తెలుగుదేశం ఏర్పాటు... నవ చరిత్రకు మలుపు

by Disha edit |
తెలుగుదేశం ఏర్పాటు... నవ చరిత్రకు మలుపు
X

1982 మార్చి 29న సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నాలుగు దశాబ్దాల క్రితం నందమూరి తారక రామారావు అమృత హస్తాల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ భారత రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తెలుగు సినీ వినీలాకాశంలో తనను ధ్రువతారగా నిలిపిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని ఎన్టీఆర్ తపన, ఆశయం నుండి తెలుగుదేశం ఉద్భవించింది. తనను ఆదరించి జీవితంలో ఇంత వాణ్ణి చేసిన తెలుగు ప్రజలను సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించడానికి ఎన్టీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు పూర్తి చేసుకొని 41 వ ఏట అడుగిడుతున్నది. తెలుగుదేశం 22 ఏళ్ళు తెలుగుప్రజలను పాలించింది. కేంద్రంలో కనీసం అయిదు ప్రభుత్వాలు ఏర్పడటానికి, మనగలగడానికి కారణం అయింది. దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడలేక, దారి తెన్నూ తెలియక దిక్కుతోచని స్థితిలో వున్న ప్రతిపక్షాలను ఏకం చేసిన ఘనత, అనతికాలంలోనే ప్రత్యామ్నాయ సంకీర్ణాన్ని నిర్మించిన చరిత్ర కూడా తెలుగుదేశానిదే.

చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్

ఒక ప్రాంతీయ పార్టీని పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిపిన ఘనత తెలుగుదేశానిదే. ఎవరు అనుకోని విధంగా వందేళ్ల కాంగ్రెస్ పార్టీని 9 నెలల్లో కూకటి వేళ్ళతో పెకలించి వెయ్యడం భారతదేశ చరిత్రలో ఎరుగనిది. ఎన్టీఆర్ తనకు తాను సృష్టించి చరిత్ర అది. యావత్తు భారత దేశంలోనే అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించిన పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీ 40 ఏళ్ళకు పైగా మనగలగడం చిన్న విషయం కాదు. తెలుగువారంతా పచ్చగా వుండాలని, అన్ని రంగాల్లో తెలుగువాడు ముందుండాలని తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష, లక్ష్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకనే సమాజంలోని అణగారిన వర్గాలకు కులాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చింది. బడుగుల బతుకుల్లో పచ్చదనం నింపి, నిరుపేదల ఆకలి తీర్చి గూడులేని దీన జనులకు నీడనిచ్చిన పార్టీ తెలుగుదేశం. మహోజ్వలంగా మొదలైన తెలుగుదేశం ప్రస్థానం 40 ఏళ్ళు పూర్తి చేసుకొన్నది. ఈ 40 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుంటూ చరిత్ర గతిలో తన ఉనికిని బలంగా చాటుకుంటూనే వున్నది. ఎన్నడూ ఓటమికి నిరాశతో వెనకడుగు వేసి ఎరుగదు, సంక్షోభం ఎదురైనప్పుడల్లా మహోత్సాహంతో ముందడుగు వేస్తూనే వుంది.

