సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే!

by Disha edit |
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే!
X

తంలో డబ్బులు దోచుకొని వెళ్ళేవారు. కానీ ప్రస్తుతం ఈ నేరాలు ప్రత్యక్షంగా కాకుండా ఆన్ లైన్ ద్వారా సైబర్ క్షేత్రంలో జరుగుతున్నాయి. మోసగాళ్ళు ఇంటర్నెట్ ఆధారంగా లావాదేవీలలో వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరంగా దోచుకుంటున్నారు. ఆన్‌లైన్ ప్రైవసీని భగ్నం చేయడం, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం, భద్రతకు ముప్పు కలిగించడం వంటివి చేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడేవారెవరో గుర్తించడం అత్యంత కష్టం. ఈ నేరాల తీవ్రతకు ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి.

రోజురోజుకు నేరాల తీవ్రత ఊహించనంత వేగంగా విస్తరిస్తోంది. మన దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం సైతం పెరిగింది. ఏదో ఒక రకంగా మభ్యపెట్టి నగదు దోచేస్తారు. విద్యావంతులు కూడా వీరి వలలో పడుతున్నారు. అలా పోయిన డబ్బు పోలీసులకు, బ్యాంకులకు, ఫిర్యాదు చేస్తే 100 శాతం తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే సైబర్‌ నేరాలకు గురికాకుండా జాగ్రత్త పడడమే ఉత్తమమైన మార్గం.

గణాంకాల ప్రకారం..

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2008లో దేశవ్యాప్తంగా 288 సైబర్ నేరాలు నమోదైతే, 2009లో 420, 2010లో 966, 2011లో 1791, 2012లో 2876 కేసులు నమోదయ్యాయి. ఒక్క ఏడాదిలోనే 60 శాతం నేరాలు పెరిగాయి. సైబర్ నేరాల తీవ్రత ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని స్పష్టమవుతుంది. ఐపీసీ సెక్షన్ ప్రకారం 2011 లో 422 సైబర్ నేరాలు నమోదైతే, 2012లో 601 సైబర్ నేర కేసులు నమోదయ్యాయి. ఒక్క ఏడాది వ్యవధిలో 42.4 శాతం పెరుగుదల నమోదయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

డబ్బు వ్యవహారాలు ఆన్‌లైన్‌ లో పెరిగేకొద్ది ఆర్థిక నేరాలు తీవ్రమవుతున్నాయి. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం 2021– 22లో రూ.60,414 కోట్ల మేర సైబర్‌ మోసాలు చోటుచేసుకున్నాయి. ఈ నేరాల వల్ల డబ్బు కోల్పోయిన 75 శాతం మంది బాధితులకు ఆ సొమ్ము తిరిగి రావడం లేదు. లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ సైబర్‌ నేరాల బాధితులను మూడేళ్ల పాటు సర్వే చేయగా, వారిలో 74 శాతం మందికి ఇప్పటికీ డబ్బు వాపస్‌ కాలేదని తెలిసింది. 33 శాతం మంది తమ బ్యాంక్‌ అకౌంట్, డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు పాస్‌వర్డ్స్, ఆధార్, పాన్‌కార్డు నంబర్లను కంప్యూటర్‌లో దాచుకున్నారనీ, 11 శాతం మంది ఈ వివరాలన్నీ అన్నింటిని మొబైల్‌లో భద్రపరచుకున్నట్లు చెప్పారు. దీంతో సులభంగా హ్యాకర్లు చోరి చేస్తున్నారు.

ఎంత అవగాహన కల్పించినా..

కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో దాని నుంచి ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక సదుపాయాలను రక్షించడానికి జాతీయ ఇంటర్నెట్ భద్రత విధానం-2013 ను రూపొందించింది. ఈ విధానంలో 14 సరికొత్త అంశాలను లక్ష్యాలుగా ప్రకటించింది. ఇందులో దేశ ఇంటర్నెట్ అస్థిరతను, ఆర్థిక అస్థిరత తో సమానంగా భావిస్తున్నట్టు పేర్కొంది. అలాగే లక్షల మంది ఇంటర్నెట్ భద్రతా సిబ్బంది, నిపుణులతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అలాగే వారికి సాంకేతిక శిక్షణ సామర్థ్య నిపుణులతో ఇప్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. అన్ని విధాలుగా సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని ఈ భద్రతా విధానం సూచిస్తోంది. ఈ నేరాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఒక జాతీయ నోడల్ ఏజెన్సీతో కలిసి సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సి ఉంటుంది.

అలాగే ప్రజలు సైతం ఇటువంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్నిసార్లు ఈ నేరాలపై అవగాహన కల్పిస్తున్న కొందరు అమాయకులు వారి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. లాటరీలు, రివార్డులు, జాబ్స్, కమీషన్స్, డిస్కౌంట్ అంటూ ఆశ చూపి నిలువునా ముంచుతున్నారు. బ్యాంకు పేరుతో ఫోన్ చేసి ఎన్నో రకాలుగా మభ్యపెట్టి ప్రజలకు తెలియకుండానే డబ్బులు కాజేస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు సైబర్, ఆన్‌లైన్ మోసాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. సైబర్ నేరాలపై 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయాలని సూచించింది. ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు, అనవసరమైన లింక్‌లు క్లిక్ చేయొద్దు, ఉపయోగించని సమయాలలో నెట్ ఆఫ్ చేయాలి, ఏదైనా సమాచారం అవసరమైతే అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించుకోవాలి, బయటి ప్రాంతాల్లో ఉచిత వైఫై వాడొద్దు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలు అప్‌లోడ్ చేయకపోవడం ఉత్తమం. అప్పుడే సైబర్ నేరాలు తగ్గి, ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటాం.

మోటె చిరంజీవి

9949194327.

Next Story

Most Viewed