వ్యవస్థ లోపమే లీకేజీకి కారణం!

by Disha Web Desk 13 |
వ్యవస్థ లోపమే లీకేజీకి కారణం!
X

నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మొదట్నుంచి మోసం జరుగుతున్నది. ఉద్యోగాల భర్తీపై నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ చెప్పిన ఒక్క మాటా అమలైతలేదు. రాష్ట్రం వస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఆశించి ఉద్యమంలో పాల్గొని రాష్ట్రం వచ్చాక ఉద్యోగాల కోసం చూస్తూ ఉండిపోయారు. 2014లో అధికారం చేపట్టిన కేసీఆర్..2018 నాటికి కనీసం 40 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. దీంతో చాలా మంది ప్రిపరేషన్ బంద్ పెట్టి.. ప్రైవేట్ ఉద్యోగంలో చేరారు. నిరుద్యోగుల అసంతృప్తిని పసిగట్టిన కేసీఆర్.. నిరుద్యోగులకు నెలకు రూ. 3,016 చొప్పున భృతి ఇస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ మళ్లీ అధికారంలోకి రాగానే ప్రతి ఉద్యోగాన్నీ భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి అని, ప్రిపరేషన్‌లో ఉన్న అభ్యర్థులకి స్కాలర్షిప్ ఇస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా ఏ ఒక్కరికి సాయం చేయలేదు.

వారిలో విశ్వసనీయత పెరగాలి..

ఎన్నికల ఏడాది కావడంతో ఒకేసారి పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించి పరీక్ష నిర్వహణ టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. అయితే ఆ సంస్థ నిర్వహించిన పరీక్షా పత్రాలు లీక్ కావడంతో నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారమైంది. నిజానికి కమిషన్‌లో ఏం జరిగినా బాధ్యత కార్యదర్శిదే. జీవో (నం.44. 8.8.2014)లో కార్యదర్శి, చైర్మన్, సభ్యుల బాధ్యతలు స్పష్టంగా ఉన్నాయి. నిర్ణయాలు తీసుకునేది కమిషన్ చైర్మన్ అయినా వాటి అమలు బాధ్యత మాత్రం కార్యదర్శిదే. కీలకమైన విషయాలు కార్యదర్శి, చైర్మన్లకు మాత్రమే తెలుస్తాయి. కంప్యూటర్ పాస్ వర్డ్, షేరింగ్, పర్మిషన్లు వీరిద్దరి పర్యవేక్షణలోనే ఉంటాయి. థర్డ్ పర్సన్‌కు తెలియదు.

కానీ ఇద్దరు ఉద్యోగుల దగ్గరకి ఈ వివరాలు వెళ్లడం వ్యవస్థ వైఫల్యం కాదా..? పోనీ దొంగిలించారనుకున్నా అలర్ట్ మెసేజ్ వ్యవస్థ ఎందుకు లేదు..? అసలు కమిషన్‌లో సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అనివార్యం కానీ ఎందుకు పాటించలేదు..? కమిషన్‌లోని సిబ్బంది చేతికి పాస్‌వర్డ్, ప్రశ్నాపత్రాలు వెళ్ళాయంటే సెక్రటరీ, చైర్మన్ పర్యవేక్షణ ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో తెలుస్తున్నది. దీనికి ఆ ఇద్దరూ బాధ్యత వహించాలి. దాదాపు 15 పరీక్షలు రద్దుపై అభ్యర్థుల్లో, విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు నిరుద్యోగుల్లో దీనిపై విశ్వసనీయత పెరగడం ఎంతో అవసరం.

అయితే జరిగిన లోపానికి పరిహారం ఏంటనేది ఇప్పుడు కీలకమైన అంశం. ఆ పరిహారాన్ని కమిషన్ ఇస్తుందా.. లేక ప్రభుత్వం ఇస్తుందా..? వ్యవస్థలో లోపం జరిగినప్పుడు ఎవరు జవాబుదారీ వహించాలి? సెక్రటరీయా?.. లేక చైర్మనా? అయితే ఈ లీకేజీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణపై నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో సిట్ విచారించిన కేసులు ఏమయ్యాయో కూడా తెలియదు. అందుకే నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఈ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేతనో, లేదా సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

సభావత్ కళ్యాణ్

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు

90143 22572


Next Story

Most Viewed