వరల్డ్ వాక్ :ప్రాణాలు తీస్తున్న గాలి

by Disha edit |
వరల్డ్ వాక్ :ప్రాణాలు తీస్తున్న గాలి
X

1998–2018 మధ్యలో భారతీయులు సగటున 1.80 ఏళ్ల జీవితకాలాన్ని కోల్పోయారు. 2018 నాటి వాయు కాలుష్యమే ఇప్పుడు కూడా కొనసాగితే, రాబోయే కాలంలో భారతీయుల సగటు జీవిత కాలం 5.20 ఏళ్లు తగ్గిపోతుందని హెచ్చరికలు చేసినా ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టలేదు. దేశంలో 84 శాతం మంది నిర్దేశించిన వాయు కాలుష్య ప్రమాణాల కంటే దిగజారిన పరిస్థితులలో జీవిస్తున్నారు. మన దేశంలో వాయు కాలుష్యం తీవ్రత ఉత్తర భారతంలో ఎక్కువగా ఉంది. అక్కడ 24.80 కోట్ల మంది సగటు జీవితకాలం 8 ఏళ్లు హరించుకుపోతోందని ఒక అధ్యయనం తెలిపింది. లక్నోవాసులు అత్యధికంగా ఆయుఃప్రమాణాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది.

నం పీల్చే గాలే మనలను చంపేస్తోంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా 90 లక్షల మరణాలు సంభవిస్తే, మన దేశంలో 23 లక్షల మంది మరణించారు. ఒక్క వాయు కాలుష్యంతోనే మన దేశంలో దాదాపు 17 లక్షల మంది ప్రాణాలు వదిలారు. కాలుష్య మరణాలలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మన తర్వాతి స్థానంలో చైనా నిలిచింది. చుట్టూ మనం ఏర్పరుచుకున్న కాలుష్యాలే మన ఊపిరి తీస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు యేటా లక్షలాది మంది కాలుష్యం వలన మృత్యుబారిన పడుతున్నారు. విశ్వవ్యాప్తంగా ప్రతి ఆరు మరణాలలో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నదని లాన్సెట్ నివేదిక ద్వారా వెల్లడయ్యింది.

2019లో వివిధ రకాల కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 9 మిలియన్ల మంది (90 లక్షలు) మరణించారు. వాయు కాలుష్యం కారణంగా 66 లక్షల మంది బలయ్యారని నివేదిక తెలిపింది. అన్ని రకాల కాలుష్యాలతో ప్రపంచవ్యాప్తంగా యేటా లక్ష మందిలో 117 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యధికంగా సెంట్రల్ ఆఫ్రికా దేశమైన చాద్‌లో ప్రతి లక్ష మందికి 300 మంది చనిపోతుండగా, అతి తక్కువ కాలుష్య కారక మరణాలు బ్రూనై, ఖతార్, ఐస్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంటున్నాయి. భారత దేశంలో 2019లో 23లక్షల అకాల మరణాలు సంభవించగా వీటిలో 16 లక్షల మంది వాయు కాలుష్యంతో మరణించినట్లు నివేదిక తెలిపింది. చైనా 22 లక్షల మరణాలతో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది.

ఆగని మరణాలు

అమెరికాలో 1.42 లక్షల మంది బలయ్యారు. కాలుష్యంతో వచ్చే వ్యాధుల కారణంగా దేశంలో రోజుకు సగటున 6,500 మరణాలు జరుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కరోనా సమయంలో మరణించినవారి కంటే చాలా ఎక్కువ. భారతదేశంలో వాయు కాలుష్య సంబంధిత మరణాలు (9.8 లక్షలు) PM 2.5 కాలుష్యం వలననే సంభవించాయని ఈ నివేదిక సారాంశం. PM అంటే పర్టిక్యులేట్‌ మేటర్‌ (అత్యంత సూక్ష్మ దుమ్ము, ధూళి కణాలు). 2.5 మైక్రో మీటర్లకన్నా చిన్నవాటిని PM 2.5, 10 మైక్రోమీటర్ల పరిమాణం ఉన్నవి PM 10గా పేర్కొంటారు. నిర్మాణాలు జరుగుతున్న చోట, కచ్చా రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలు, మంటలు, వివిధ రకాల పొగల నుంచి ఇవి ఏర్పడుతాయి.

