తెలంగాణ ఉద్యోగులకు స్పౌజ్ బదిలీ బాధలు తీరవా!

by Disha edit |
తెలంగాణ ఉద్యోగులకు స్పౌజ్ బదిలీ బాధలు తీరవా!
X

ప్రభుత్వానికి, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఎక్కువ మంది స్పౌజ్ బాధితులు ఉన్న హన్మకొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగా ఉన్నా కూడా విద్యాశాఖ అధికారులు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఒంటరి మహిళలు వితంతువులది మరో సమస్య. ప్రత్యేక కేటగిరీలో వారికి అవకాశం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు తగిన చర్యలు తీసుకోలేదు. మెమో నంబర్ 1655 కు అనుగుణంగా ఇప్పటికైనా 13 జిల్లాలలో నిలిచిపోయిన స్పౌజ్ బదిలీలను వెంటనే చేపట్టాలి.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 317 ప్రకారం కొంతకాలం క్రితం ఉద్యోగులు, ఉపాధ్యాయులను బదిలీ చేశారు. దీని ప్రకారం దంపతులు విడిపోయి వేరువేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వారి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో ఉండడంతో పిల్లలు ఎవరితో ఉండాలో, వారెక్కడ చదువుకోవాలో, వారు ఏ జిల్లా పరిధిలోకి వస్తారో తెలియని మానసిక ఒత్తిడిలో నలిగిపోతున్నారు.

నూతన జోనల్ వ్యవస్థకు అనుగుణంగా చేపట్టిన బదిలీలలో, క్యాడర్‌వారీగా సీనియార్టీ ఆధారంగా ఉపాధ్యాయులను బదిలీ చేశారు. ఈ క్రమంలో దాదాపు ఐదు వేల మంది భార్యాభర్తలు చెరొక జిల్లాకు బదిలీ అయ్యారు. తర్వాత 19 జిల్లాలలో స్పౌజ్ బదిలీలకు అనుమతిచ్చిన ప్రభుత్వం 13 జిల్లాలను బ్లాక్‌లో పెట్టింది. దీంతో సుమారు 2,069 మంది ఉపాధ్యాయులు గత ఎనిమిది నెలలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం కనికరించడం లేదు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేస్తే ఫలితాలు బాగుంటాయి. మానవత్వంతో అన్ని జిల్లాలలో స్పౌజ్ బదిలీలు జరపాలన్న ముఖ్యమంత్రి మాట అమలు కావడం లేదు.

ఆ సాకుతో

ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేస్తూ నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2018 ఆగస్టు 29న వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు నంబర్ 128 విడుదల చేసి 33 జిల్లాలతో కూడిన నూతన జోనల్ వ్యవస్థను ఏప్రిల్ 2021 నుంచి అమలుకు తెచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ శాఖలవారీగా పోస్టుల లోకల్ క్యాడర్ క్లాసిఫికేషన్ ఉత్తర్వులు విడుదల చేసింది. సీనియార్టీ ప్రాతిపదికన డిసెంబర్ 6, 2021న జీఓ 317 అమలుకు తెచ్చి అలకేషన్ ప్రక్రియ పూర్తి చేసింది.

ఈ సందర్భంలో ఉపాధ్యాయ, ఉద్యోగ దంపతులు ఒకే జిల్లాలో పనిచేయాలనే తలంపుతో ప్రభుత్వం మెమో నంబర్ 1655 విడుదల చేసింది. దీనికి అనుగుణంగా 19 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 2,400 స్పౌజ్ బదిలీలు విద్యాశాఖ పూర్తి చేసింది. మిగతా 13 జిల్లాలలో దరఖాస్తులు ఎక్కువగా ఖాళీలు తక్కువ ఉన్నాయని, రిక్రూట్మెంట్ సమస్య తలెత్తుతుందని అక్కడ బదిలీల కౌన్సిలింగ్ జరపకుండా బ్లాక్ చేసింది. దీంతో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, హన్మకొండ, ఖమ్మం, సిద్దిపేట, పాలమూరు, మంచిర్యాల మరియు సూర్యపేట్ జిల్లాలలో దాదాపుగా 2,069 ఉపాధ్యాయ దంపతుల గోడు పట్టించుకునే వారే కరువయ్యారు.

దానిపై ప్రభావం ఎక్కువ

స్పౌజ్ బాధితులలో అధికంగా ఐదు సంవత్సరాల పిల్లలు ఉన్న దంపతులు ఉన్నారు. వీరు ప్రతి రోజు ఉదయం 4-5 గంటలకు బయలుదేరి సుమారు 100-300 కిలోమీటర్లు ప్రయాణం చేసి రాత్రి 8-9 గంటలకు ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో పిల్లల ఆలనా పాలనా చూసేవారు కరువయ్యారు. ఆరోగ్యం సరిగా లేని వృద్ధ తల్లిదండ్రులు, అత్తమామలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుటుంబాన్ని వదిలి దూరప్రాంతాలకు వెళుతూ ఉపాధ్యాయులు తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో మనశ్శాంతిగా ఉండలేకపోవడం, దూర ప్రయాణం వలన అలసట వెరసి బోధన సామర్థ్యం, నాణ్యత పై తీవ్ర ప్రభావం చూపుతున్నది.

ప్రభుత్వానికి, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఎక్కువ మంది స్పౌజ్ బాధితులు ఉన్న హన్మకొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగా ఉన్నా కూడా విద్యాశాఖ అధికారులు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఒంటరి మహిళలు వితంతువులది మరో సమస్య. ప్రత్యేక కేటగిరీలో వారికి అవకాశం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు తగిన చర్యలు తీసుకోలేదు. మెమో నంబర్ 1655 కు అనుగుణంగా ఇప్పటికైనా 13 జిల్లాలలో నిలిచిపోయిన స్పౌజ్ బదిలీలను వెంటనే చేపట్టాలి.

అంకం నరేశ్

63016 50324

Next Story

Most Viewed