మనసులో మాట:పరోక్ష పెత్తనం కోసమే తంటాలు

by Disha edit |
మనసులో మాట:పరోక్ష పెత్తనం కోసమే తంటాలు
X

సాధారణంగా బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం. శాసనసభ మొదటి సెషన్ ప్రోరోగ్ కాకుండా వాయిదా పడిందనే అనే విషయాన్ని మర్చిపోయి బీజేపీ నాయకులు రాజ్యాంగంపై నమ్మకం లేని వ్యక్తి రాజ్యాంగ ప్రతినిధిని గౌరవిస్తారా? అంటూ అడ్డగోలుగా వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. 1970లో కాసు బ్రహ్మానంద రెడ్డి కాలంలో 2014లో కిరణ్‌కుమార్ రెడ్డి కాలంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయన్న విషయం ఈ జాతీయ పార్టీ నాయకులకు తెలియదేమో? '

రాష్ట్రపతికి ఉన్న అధికారాలు, విధులు రాష్ట్రస్థాయిలో గవర్నర్‌కు ఉంటాయి. గవర్నర్ నామమాత్రపు అధిపతి. నిజమైన అధికారం ముఖ్యమంత్రికి, మంత్రిమండలికి ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రపాలిత ప్రాంతానికి ఇన్‌చార్జిగా ఉంటారు. అండమాన్, నికోబార్ దీవులు, లడఖ్, జమ్మూ-కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి లాంటి ప్రాంతాలకు సాధారణంగా ఒక ఐఏఎస్ అధికారి లేదా ఐపీఎస్ అధికారి లేదా రిటైర్డ్ న్యాయమూర్తిని అడ్మినిస్ట్రేటర్‌గా నియమిస్తారు.

రాజ్యాంగం ప్రకారం అన్ని కార్యనిర్వాహక అధికారాలను గవర్నర్‌కు కలిగి ఉంటారు. శాసనసభలో మెజారిటీ మద్దతు ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు. శాసనసభలో ప్రభుత్వానికి మద్దతు మెజారిటీ ఉన్నంత కాలం మంత్రిమండలి ఉంటుంది. ఏదైనా బిల్లును పునఃపరిశీలన కోసం శాసనసభ రెండోసారి గవర్నర్‌కు పంపితే, దానికి గవర్నర్ ఆమోదం తెలపాలి. ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సలహాకు లోబడి ఉండాలి. ఈ అధికారాలు లాంఛన ప్రాయమైనవి.

కావాలనే గగ్గోలు

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసించారు. రాజ్యాంగ సవరణలు కావాలనే ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. దానితో రాష్ట్ర వ్యాప్తంగా రసవత్తర చర్చ జరిగింది. ఈ చర్చకు రాజ్‌భవన్ కేంద్రంగా మొదలైందనే ఆరోపణలు వచ్చాయి. గవర్నర్ కోటాలో నామినేట్ చేయాల్సిన ఎంఎల్‌సీ విషయంలో రాజకీయం చేయడంతో ఒక్కసారిగా గ్యాప్ పెరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్యమంత్రి గవర్నర్ 'ఎట్ హోమ్'కు హాజరుకాక‌పోవడం అనుమానాలను పెంచింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం జాతరకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ పాటించలేదని, కొద్ది రోజులుగా గవర్నర్‌కు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడంపై బీజేపీ మండిపడింది.

'రాజ్యాంగాన్ని, మహిళ‌ను అవమానించారని గగ్గోలు పెడుతున్నవారు రాజ్యాంగంలో ఉన్నత పదవిలో కొనసాగుతున్న మహిళల పేరు ఎత్తి అవమానించేది ఎవరో గమనించాలి. సాధారణంగా బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం. శాసనసభ మొదటి సెషన్ ప్రోరోగ్ కాకుండా వాయిదా పడిందనే అనే విషయాన్ని మర్చిపోయి బీజేపీ నాయకులు రాజ్యాంగంపై నమ్మకం లేని వ్యక్తి రాజ్యాంగ ప్రతినిధిని గౌరవిస్తారా? అంటూ అడ్డగోలుగా వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. 1970లో కాసు బ్రహ్మానంద రెడ్డి కాలంలో 2014లో కిరణ్‌కుమార్ రెడ్డి కాలంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయన్న విషయం ఈ జాతీయ పార్టీ నాయకులకు తెలియదేమో?

వారిని నియమిస్తేనే మేలు

సంప్రదాయాలను, చట్టాలను గౌరవించలేనివారికి ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదంటూ, కేసీఆర్‌కు శాపనార్థాలు పెట్టుతూ కేంద్ర ప్రభుత్వం అండ చూసుకొని బెదిరింపులకు దిగడం వలన ఒరిగేదేమీ లేదు. ఆర్టికల్స్ 160, 356, 357 ప్రకారం రాష్ట్రపతి ప్రత్యేకంగా అనుమతించినపుడు, రాష్ట్రపతి పాలన వంటి ఆకస్మిక పరిస్థితులలో తప్ప గవర్నర్‌కు ఎలాంటి పాత్ర లేదా అధికారాలు ఉండవు. ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రివర్గం సలహా లేకుండా గవర్నర్ తనంతట తానుగా ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు అనుమతి లేదు. రాజ్‌భవన్‌తో ప్రగతిభవన్‌కు గ్యాప్ పెరగడం వలననే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చర్చ ఉంది. రాష్ట్రపతి, గవర్నర్ పూర్తిగా రాజకీయ కోణంలో ఎంపిక చేయబడతారు. ప్రభుత్వాలు మారినప్పుడు పాత గవర్నర్లను తొలగించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

గవర్నర్ నిష్పక్షపాతంగా ఉంటూ రాష్ట్ర నాయకులకు వ్యతిరేకంగా వ్యవహరించకూడదన్న నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. బీజేపీయేతర‌ రాష్ట్రాలలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు ముఖ్యమంత్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. 27 డిసెంబర్ 2009న నారాయణ్‌దత్ తివారీ తరువాత ఐపీఎస్ అధికారి నరసింహన్ ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, ఉద్యమం గురించి చెప్పడానికి ఐపీఎస్ నుండి వచ్చిన వారు కాబట్టే సాహసం చేశారు.

రాజకీయాలకు అతీతంగా సీనియర్, విశ్రాంత అధికారులను గవర్నర్లుగా నియమించాల్సిన అవసరం ఉంది. గవర్నర్‌షిప్‌ను 'విలువైన వృద్ధాశ్రమాలు'గా రాజకీయ పరిశీలకులు అభివర్ణించారు. రాజ్‌భవన్ కేంద్రంగా రాజకీయాలు చేసి 1984లో గవర్నర్ రామ్‌లాల్ నందమూరి తారక‌ రామారావు ప్రభుత్వాన్ని అకారణంగా రద్దు చేశారు. నాదెండ్ల భాస్కరరావును 31 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనుమతించడం ఆనాడు సంచలనం కలిగించింది. చివరికి ఏమైందో అందరికి విదితమే. రాజకీయ పునరావాసం కోసం అధికార పార్టీ నాయకులను గవర్నర్ గా నియమించడమే అనర్థాలకు దారి తీస్తున్నదనే విమర్శ ఉంది.

డా. సంగని మల్లేశ్వర్,

కేయూ జర్నలిజం విభాగాధిపతి

వరంగల్, 98662 55355


Next Story