తొమ్మిది నెలల్లో అధికారం కైవసం

1982 మార్చి 29న ఆవిర్భావం నుండి 2023 మార్చి 29 వరకు తెలుగుదేశం స్థాపించి నాలుగు దశాబ్దాలు.ఇది తక్కువ సమయం కాదు. ఈ 41 ఏళ్లలో ఎన్టీఆర్ 13 ఏళ్ళు పార్టీ అధ్యక్షుడుగా వుండగా, నారా చంద్రబాబు నాయుడు 28 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.ఎన్టీఆర్ 8 ఏళ్లు ముఖ్యమంత్రిగా వుండగా,చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా వున్నారు, మొత్తం ఈ 40 ఏళ్లలో 22 ఏళ్లు అధికారంలో వున్నది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు అది ఇన్నేళ్లు మనగలుగుతుందని,ఇంతకాలం తెలుగు ప్రజలను ఏలగలుగుతుందని ఎవరు అనుకోని వుండరు. వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కూడా అనుకోని వుండరు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే 200 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వస్తుందని అనుకోని వుండరు. తెలుగుదేశం ఏకపక్ష విజయం ప్రపంచాన్ని అబ్బురపరిచింది. విలక్షణ రాజకీయ పక్షంగా తెలుగుదేశాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్, చంద్రబాబు అహర్నిశలు కృషి చేశారు. తెలుగుదేశం రాష్ట్రానికి, ప్రజలకు చేసిన మేలు ఏమిటి? తెలుగు ప్రజల వల్ల తెలుగుదేశం లాభపడిందా? తెలుగుదేశం వల్ల తెలుగు ప్రజలు లాభపడ్డారా? వంటి ప్రశ్నలు వున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం తన బాధ్యతను నిర్వహించడంలో అన్ని పార్టీల కన్నా ముందున్నది. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలుగుదేశం నిర్వహించిన పాత్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో తెచ్చిన మార్పులు, ప్రవేశపెట్టిన ఆలోచనలు ప్రజల, రాష్ట్రాభివృద్ధికి దోహదపడ్డాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అధికారంలో ఎన్నాళ్ళు వున్నామన్నదానికంటే ఆ సమయంలో రాష్ట్రానికి, సమాజానికి ఎంత మేలు చేసింది అనేది ముఖ్యం.

జనకేంద్రక రాజకీయం..

రాష్ట్ర రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ప్రవేశం రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేసింది. అంతకుముందు చాటు మాటు రాజకీయాలను జనంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే. ఈ రోజు జనంలో ఇంత రాజకీయ చైతన్యం వచ్చిందంటే అది ఎన్టీఆర్ పుణ్యమే. అసలు ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ఆ సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన పార్టీ. పేద ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలన్న తపన పట్టుదలలో ఎన్టీఆర్ తర్వాతనే అని చెప్పాలి. కాలే కడుపుకు పట్టెడు అన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకు అన్నారు ఆయన. పేదవాడికి కిలో 2 రూపాయలకే బియ్యం, కూడు, గుడ్డ, నీడ కల్పించడాన్ని మించిన కమ్యూనిజం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దేవుడు ఇచ్చిన భూమికి శిస్తు ఏమిటి రైతన్న అన్నారు. భూమి శిస్తు రద్దు చేశారు. దేశంలో మొదటిసారి సంక్షేమ రాజ్యానికి బలమైన పునాదులు వేసి పేదల గుండెల్లో శాశ్వత బంధువుగా నిలిచిపోయిన మహానాయకుడు ఎన్టీఆర్. పాలన సంస్కరణల్లో కొత్త ఒరవడి తెచ్చి అభివృద్ధిని ముందడుగు వేయించిన దార్శనికుడు. వ్యవసాయం, చేతి వృత్తులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వసతులు, సౌకర్యాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కొత్త రీతిలో ఆలోచనలు చేసి కార్యక్రమాలు రూపొందించిన పార్టీ తెలుగుదేశం. విద్యుత్, సాగు, తాగు నీరు, రహదారులు, సబ్సిడీ బియ్యం, వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసింది. కృష్ణానదిలో మిగులు జలాలు వాడుకోవచ్చని కనిపెట్టి హంద్రీ-నీవా, గాలేరు -నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన దార్శనికుడు ఎన్టీఆర్. నీతి నిజాయితీలు,పేద ప్రజల గురించే చివరి వరకు తపన పడిన ఎన్టీఆర్ ముద్ర రాజకీయాలపై చెరగనిది. ఇప్పటికి పేద ప్రజల హృదయాల్లో ఆయన బొమ్మ చెక్కు చెదరనిది.

