పార్ట్ టైం స్వీపర్లకు..విముక్తి ఎప్పుడు?

by Disha edit |
పార్ట్ టైం స్వీపర్లకు..విముక్తి ఎప్పుడు?
X

వారంతా ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం పార్ట్ టైం స్వీపర్లుగా ఉద్యోగంలో చేరారు. అప్పుడు వారి ‘జీతం’ నెలకు కేవలం 75 రూపాయలు మాత్రమే. దశాబ్దాలు గడిచినా వారికి నేటికీ రెగ్యులర్ స్కేల్ మంజూరు చేయలేదు. పాలకులు అప్పుడో వంద, ఇప్పుడో యాభై రూపాయలు జీతం పెంచారే తప్ప, వారిపై కనికరం చూపలేదు. సర్వీసును క్రమబద్ధీకరించలేదు. ఇంత అన్యాయం జరుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో స్వీపర్ల సమస్యను పరిష్కరించాలని సంఘాలు ఉద్యమించలేదు. ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదు. అసలు వారి పక్షాన నిలబడి గట్టిగా కొట్లాడిన నాథుడే లేడు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నేతలు వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసి, పార్ట్ టైం స్వీపర్లకు రెగ్యులర్ స్కేల్ మంజూరు చేస్తామని నమ్మకంగా చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైతే కాంట్రాక్టు, పార్ట్ టైం అనేదే ఉండదని అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని నమ్మబలికారు. దాంతో స్వరాష్ట్రం ఏర్పాటైతే తమ బతుకులు బాగుపడతాయని స్వీపర్లు గంపెడాశలు పెట్టుకొని, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. చిరుద్యోగులైనప్పటికీ సకల జనుల సమ్మె చేశారు. కానీ, ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడంతో వారి ఆశలన్నీ వమ్ము అయ్యాయి. రెగ్యులర్ స్కేల్ మంజూరు చేసి, తమను ఆదుకోవాలని స్వీపర్లు చేస్తున్న విన్నపాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. ఆర్థిక సమస్యలు వెంటాడి వేధిస్తున్నా, కుటుంబాలు అతలాకుతలం అవుతున్నా ఉద్యోగంలో కొనసాగుతున్న రాష్ట్రంలోని పార్ట్ టైం స్వీపర్ల (కాంటింజెంట్ ఉద్యోగుల) దీన స్థితి ఇది.

రోజుకి రూ. 173 జీతమా?

1979 నుంచి 1989 వరకు పాఠశాలల అవసరాల దృష్ట్యా స్వీపర్ పోస్టులు మంజూరు చేసి భర్తీ చేశారు. అలా నియామకమైన వారిలో మెజారిటీ స్వీపర్లు ఇప్పటికే రిటైరయ్యారు. కొందరు సర్వీస్‌లో ఉండగానే చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది వరకు పార్ట్ టైం స్వీపర్లు (పీటీఎస్) జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. 1979లో వీరికి నిర్దేశించిన జీతం నెలకు 75 రూపాయలే. పదేళ్లకు వీరి జీతం 150 రూపాయలు. ఆ తర్వాత 1991లో రూ.350, 1994లో రూ.500, 2003లో రూ.780, 2006లో రూ.1,071 , జులై 2008లో రూ. 1,298కి పెంచారు. డిసెంబర్ 2010లో రూ.1623కి, సెప్టెంబర్ 2019 నుంచి రూ.4000కి పెంచి, 15 జూన్, 2021 నుంచి నెలకు 5200 రూపాయలు చెల్లిస్తున్నారు. రెగ్యులర్ ఆఫీస్ సబార్డినేట్స్ (అటెండర్లు)కు ఏ మాత్రం తీసిపోకుండా విధులు నిర్వహించే స్వీపర్లకు చెల్లించే వేతనం రోజుకు 173 రూపాయల 33 పైసలు. నైపుణ్యం లేని దినసరి కూలీలు సైతం రాష్ట్రంలో రోజుకు రూ.600 నుంచి రూ.1000 పొందుతున్న ఈ రోజుల్లో పార్ట్ టైం స్వీపర్లకు ప్రభుత్వం ఇస్తున్న వేతనం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీస వేతనాల చట్టం ప్రకారం చూసినా స్వీపర్లకు ఎంతో అన్యాయం జరుగుతోంది.

వర్క్ ఫుల్, సౌకర్యాలు నిల్!

అలాగే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉండే ఏ సౌకర్యమూ స్వీపర్లకు లేదు. సెలవులు లేవు. అత్యవసర పరిస్థితి ఉండి లీవ్ పెడితే, ఆ మేరకు వేతనంలో కోతే! మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీం, నగదు రహిత వైద్యానికి అర్హులు కారు. పీఆర్సీలు ఉండవు. కరవు భత్యం, అలవెన్సుల ఊసే లేదు. దురదృష్టవశాత్తు స్వీపర్ చనిపోతే, ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే. జీవిత భాగస్వామి, పిల్లలకు పెన్షన్ రాదు. కారుణ్య నియామక పథకం వర్తించదు. తనపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వరు. రిటైరైతే పెన్షనరి బెనిఫిట్స్ వర్తించవు. అసలు ప్రభుత్వం దృష్టిలో స్వీపర్లు ఎలాంటి హక్కులు లేకుండా ఇచ్చింది పుచ్చుకునే నెల జీతగాళ్ళు మాత్రమే. ఏ విధమైన సౌకర్యాలు లేకపోయినా, అనేక ఇబ్బందులు ఉన్నా భవిష్యత్తులో తమకు రెగ్యులర్ స్కేలు వస్తుందనే ఒకేఒక ఆశతో మాత్రమే వారు పనిచేస్తున్నారు. పంటి బిగువున బాధలను భరిస్తూ ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్వీపర్లు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేయాలి. ఆ తర్వాత వారు మరేదైనా పార్ట్ టైం పని చేసుకోవాలని ప్రభుత్వ ఉద్దేశం. పార్ట్ టైం పనులు ఎక్కడ దొరుకుతాయి? పార్ట్ టైం ఉద్యోగం చేసే సంస్కృతి, ఆ పని విధానం మన దగ్గర ఉందా? అయినా, వారు పేరుకే పార్ట్ టైం ఉద్యోగులు పని మాత్రం ఫుల్ టైం చేయాల్సిందే. వారితో మూడు, నాలుగు దశాబ్దాల నుంచి అరకొర జీతాలు చెల్లిస్తూ స్వీపర్లతో గొడ్డుచాకిరీ చేయిస్తున్నారు.

