వరల్డ్ వాక్:ఎడారి దేశంలో తెలుగు 'చిత్రం'

by Disha edit |
వరల్డ్ వాక్:ఎడారి దేశంలో తెలుగు చిత్రం
X

భూగోళం మీద తెలుగువారు కాలు పెట్టని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదేమో! తాము అడుగిడిన ప్రతి గడ్డపై తమదైన ప్రతిభాపాటవాలతో అద్భుతంగా రాణిస్తూ స్వదేశంలోనే కాక విదేశాలలో సైతం వికసిస్తుంటారు మన తెలుగు కుసుమాలు. ఆ కోవకే చెందినవారు వక్కలంక లక్ష్మి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో గల పేరవరంలో జన్మించిన లక్ష్మి ప్రస్తుతం దుబాయిలోని SLADS అనే అడ్వర్టైజింగ్ సంస్థ ఆర్ట్ డైరెక్టర్‌గా తన ప్రతిభను చాటుతున్నారు.

సాహితీవేత్త, మహాకవి పులుగుర్త రామారావు ముని మనవరాలు, మధురకవి జొన్నలగడ్డ సోమేశ్వర అచ్యుత రామచంద్రరావు మనవరాలు, డా జొన్నలగడ్డ మార్కండేయులు, శారద దంపతుల కూతురు. వారి వారసత్వంగా అద్వితీయమైన జ్ఞాన సంపదను పుణికిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా ఎడారి దేశంలో తెలుగు రాష్ట్రాల కీర్తిని ఇనుమడింప చేస్తున్నారు. ఈ నెల 16 నుండి 19 వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా దుబాయి వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో నిర్వహించనున్న 'వరల్డ్ ఆర్ట్ దుబాయి' ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో తన స్వహస్తాలతో రూపొందించిన కళాఖండాలను ప్రదర్శించడానికి సమామత్తమయ్యారు.

అభిరుచితో ముందడుగు

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సైన్సులో డిగ్రీ పూర్తి చేసిన లక్ష్మి వివాహానంతరం ఫైన్ ఆర్ట్స్ నిపుణుడు, అడ్వర్టైజింగ్ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న భర్త వక్కలంక శ్రీనివాసరావు ప్రోద్బలంతో కంప్యూటరు ప్రోగ్రామింగు నేర్చుకున్నారు. స్వయంకృషితో ఆ రంగంలో సాధించిన విశేష నైపుణ్యం ఆధారంగా దుబాయ్‌ను వేదికగా చేసుకుని తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఆర్టు డైరెక్టరుగా తాను సాధించిన అనుభవాన్ని సమాజంలో నలుగురికీ ఉపయోగ పడేలా చేయాలన్నది ఆమె సదాశయం. ఈ సంకల్పం తో సమాజంలోని ఔత్సాహికులకు ఉపాధి కల్పించి వారికి ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆమె మస్తిష్కంలో మెదిలిన ఆలోచనకు ప్రతిరూపమే దుబాయి కేంద్రంగా నెలకొల్పిన సంస్థ మరో శాఖను హైదరాబాద్ లో కూడా ఏర్పాటు చేసి తనదైన శైలిలో ఇతరులకు చేయూత అందిస్తున్నారు.

ఆర్ట్ డైరెక్టరుగా తన విశేష నైపుణ్యాన్ని రంగరించి 'గల్ఫ్ గౌర్మెట్', 'విజిట్ ఆల్ ఐన్'లాంటి మాసపత్రికలకు ఆమె రూపకల్పన చేసిన అద్భుత డిజైనింగు ఆ పత్రికలకే కాక ఆమెకు కూడా ఖ్యాతినార్జించి పెట్టింది. దుబాయి ఎల్లలు దాటిన ఆమె ప్రతిభ అంతర్జాతీయంగా రొటానా హోటల్స్, సామ్ సంగ్, ADCB బ్యాంక్, ఆల్ దియా ఫా స్కూలు, ఆర్ట్ కుతూరు, నోబెల్ ఎలక్ట్రానిక్స్, రెడ్ ట్యాగ్ ఫ్యాషన్ లాంటి ఎన్నో సంస్థలకు చేసిన యాడ్ క్యాంపెయిన్ లలో ఆమెలోని క్రియేటివిటీకి అద్దం పట్టాయి.