తెలుగుదేశంలో మలిదశ నారా చంద్రబాబు నాయుడిది. నలభై ఏళ్లలో 28 ఏళ్ళ అధ్యాయం చంద్రబాబుదే. ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు నిరంతరం శ్రమించారు. 28 ఏళ్ళుగా పార్టీ అధ్యక్షుడుగా వున్న చంద్రబాబు అందులో 14 ఏళ్ళు అధికారంలో ఉండి ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కించారు. నిరంతరం పని చేయడం ఆయన వ్యాపకం. ప్రజల వద్దకు అధికారులను పంపి పరిపాలన ప్రజలకు చేరువ చేశారు. సంస్కరణలు, టెక్నాలజీ, వంటి రంగాల్లో ప్రపంచ గమనం ఎలా ఉన్నది, భవిష్యత్ ఎలా వుండబోతుంది అనే విషయాలు సుదీర్ఘంగా ఆలోచించి ఆంధ్రప్రదేశ్‌ను అందుకు అనుగుణంగా పాలన సాగించి ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచంలో గుర్తింపు తెచ్చింది తెలుగుదేశమే. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను ఆకళింపుచేసుకొని భవిష్యత్‌ను ముందుగానే ఊహించి ఆధునికతను అందిపుచ్చుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచంలో గుర్తింపు తెచ్చారు ఆయన.

ఐటీ విప్లవంలో అగ్రగామి

ప్రపంచంలో ఐటి విప్లవం రాగానే దూరదృష్టితో చంద్రబాబు ఐటిని హైదరాబాద్‌కు తెచ్చి తెలుగుజాతికి ఐటిని పరిచయం చేసి సామాన్యులను సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దారు. చంద్రబాబు చేసిన కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. టైమ్ మ్యాగజైన్ చంద్రబాబుని సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తిస్తే, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చంద్రబాబును ప్రపంచ డ్రీమ్ క్యాబినెట్‌లో ఉండాల్సిన వ్యక్తిగా ఎంపిక చెయ్యడం గర్వకారణం. ఇండియా టుడే పత్రిక చంద్రబాబును ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీయంగా సత్కరిస్తే, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎకనామిక్ టైమ్స్ గౌరవించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొనడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం రావడం అనేది చంద్రబాబు తోనే ప్రారంభం అయింది. చంద్రబాబు ఆధునిక పాలన అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించింది. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, మెడికల్ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చెయ్యడంతో ఆర్థిక వ్యవస్థ బలపడింది. విద్యుత్, విద్య, రహదారులు, వైద్యం వంటి సదుపాయాలు ఏర్పడ్డాయి. అభివృద్ధి వేగం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది, ఆర్ధిక విధానాలను, అభివృద్ధి రాజకీయాలను నమ్ముకున్న రాష్ట్ర స్థాయి నేతలతో అగ్రగణ్యుడు చంద్రబాబు.

తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ మరణానంతరం కూడా అంతే స్థాయిలో నిలబెట్టడం చంద్రబాబు సాధించిన అపూర్వ ఘనత. ఎన్టీఆర్ వేసిన పునాదిపై చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సౌధాన్ని చెక్కు చెదరకుండా పటిష్టంగా నిర్మించారు. తన వినూత్న విధానాలతో, కార్యక్రమాలతో, రాష్ట్రాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టడానికి నిరంతరం శ్రమించింది తెలుగుదేశం పార్టీ. 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ తరుణంలో ఎన్టీఆర్ ఏ ఆశయాల కోసం అయితే కలలు కన్నారో వాటిని సాకారం చేయడానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలి. ఆంధ్రప్రదేశ్‌లో నేడు నెలకొన్న అవాంఛనీయ, సంక్షోభ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రక అవసరం. ఈ 41 ఏళ్ల వేడుకతో మరోసారి తెలుగోడి సత్తా చాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర భవిష్యత్ కోసం మరో పోరాటానికి పసుపు సైనికులు కార్యోన్ముఖులు కావాల్సిన సమయం ఆసన్నమైంది.

(నేడు తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం)

- టీ.డి జనార్ధన్

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ ౭౯౯౫౮౬౬౬౭౨

ఇవి కూడా చదవండి:

మారిన రాజకీయ పరిస్థితులు... జగన్ భయమేంటి?

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా టీడీపీ 41 వసంతాల సెలబ్రేషన్స్


Next Story

Most Viewed