రెగ్యులర్ స్కేల్ ఇచ్చేదెన్నడో!?

1993 నవంబర్ 25 నాటికి 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన స్వీపర్లకు రెగ్యులర్ స్కేల్ మంజూరు చేసి, అటెండర్లుగా నియమించాలని 22 ఫిబ్రవరి, 1994 న ఉమ్మడి రాష్ట్రంలో 212 జీవో జారీ అయింది. ఈ జీవో ప్రకారం రెగ్యులర్ స్కేల్ పొందడానికి అర్హత కల్గిన స్వీపర్లు వెయ్యి మందికి పైగానే వివిధ జిల్లాల్లో ఉన్నారు. జీవో జారీ అయి మూడు దశాబ్దాల పుణ్యకాలం గడిచినా నేటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఓ వైపు వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లు లేరు. కనీసం గంట కొట్టే దిక్కులేక పాఠశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హెడ్మాస్టర్లు, టీచర్లే గంట కొట్టే దుస్థితి రాష్ట్రంలోని వందలాది స్కూళ్లలో ఉంది. మరో వైపు స్వీపర్లను మాత్రం అటెండర్లుగా నియామకం చేయడం లేదు. ఇంత అన్యాయం మరెక్కడైనా ఉంటుందా? పైగా, స్వీపర్లకు అటెండర్లుగా నియమించడానికి అదనపు గ్రాంటు అవసరమే లేదు. ఖాళీ అటెండర్ పోస్టులకు కూడా ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లోనే జీతాల గ్రాంటు కేటాయిస్తుంది కాబట్టి, ఆ గ్రాంటు నుంచే వేతనాలు చెల్లించవచ్చు. అదనంగా ఒక్క నయా పైసా భారం పడకుండా స్వీపర్లను ఆదుకునే వీలున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం స్వీపర్లకు అంతులేని ఆవేదన కలిగిస్తోంది. యూనివర్సిటీ విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా, ఆర్థికంగా భారమైనా కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించిన రాష్ట్ర ప్రభుత్వం, చిరుద్యోగులైన స్వీపర్ల గోడు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాదు.

సంఘాలు చొరవ చూపాలి..

ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పట్ల చిత్తశుద్ధితో కృషిచేయడం లేదని స్వీపర్లు ఆవేదన చెందుతున్నారు. వీరి డిమాండ్‌ను ప్రభుత్వం ముందు పెట్టి ప్రజల మద్ధతు పొందుతున్న సంఘాలు తమ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం లేదని వాపోతున్నారు. గత్యంతరం లేక గత 50 రోజులుగా రెగ్యులర్ స్కేల్ వర్తింపజేయాలని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన విరమించకూడదని స్వీపర్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. నిజానికి జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టులను స్వీపర్లకు రెగ్యులర్ స్కేలు మంజూరుతో భర్తీ చేస్తే సగం సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అటెండర్లు లేని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పోస్టులు శాంక్షన్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇక 212 జీవో పరిధిలో లేని స్వీపర్లకు రెగ్యులర్ స్కేల్ మంజూరుకు అవసరమైతే జీవోను సవరించైనా సరే, సమస్యను పరిష్కరించాలి.

పార్ట్ టైం స్వీపర్లను ఆదుకోండి

అయితే ఇది ముఖ్యమంత్రి స్వయంగా చొరవ తీసుకుంటేనే సాధ్యమవుతుంది. ఈ చర్యతో ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ల కొరత కూడా తీరుతుంది. అలాగే ఎలాంటి పెన్షన్, పెన్షనరి బెనిఫిట్స్ ఇవ్వకుండానే ఉద్యోగ విరమణ చేయించి ఖాళీ చేతులతో ఇంటికి పంపించిన స్వీపర్లపై కాస్తయినా కనికరం చూపి వారికి ఆర్థిక సహాయం చేయాలి. ఇప్పటికైనా వారి సమస్య పరిష్కారానికి ఉద్యోగ సంఘాలు చొరవ తీసుకోని వారికి అండగా నిలచి సమస్యను వెంటనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి. రాష్ట్రంలో వీఆర్ఏలకు రెగ్యులర్ స్కేల్, ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్, స్వీపర్ల దయనీయ స్థితిని కూడా మానవీయకోణంలో, సానుభూతితో పరిశీలించాలి. సత్వరం రెగ్యులర్ స్కేల్ మంజూరు చేసి, పార్ట్ టైం స్వీపర్లను ఆదుకోవాలి.

-మానేటి ప్రతాపరెడ్డి,

TRTF గౌరవాధ్యక్షుడు,

98484 81028


Next Story

Most Viewed