సోషల్ మీడియా ఆధారంగా

కాలానుగుణంగా అడ్వర్టైజింగు రంగంలో సంభవిస్తున్న మార్పులను సునిశితంగా గమనించే ఆమె తన దృష్టిని సోషల్ మీడియా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వైపు సారించారు. తనదైన పంథాలో ఎన్నో మొబైల్ అప్లికేషన్స్ తన ఆఫీస్ లో UI UX డిజైన్ చేసి, టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తూ మొబైల్ యాప్స్ డెవలప్మెంట్ కూడా చేసారు. ఒక పక్క ప్రొఫెషనల్‌గా ఎదుగుతూనే తనలోని క్రియేటివిటీని ఎక్కడ మరుగున పడనీయకుండా, ఎప్పటికప్పుడు పెయింటింగ్స్ వేస్తూ, మరో పక్క పొలిమర్స్ క్లే తో చూపరుల మది దోచే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చెయ్యడం మాత్రం మానలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల నహ్యాన్ 2021 సంవత్సరాన్ని 'స్వర్ణోత్సవ సంవత్సరం' గా ప్రకటించారు.

6 ఏప్రిల్ 2021 న అధికారికంగా ప్రారంభమైన ఈ స్వర్ణోత్సవ సంబరాలు 31 మార్చ్ 2022 వరకు కొనసాగుతాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఘన చరిత్ర, గత 50 సంవత్సరాలలో సాధించిన ప్రగతి, ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అట్టహాసంగా వేడుకలు నిర్వహించాలని ఇవి భావి తరాలకు శతాబ్ది వేడుకలను నిర్వహించేందుకు ప్రేరణ నిచ్చే విధంగా రూపకల్పన చేయాలని స్వర్ణోత్సవ కమిటీ సంకల్పించింది. ఈ దిశగా చేపట్టే చర్యలు దేశంలోని యువత ప్రతిభాపాటవాలను గుర్తించి వారిని కాలానుగుణంగా వస్తున్న అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో సుశిక్షితులను చేస్తే భవిష్యత్ లక్ష్య సాధనకు బాటలు వేస్తాయన్నది స్వర్ణోత్సవ కమిటీ ప్రగాఢ విశ్వాసం.

ఘనంగా స్వర్ణోత్సవాలు

రెండున్నర దశాబ్దాలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నివాసముంటున్న లక్ష్మికి ఈ కాలంలో అక్కడ జరిగిన అభివృద్ధిపై సంపూర్ణ అవగాహన ఉంది. అక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, సామాజిక అంశాలు కూడా ఆమెకు సుపరిచితమే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతటా స్వర్ణోత్సవ సంబరాలు జరుగుతున్న ఈ సమయంలో దేశ విదేశాల నుంచి విచ్చేసే చిత్రకారులు, హస్తకళాకారులు తమ తమ చేతులలో రూపొందిన కళాఖండాలను దుబాయి ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు. సరసమైన ధరలకు అమ్మకానికి పెడతారు.

ఏటా నిర్వహించే ఎగ్జిబిషన్ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. లక్ష్మి కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సాధించిన అతి ముఖ్యమైన 50 విజయాలు, అభివృద్ధి అంశాలను ప్రాతిపదికగా ఎంచుకుని 50 సంవత్సరాల ప్రగతిని ప్రతిబింబించేలా అక్రిలిక్ మిక్స్డ్ మీడియా పెయింటింగులను ఫ్రేమ్డ్ కాన్వాస్‌ల మీద చిత్రీకరించారు. ఈ శుభవేళ మన తెలుగింటి ఆడబడుచు వక్కలంక లక్ష్మీ తన వినూత్నమైన కళాఖండాలతో అందరి మన్ననలు పొందాలని, మన తెలుగు రాష్ట్రాలతో పాటు భారత దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప చేయాలని కోరుకుందాం.

యేచన్ చంద్రశేఖర్

88850 50822


Next Story

Most Viewed