సల్ఫర్‌ డై ఆక్సయిడ్, నైట్రోజన్‌ ఆక్సయిడ్ వంటి ప్రమాదకర వాయువులు, పవర్‌ ప్లాంట్లు, పరిశ్రమలు, వాహనాల నుంచి ఇవి ఎక్కువగా వెలువడతాయి. PM 2.5 అంశంలో కూడా భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. PM 2.5...7.5 నుంచి 8.5 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్టు లెక్క. గ్లోబల్‌ ఎయిర్‌ నివేదిక ప్రకారం భారత్‌లో 8.3 వరకు ఉంది. దేశంలోని 93 శాతం విస్తీర్ణంలో క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాముల ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే భారతదేశం PM 2.5 కాలుష్యం ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. మనుషులు ఏడాదిపాటు పీల్చేగాలిలో 2.5 PM రేణువులు 5 గ్రాములకంటే ఎక్కువ ఉండకూడదు, 10 PM రేణువులు 15 గ్రాములు దాటకూడదు. నైట్రోజన్‌ ఆక్సయిడ్ సాంద్రత ఏడాదికి పదిగ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ, ప్రపంచంలో చాలా వరకు అధికాదాయ దేశాలలోని నగరాలు ఈ స్థాయిలను ఎప్పుడో దాటి ప్రమాదకర స్థితికి వెళ్లిపోయాయి.

క్షీణిస్తున్న ఆయుః ప్రమాణం

1998–2018 మధ్యలో భారతీయులు సగటున 1.80 ఏళ్ల జీవితకాలాన్ని కోల్పోయారు. 2018 నాటి వాయు కాలుష్యమే ఇప్పుడు కూడా కొనసాగితే, రాబోయే కాలంలో భారతీయుల సగటు జీవిత కాలం 5.20 ఏళ్లు తగ్గిపోతుందని హెచ్చరికలు చేసినా ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టలేదు. దేశంలో 84 శాతం మంది నిర్దేశించిన వాయు కాలుష్య ప్రమాణాల కంటే దిగజారిన పరిస్థితులలో జీవిస్తున్నారు. మన దేశంలో వాయు కాలుష్యం తీవ్రత ఉత్తర భారతంలో ఎక్కువగా ఉంది. అక్కడ 24.80 కోట్ల మంది సగటు జీవితకాలం 8 ఏళ్లు హరించుకుపోతోందని ఒక అధ్యయనం తెలిపింది. లక్నోవాసులు అత్యధికంగా ఆయుఃప్రమాణాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది. వారు సగటున 10.30 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోతారని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దక్షిణ భారతంలో తమిళనాడు మొదటిస్థానంలో ఉండగా, తరువాత స్థానాలలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఉన్నాయి. గాలి కలుషితమై పసిపిల్లల ఉసురు తీస్తున్న దేశాలలో భారత్‌ కూడా ఉండడం విషాదకరం. 2019లో 1,16,000 మంది నవజాత శిశువులు పుట్టిన నెలలోపే ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలో 67,900, పాకిస్తాన్‌‌లో 56,500, ఇథియోపియాలో 22,900, డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో 1,200 మంది చిన్నారులు మరణించారు. ప్రాణనష్టం, అకాల మరణాలతో 2019లో ప్రపంచానికి 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని, జీడీపీకి ఒక శాతం నష్టం వాటిల్లింది. సిబ్బందిలో చురుకుతనం తగ్గి ఉత్పాదకత మందగించి అనేక వాణిజ్య సంస్థలు నష్టపోతున్నాయి. కాలుష్యాన్ని అరికట్టడానికి అవసరమైన నిధుల కేటాయింపులు లేవని లాన్సెట్ నివేదిక స్పష్టం చేసింది.

రుద్రరాజు శ్రీనివాసరాజు

94412 39578

లెక్చరర్, ఐ.పోలవరం

Next Story