దేశభక్తి వైపు.. జెన్‌ Z యువత!

by Ravi |   (  Updated:2025-09-27 00:30:41  IST  )

భారత దేశంలో విద్యార్థి రాజకీయాలు ఎప్పటి నుంచో దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తిగా నిలిచాయి. ఇటీవల పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ,

దేశభక్తి వైపు.. జెన్‌ Z యువత!
X

భారత దేశంలో విద్యార్థి రాజకీయాలు ఎప్పటి నుంచో దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తిగా నిలిచాయి. ఇటీవల పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ సాధించిన ఘన విజయం, కొత్త తరంలోని ఆలోచనా దిశను స్పష్టంగా చూపిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా విశ్వవిద్యాలయాల్లో వామపక్ష భావజాలం బలంగా ఉంది. కానీ ఇప్పుడు విద్యార్థులు జాతీయతా భావజాలాన్ని ఎంచుకోవడం ఒక చారిత్రాత్మక మలుపు.. ఇది కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు, జాతీయ స్థాయిలో మారుతున్న యువత ఆలోచనల ప్రతిబింబం. విద్యార్థులు సమాజంలో మార్పు, దేశ అభివృద్ధి, సాంస్కృతిక విలువల పరిరక్షణ వంటి అంశాలు యువతను కొత్త దిశలో ఆలోచింపజేశాయి. అందుకే వామపక్ష భావజాలం వైపు, అతివాద ధోరణుల వైపు వీరు ఆకర్షింప బడటం లేదు. Gen Z తరం, సోషల్ మీడియా, గ్లోబల్ ఇంటర్నెట్ కల్చర్ ద్వారా ప్రభావితమవుతున్నా, వారు విశ్వ విద్యాలయ ఎన్నికల్లో జాతీయ వాదాన్ని ఎంచుకోవడం, వారి ఆలోచనల్లో ఉన్న లోతైన మార్పునకు నిదర్శనం. పైగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కూడా యువతలో దేశభక్తిని బలపరుస్తున్నాయి. ఆర్థిక రంగంలో సంస్కరణలు, సాంకేతిక రంగంలో అభివృద్ధి, అంతర్జాతీయ వేదికలపై భారత్ సాధిస్తున్న విజయాలు, విద్యార్థులను గర్వపడేలా చేస్తున్నాయి. ‘మన దేశం ముందు, మన ప్రయోజనం తర్వాత’ అనే భావన విద్యార్థులలో పెరుగుతోంది. ఈ అవగాహన కారణంగా ఏబీవీపీ వంటి జాతీయవాద విద్యార్థి సంస్థలు మరింత బల పడుతున్నాయి. ఈ మార్పు రాబోయే సంవత్సరాల్లో దేశ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. విశ్వ విద్యాలయాల్లో పెరుగుతున్న జాతీయవాద ధోరణి, భారతదేశం మరింత బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఎదగడానికి సహకరించనుంది. ఈ మార్పు తాత్కాలికం కాదు. ఇది ఒక జాతీయ పునరుజ్జీవన సంకేతం. Gen Z తరం దేశభక్తిని ఎంచుకోవడం వల్ల, రాబోయే దశాబ్దాల్లో భారతదేశం మరింత శక్తివంతమైన సాంస్కృతిక, రాజకీయ శక్తిగా నిలవనుంది.

-పెండెం సుమంత్

90593 24753

Next Story