ సంగ్రామ పరిషత్‌'ను కూడా ఆ రాష్ట్ర ప్రజలు పవర్‌లోకి తీసుకొచ్చారు. పార్టీ పేరు నుంచి 'సంగ్రామ్' అనే పదం కనుమరుగు కావడంతో ఆ పార్టీ ఉనికి, అస్తిత్వం ప్రశ్నార్ధకమైంది. రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పుట్టుకొచ్చిన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి కూడా అక్కడి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయినా ఆ పార్టీలో 'ముక్తి' పదాన్ని మాత్రం అలానే ఉంచుకున్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా(telangana rashtra samithi) 22 ఏండ్ల క్రితం ఉనికిలోకి వచ్చి ఇంతకాలం పవర్‌లో ఉండి ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా(bharat rashtra samithi) మారింది. పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తొలగించుకున్నది. ఆ పార్టీ భవిష్యత్తును తెలంగాణ ప్రజలు ఎలా నిర్ణయిస్తారనేదానికి కాలమే సమాధానం చెబుతుంది.

ఎన్. విశ్వనాథ్

9971482403

Read more:

1.BRS:ఏక్ నిరంజన్. BRS పార్టీని పట్టించుకోని జాతీయ నేతలు

2.BRS ఫస్ట్ మీటింగ్ అక్కడే.. త్వరలో తేదీ ఖరారు?



Next Story

Most Viewed